Last Updated:
తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఢిల్లీలో కలవనున్నాడు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విజయ్ మోదీని కలవడం ఇదే తొలిసారి. దాంతో ఈ సమావేశంపై ఆసక్తి నెలకొని ఉంది.
Joseph Vijay: తమిళనాడు నూతన ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనకు ఇది తొలి అధికారిక ఢిల్లీ పర్యటన. ఈ పర్యటనలో భాగంగా సీఎం విజయ్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు జరపనున్నారు.
ప్రభుత్వ అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. ప్రధానమంత్రితో జరిగే ఈ మర్యాదపూర్వక భేటీలో తమిళనాడు అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా రాష్ట్రానికి రావాల్సిన అదనపు నిధులను విడుదల చేయాలని, అలాగే తమిళనాడులో పెండింగ్లో ఉన్న పలు భారీ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన ఆమోదం తెలపాలని సీఎం విజయ్ ప్రధాని మోదీని కోరనున్నారు. కాగా, ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు, గ్రౌండ్ వర్క్ పూర్తి చేయడానికి తమిళనాడుకు చెందిన పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు ఇప్పటికే ఢిల్లీలో మొహరించారు.
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వచ్చాయి. ఎం.కె. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే (DMK) ప్రభుత్వాన్ని ఓడించి విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కజగం’ (TVK) సంచలన విజయం సాధించింది. మే 10న విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ ఎన్నికల్లో విజయ్ పార్టీ ‘టీవీకే’ ఒంటరిగా 108 స్థానాలను గెలుచుకోగా.. కాంగ్రెస్, విడుతలై చిరుతైగల్ కట్చి (VCK), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI), సీపీఐ(ఎం), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) జట్లతో కూడిన కూటమితో కలిసి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన తర్వాత కేంద్రంతో సత్సంబంధాలు నెలకొల్పే క్రమంలో విజయ్ చేపడుతున్న ఈ తొలి ఢిల్లీ పర్యటనపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













