Last Updated:
ఐపీఎల్ 2026లో ఆర్సీబీ ఢిల్లీ క్యాపిటల్స్ను చిన్నస్వామిలో చిత్తు చేసింది, ఢిల్లీ 75కే ఆలౌట్, దేవదత్ పడిక్కల్ మెరుపుతో ఆర్సీబీ సులభ విజయం, ప్లేఆఫ్స్ స్థానం బలపడింది
ఐపీఎల్ 2026 సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. సోమవారం దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఆతిథ్య దిల్లీ క్యాపిటల్స్ను ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఈ విజయంతో బెంగళూరు ఈ సీజన్లో ఆరో విజయాన్ని అందుకోగా, దిల్లీ వరుసగా మూడో ఓటమితో పీకల్లోతు కష్టాల్లో పడింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దిల్లీ క్యాపిటల్స్కు ఆర్సీబీ బౌలర్లు చుక్కలు చూపించారు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్వుడ్ నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడ్డారు. దీంతో దిల్లీ టాప్ ఆర్డర్ పేకమేడలా కూలిపోయింది. కేవలం 8 పరుగుల స్కోరు వద్దే 6 వికెట్లు కోల్పోయి దిల్లీ అత్యంత దయనీయ స్థితికి చేరుకుంది. సాహిల్ పరాఖ్, సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్ వంటి కీలక ఆటగాళ్లు పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరగా.. కేఎల్ రాహుల్ (1), నితీశ్ రాణా (1) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. పవర్ ప్లే (6 ఓవర్లు) ముగిసేసరికి దిల్లీ స్కోరు కేవలం 13/6. ఐపీఎల్ చరిత్రలో పవర్ ప్లేలో నమోదైన అత్యల్ప స్కోరు ఇదే కావడం గమనార్హం.
చెత్త రికార్డు నుంచి తప్పించిన పొరెల్
ఒక దశలో ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప స్కోరుకు ఆలౌట్ అవుతుందనుకున్న దిల్లీని అభిషేక్ పొరెల్ (30) ఆదుకున్నాడు. ఏడో స్థానంలో వచ్చి బాధ్యతాయుతంగా ఆడిన పొరెల్ జట్టు స్కోరును 75 పరుగులకు చేర్చాడు. డేవిడ్ మిల్లర్ (19), కైల్ జేమీసన్ (12) అతనికి సహకరించడంతో దిల్లీ గౌరవప్రదమైన స్కోరునైనా సాధించగలిగింది. చివరకు 16.3 ఓవర్లలో 75 పరుగుల వద్ద దిల్లీ ఇన్నింగ్స్ ముగిసింది.
బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన స్పెల్తో ఆకట్టుకున్నాడు. కేవలం 5 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని కోలుకోనివ్వలేదు. జోష్ హేజిల్వుడ్ 4 వికెట్లతో దిల్లీ వెన్నుముక విరిచాడు. రసిఖ్ సలామ్, సుయాశ్ శర్మ, కృనాల్ పాండ్య తలో వికెట్ సాధించి తమ వంతు పాత్ర పోషించారు.
76 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ కేవలం 6.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్ జాకబ్ బెతెల్ (20) అవుట్ అయినప్పటికీ, దేవ్దత్ పడిక్కల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. పడిక్కల్ కేవలం 13 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 34 పరుగులు* చేసి అజేయంగా నిలిచాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (23*) తనదైన శైలిలో రెండు సిక్సర్లతో ఇన్నింగ్స్ను ముగించాడు. దిల్లీ బౌలర్లలో జేమీసన్కు మాత్రమే ఒక వికెట్ దక్కింది. ఈ ఘనవిజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోగా, బ్యాటింగ్ వైఫల్యంతో కొట్టుమిట్టాడుతున్న దిల్లీ క్యాపిటల్స్ తదుపరి మ్యాచ్లకైనా పుంజుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్, మ్యాచ్ అప్డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Hyderabad,Telangana
Apr 27, 2026 10:01 PM IST













