Last Updated:
Jadumani Singh: కామన్వెల్త్ గేమ్స్ (CWG 2026)లో భారత బాక్సింగ్ విభాగానికి శుభారంభం లభించింది. పురుషుల 55 కేజీల విభాగంలో భారత యువ బాక్సింగ్ సంచలనం జాదుమణి సింగ్ (Jadumani Singh) అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
ప్రిక్వార్టర్స్ (రౌండ్ 16)లో పాకిస్థాన్కు చెందిన బాక్సర్ సుమామ రెహమాన్ను చిత్తుగా ఓడించి క్వార్టర్ ఫైనల్స్కు సగర్వంగా దూసుకెళ్లాడు. ఈ విజయంతో బాక్సింగ్లో భారత్కు పతక ఆశలు మరిన్ని సజీవంగా మారాయి. ఆదివారం రాత్రి అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన రౌండ్-16 పోరులో 22 ఏళ్ల మణిపూర్ బాక్సర్ జాదుమణి సింగ్ ఆరంభం నుంచే ప్రత్యర్థిపై ఆధిక్యం ప్రదర్శించాడు. రింగ్లో వేగవంతమైన పంచ్లతో విరుచుకుపడుతూ, పాక్ బాక్సర్ సుమామ రెహమాన్కు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. తొలి రౌండ్లో బై దక్కడంతో నేరుగా ప్రిక్వార్టర్స్లోకి అడుగుపెట్టిన పాక్ బాక్సర్కు జాదుమణి పంచ్ల దాటికి సమాధానం లేకుండా పోయింది. చివరికి 5-0 తేడాతో ఏకపక్ష విజయాన్ని నమోదు చేసి క్వార్టర్స్కు అర్హత సాధించాడు.
1999 కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్పై భారత్ సాధించిన విజయానికి గుర్తుగా ఏటా జులై 26న ‘కార్గిల్ విజయ్ దివస్’ నిర్వహిస్తారు. సరిగ్గా ఇదే ప్రత్యేకమైన రోజున పాక్ బాక్సర్పై భారత్ విజయం సాధించడంతో జాదుమణి సింగ్ గెలుపు మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. మ్యాచ్ అనంతరం విజయోత్సాహంతో మాట్లాడిన జాదుమణి, తన విజయాన్ని దేశం కోసం ప్రాణాలర్పించిన కార్గిల్ అమరవీరులకు అంకితమిస్తున్నట్లు ప్రకటించాడు.
“మన కార్గిల్ హీరోలకు నా ఈ విజయం అంకితం. పాకిస్థాన్ బాక్సర్పై విజయం సాధించినందుకు ఎంతో గర్వపడుతున్నాను. రాబోయే క్వార్టర్ ఫైనల్స్లోనూ మరింత మెరుగైన ప్రదర్శన చేసి ముందుకు సాగుతా. ఈ పోటీల్లో భారత్కు స్వర్ణ పతకం (బంగారు పతకం) సాధించడమే నా ప్రధాన లక్ష్యం” అని జాదుమణి ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు.
కార్గిల్ విజయ్ దివస్ నాడే పాకిస్థాన్పై ఈ ఘన విజయం సాధించడంతో భారత క్రీడాభిమానులు, నెటిజన్లు జాదుమణి సింగ్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్, మ్యాచ్ అప్డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Hyderabad,Telangana
Jul 27, 2026 12:02 PM IST














