Last Updated:
కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ (DKS) ఢిల్లీకి చేరుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీ టెన్ జన్పత్లో పార్టీ పెద్దలతో మంతనాలు జరుగుతున్నాయి.
Karnataka Politics: కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకత్వ మార్పు, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై గత కొంతకాలంగా సాగుతున్న ఊహాగానాల మధ్య దేశ రాజధాని ఢిల్లీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ (DKS) ఢిల్లీకి చేరుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీ టెన్ జన్పత్లో పార్టీ పెద్దలతో మంతనాలు జరుగుతున్నాయి. డీకేకి పదవి దక్కే ఛాన్స్ అని వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్లతో వీరు విడివిడిగా సమావేశం కానున్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు పూర్తి కావస్తున్న తరుణంలో, సీఎం పీఠాన్ని దక్కించుకోవాలని డి.కె. శివకుమార్ చాన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన సమయంలో అధిష్టానం తనకు ఇచ్చిన రొటేషనల్ సీఎం ఫార్ములాను అమలు చేయాలని ఆయన వర్గం గట్టిగా డిమాండ్ చేస్తోంది. సిద్ధరామయ్య మాత్రం కేబినెట్ మార్పులకే మొగ్గు చూపుతుండగా డీకే శివకుమార్ మాత్రం ముందుగా సీఎం మార్పుపైనే తేల్చాలని పట్టుబడుతున్నారు.
ఢిల్లీలో ఇంతటి కీలక సమావేశం జరుగుతున్నప్పటికీ, బెంగళూరులోని డి.కె. శివకుమార్ బంధువులు, అత్యంత ఆప్తులు మరియు ఆయన సోదరుడు డి.కె. సురేష్ వర్గీయులు ప్రస్తుతానికి వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. అధిష్టానంతో చర్చలు జరుగుతున్న సమయంలో ఎలాంటి తొందరపాటు ప్రకటనలు చేసి వివాదాలు కొనితెచ్చుకోకూడదనే ఉద్దేశంతోనే వారు సైలెంట్గా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. “సమయమే అన్నింటికీ సమాధానం చెబుతుంది” అని డీకే శివకుమార్ సైతం గతంలో వ్యాఖ్యానించడం గమనార్హం.
ఈ సమావేశంలో కేవలం ముఖ్యమంత్రి మార్పు గురించే కాకుండా, కర్ణాటక నుంచి త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికలు, శాసనమండలి స్థానాల అభ్యర్థుల ఎంపిక, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై కూడా హైకమాండ్ చర్చించనుంది.
ప్రస్తుతానికి సిద్ధరామయ్య తన నమ్మకస్తులైన కొందరు మంత్రులతో కలిసి ఢిల్లీలో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నిర్వహించి తమ బలాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేయగా, అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది రాబోయే రెండు మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













