Last Updated:
JD Vance: భవిష్యత్తులో ఇరాన్కు సంబంధించిన ఫ్రీజ్ అయిన ఆస్తులను లేదా నిధులను విడుదల చేయాల్సి వస్తే.. వాటిని కేవలం పౌర అవసరాలకే వినియోగించేలా సరికొత్త వ్యూహాన్ని తీసుకురానున్నట్లు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వెల్లడించారు.
ఆ నిధులతో “ఇరాన్ ప్రజల ప్రయోజనం కోసం” అమెరికాకు చెందిన వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసేలా నిబంధనలు పెట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అమెరికా-ఇరాన్ మధ్య సోమవారం తెల్లవారుజామున ముగిసిన మొదటి రౌండ్ చర్చల అనంతరం స్విట్జర్లాండ్లోని బర్గెన్స్టాక్ రిసార్ట్లో జేడీ వాన్స్ విలేకరులతో మాట్లాడారు. ఇరాన్ నిధులు ఎలాంటి సాయుధ ముఠాల చేతుల్లోకి వెళ్లకుండా చూసేందుకు వాషింగ్టన్ కఠినమైన రక్షణ చర్యలను కోరుకుంటోందని ఆయన స్పష్టం చేశారు.
“ఒకవేళ మేము ఇరాన్ ఆస్తులను ఎప్పుడైనా అన్ఫ్రీజ్ (విడుదల) చేస్తే, ఆ సొమ్ము ఇరాన్ ప్రజల సహాయానికే ఉపయోగపడాలి తప్ప.. ఉగ్రవాదానికి నిధులుగా మారకూడదు. అలాంటి ఒక పటిష్టమైన విధానాన్ని ఏర్పాటు చేయాలని మేము భావిస్తున్నాము,” అని వెన్స్ పేర్కొన్నారు.
ఈ నిధులు దుర్వినియోగం కాకుండా చూసేందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు, సీనియర్ సలహాదారు అయిన జారెడ్ కుష్నర్, ఖతార్ దేశం కలిసి ఒక “చాలా ఆసక్తికరమైన పరిష్కారాన్ని” కనుగొన్నారని జేడీ వాన్స్ వెల్లడించారు.
దీని ప్రకారం, ఒకవేళ ఇరాన్ నిధులు విడుదలైనా.. ఆ ప్రక్రియపై అమెరికాతో పాటు ఖతార్కు కూడా పూర్తి నియంత్రణ (ఆమోదించే హక్కు) ఉంటుంది. ఆ డబ్బును నేరుగా అమెరికా నుండి సోయాబీన్, మొక్కజొన్న, గోధుమలను కొనుగోలు చేయడానికి ఉపయోగిస్తారు. తద్వారా ఆ ఆహార ధాన్యాలు ఇరాన్ ప్రజల ఆకలిని తీరుస్తాయని వైస్ ప్రెసిడెంట్ వివరించారు.
ఈ వినూత్న ఆలోచన ఇరాన్ నిధులను పూర్తిగా అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు వైపు మళ్లిస్తుందని జేడీ వాన్స్ చెప్పారు. “ఒకవేళ ఇరాన్ ఆస్తులు విడుదల చేయబడితే, అవి అమెరికా రైతులను మరింత సంపన్నులను చేస్తాయి. ఇరాన్ ప్రజలకు ఆహారాన్ని అందిస్తాయి. ఇది చాలా అద్భుతమైన మరియు పక్కా ‘ట్రంప్ మార్క్’ డీల్ ” అని జేడీ వాన్స్ వ్యాఖ్యానించారు.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













