Last Updated:
కావేరీ జలాల వివాదం కన్నడనాట మళ్లీ రాజుకుంది. కర్ణాటకలోని మాండ్యాలో తమిళనాడు సీఎం, హీరో విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా ప్రదర్శనను నిరసనకారులు అడ్డుకున్నారు. పోస్టర్లు చించివేసి, థియేటర్ వద్ద ఆందోళనకు దిగడంతో యాజమాన్యం షోలను రద్దు చేసింది.
కర్ణాటకలో విజయ్ దళపతి నటించిన జన నాయగన్ సినిమాకు బ్రేక్ పడింది. ఇందుకు ప్రధాన కారణం.. కావేరీ జలాలు. తమిళనాడుకు ప్రతిరోజూ 3,500 క్యూసెక్కుల చొప్పున 15 రోజుల పాటు కావేరీ జలాలను విడుదల చేయాలని కావేరీ వాటర్ రెగ్యులేషన్ కమిటీ ఇటీవల ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కర్ణాటకలోని మాండ్యా జిల్లాలో రైతులు, కన్నడ సంఘాల నాయకులు భారీ ఎత్తున ఆందోళన బాట పట్టారు. ఈ ఆందోళనల సెగ తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి, సినీ నటుడు దళపతి విజయ్ నటించిన కొత్త సినిమా ‘జన నాయగన్’కు గట్టిగానే తగిలింది. మాండ్యాలోని గురుశ్రీ థియేటర్లో ఈ సినిమా ప్రదర్శిస్తుండగా నిరసనకారులు అక్కడికి చేరుకుని తీవ్ర స్థాయిలో ఆందోళనకు దిగారు.
కన్నడ సంఘాల కార్యకర్తలు ఒక్కసారిగా థియేటర్ వద్దకు దూసుకొచ్చి సినిమా పోస్టర్లను చించివేశారు. తమిళనాడుకు నీళ్లు ఇవ్వబోమని నినాదాలు చేస్తూ ప్రదర్శనను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. ఆందోళనకారులతో థియేటర్ యాజమాన్యం జరిపిన చర్చల అనంతరం సినిమా షోలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో నిరసనకారులు శాంతించి అక్కడి నుంచి వెనుదిరిగారు.
వర్షాభావ పరిస్థితుల కారణంగా కర్ణాటకలో ఇప్పటికే తీవ్ర కరువు నెలకొందని రైతు సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు న్యూస్18 ఇంగ్లీష్ కథనం పేర్కొంది. తాగునీటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో తమిళనాడుకు నీళ్లు విడుదల చేయడం సరికాదని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న విజయ్ నటించిన సినిమాను ఇక్కడ ప్రదర్శించడం ఏంటని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కావేరీ కమిటీ ఆదేశాలను వ్యతిరేకిస్తూ జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక వినతి పత్రం కూడా సమర్పించారు.
కావేరీ జలాల వివాదంపై తదుపరి కార్యాచరణను ఖరారు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం సన్నద్ధమైంది. ఆగస్టు 2వ తేదీన బెంగళూరులో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వెల్లడించారు. ఈ సమస్యపై ఇప్పటికే కేంద్ర మంత్రులతో కూడా చర్చించినట్లు ఆయన తెలిపారు. మరోవైపు శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా మాండ్యా, మైసూరు ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిరసనల నేపథ్యంలో టైర్లు కాల్చేందుకు ప్రయత్నించిన కొందరిని పోలీసులు అడ్డుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
మాండ్యాలో అవాంతరాలు ఎదురైనప్పటికీ ఇతర ప్రాంతాల్లో ‘జన నాయగన్’ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ.260 కోట్లకు పైగా వసూలు చేసింది. విజయ్ సినీ కెరీర్ లో చివరి సినిమాగా చెబుతున్న ఈ ప్రాజెక్టులో బాబీ డియోల్, పూజా హెగ్డే లాంటి భారీ తారాగణం నటించారు. అయితే తాజా కావేరీ జలాల వివాదం కారణంగా కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఈ సినిమా కలెక్షన్లపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana














