కెన్-బెట్వా ప్రాజెక్టు:
ప్రధాని మోదీ.. కెన్-బెట్వా నది అనుసంధాన ప్రాజెక్టును.. రాష్ట్రాల మధ్య నీటి సమస్యల పరిష్కారానికి ఆదర్శ మోడల్గా తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా.. సహకారంతోపాటూ.. మిషన్ మోడ్లో అమలు చెయ్యడం ద్వారా వివాదాల్ని ఎదుర్కోవచ్చని సూచించారు. రాష్ట్రాలు.. నదుల అనుసంధానం, నీటి సంరక్షణ, భూగర్భజలాల పునరుద్ధరణ, సమర్థమైన నీటిపారుదల వంటి అంశాల్ని గుర్తించి దీర్ఘకాలం నీరు లభించేలా చెయ్యాలని మోదీ సూచించారని డెక్కన్ హెరాల్డ్ రిపోర్ట్ చేసింది.
దీని ముఖ్య ఉద్దేశాలు ఇవే:
* నీటి మళ్లింపు: మధ్యప్రదేశ్లోని కెన్ నదిలో ఉన్న అదనపు జలాలను కాలువ ద్వారా ఉత్తరప్రదేశ్లోని బెట్వా నదికి మళ్లిస్తారు.
* కరవు నివారణ: దశాబ్దాలుగా తీవ్ర నీటి ఎద్దడి, కరవుతో అల్లాడిపోతున్న బుందేల్ఖండ్ ప్రాంతానికి అంటే.. యూపీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని 13 జిల్లాలకు ప్రాణం పోయడం దీని ప్రధాన లక్ష్యం.
* ప్రయోజనాలు: దీని ద్వారా సుమారు 10.6 లక్షల హెక్టార్ల భూమికి సాగునీరు, 62 లక్షల మందికి తాగునీరు అందడంతో పాటు 103 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి జరగనుంది.
దేశంలో ఒకచోట వచ్చే వరదల నీటిని మళ్లించి, మరోచోట ఉండే కరవును ఒకేసారి నియంత్రించేందుకు చేపట్టిన చరిత్రాత్మక ముందడుగు కావడం ఈ ప్రాజెక్టు అతిపెద్ద ప్రత్యేకత.
కెన్-బెట్వా ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదు. ప్రస్తుతం ఇది నిర్మాణ దశలో ఉంది.
* 2021 డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు అధికారికంగా ఆమోదం తెలిపింది.
* అప్పటినుంచి టెండర్ల ప్రక్రియ, భూసేకరణ, పర్యావరణ అనుమతులు వంటి ప్రాథమిక పనులు పూర్తి చేసుకుని ప్రధాన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
* ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తవడానికి సుమారు 8 ఏళ్ల సమయం పడుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. అన్నీ సవ్యంగా జరిగితే 2029-2030 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తయ్యి.. అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఈ ప్రాజెక్టును హైలెట్ చెయ్యడం ద్వారా.. ప్రధాని మోదీ.. రాష్ట్రాల ప్రభుత్వాలకు మంచి సందేశం ఇచ్చినట్లైంది. రాష్ట్రాల ప్రభుత్వాలు.. జలాల జగడాలకు పోకుండా.. సహకారంతో సమస్యల్ని పరిష్కరించుకుంటే.. అందరికీ మంచిదే. ఉదాహరణకు ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణ, గోదావరి జలాల సమస్యలు చాలా ఉన్నాయి. తమిళనాడు, కర్ణాటక మధ్య కావేరీ, మేకెదాటు వంటివి ఉన్నాయి. మహారాష్ట్ర, తెలంగాణతో బాబ్లీ ప్రాజెక్టు సమస్యలున్నాయి. కర్ణాటక, ఏపీతో కృష్ణా జలాల సమస్యలున్నాయి. అందరికీ జలాలు అవసరమే. ఐతే.. సముద్రంలో వృథాగా పోకుండా.. ప్రభుత్వాలు సహకారంతో మాట్లాడుకొని.. ఆ జలాల్ని ఎలా ప్రజల కోసం ఉపయోగించాలో చర్చించుకోవాలి. తద్వారా.. ఉప్పు లేని నీటిని సద్వినియోగం చెయ్యాలి.
విదేశాల్లో సముద్ర నీటిని మంచి నీరుగా మార్చేందుకు బిలియన్లు ఖర్చు చేస్తున్నారు. డీశాలినేషన్ అనేది ఎంత ఖర్చుతో కూడిన ప్రక్రియో గల్ఫ్ దేశాలకు వెళ్తే తెలుస్తుంది. మన ఇండియాలో అంత అవసరం లేకుండా జీవ నదులు ప్రవహిస్తున్నాయి. అయినప్పటికీ రాష్ట్రాల ప్రభుత్వాలు ఆ నదుల నీటిని సద్వినియోగం చెయ్యకుండా.. సముద్రాలపాలు చేస్తున్నాయి. ఇందుకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాల పట్టుదలలు, పంతాలే సమస్యలుగా మారుతున్నాయనే అభిప్రాయాలు ఉన్నాయి. పరిష్కారమే ప్రయత్నంగా మారితే.. ఫలితాలు అద్భుతంగా ఉంటాయనేది ప్రధాని మోదీ ఆలోచన. ఇండియా.. వికసిత భారత్గా మారాలంటే.. రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా సుదీర్ఘ ఆలోచనలు, ప్లాన్స్, సహకారంతో ముందుకు సాగితే.. అన్ని రాష్ట్రాలూ సస్యశ్యామలం కాగలవు.
నీటి భద్రత భారతదేశ భవిష్యత్తుకు అత్యంత ముఖ్యం. వాతావరణ మార్పులు, జనాభా పెరుగుదల, వ్యవసాయ అవసరాలు కారణంగా నీటి కొరత తీవ్రమవుతోంది. ప్రధాని సూచనలు రాష్ట్రాల మధ్య ఏకతను ప్రోత్సహిస్తాయి. ఇది దేశీయ స్థాయిలో నీటి నిర్వహణను మెరుగుపరుస్తుంది. అంతర్జాతీయంగా కూడా భారత్.. నీటి సంరక్షణలో ముందుండాలని ఈ చర్యలు సంకేతం ఇస్తున్నాయి. ఉదాహరణకు నెదర్లాండ్స్తో జల సహకారం, కల్పసర్ ప్రాజెక్టు వంటివి ఇప్పటికే చర్చలో ఉన్నాయి.












