Last Updated:
ఆ సంకేతం అందిన వెంటనే చేతన్.. కేతన్ను లోతైన లోయలోకి నెట్టేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో తేలిన ఆనాటి ఘోర ఉదంతం ప్రకారం కేతన్ అగర్వాల్ చివరి 120 నిమిషాలు ఇలా ఉంది.
Ketan Agarwal Murder Case: లోహగఢ్ కోటపై జరిగిన కేతన్ అగర్వాల్ అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు సంచలన విషయాలను వెలుగులోకి వస్తున్నాయి. దర్యాప్తు అధికారులు ఘటనా స్థలంలో లభించిన ఆధారాల ఆధారంగా ఆ రోజు ఉదయం ఏం జరిగిందో పూసగుచ్చినట్లు పునర్నిర్మించారు. నిందితురాలు, కేతన్ కాబోయే భార్య సియా గోయల్ కోటపై ఒక చోట కూర్చోవడమే.. మరో నిందితుడు చేతన్ చౌదరికి ఆమె ఇచ్చిన ‘సిగ్నల్’ అని పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. ఆ సంకేతం అందిన వెంటనే చేతన్.. కేతన్ను లోతైన లోయలోకి నెట్టేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో తేలిన ఆనాటి ఘోర ఉదంతం ప్రకారం కేతన్ అగర్వాల్ చివరి 120 నిమిషాలు ఇలా ఉంది.
ఉదయం 8:41 గంటలకు: దర్యాప్తు ప్రకారం.. జూన్ 18న ఉదయం 8:41 గంటలకు కేతన్ అగర్వాల్ కారు పుణె వైపు ఉన్న ఉర్సే టోల్ ప్లాజాను దాటింది.
ఉదయం 9:40 – 9:45 గంటలకు: టోల్ నాకా నుండి లోహగఢ్ కోటకు చేరుకోవడానికి దాదాపు ఒక గంట సమయం పడుతుంది. దీని ప్రకారం కేతన్, అతని కాబోయే భార్య సియా గోయల్ ఉదయం 9:40 నుండి 9:45 గంటల మధ్య కోట వద్దకు చేరుకుని ఉంటారని పోలీసులు అంచనా వేశారు.
ఉదయం 10:15 గంటలకు: సాధారణంగా కోట పైభాగానికి చేరుకోవడానికి సగటు మనిషికి 22 నుండి 25 నిమిషాల సమయం పడుతుంది. ఈ లెక్కన వీరిద్దరూ ఉదయం 10:15 గంటలకల్లా కోట శిఖరానికి చేరుకున్నారని పోలీసులు నిర్ధారించారు.
మరో నిందితుడైన చేతన్ చౌదరి మొదట వీరిద్దరినీ వెంబడిస్తూ వెనకాలే నడిచాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, అతను వేగంగా నడవడంతో కేతన్, సియాల కంటే ముందే కోట పైభాగానికి చేరుకుని అక్కడ వేచి ఉన్నాడు.
లోయలోకి నెట్టేయడానికి ఆ ‘సిగ్నల్’..
దర్యాప్తు అధికారుల కథనం ప్రకారం.. సియా ఒక చోట కిందకు కూర్చోవడమే చేతన్ రంగంలోకి దిగడానికి ముందుగా అనుకున్న సంకేతం. ఆ సిగ్నల్ అందిన కొద్దిసేపటికే, అంటే ఉదయం 10:30 గంటల ప్రాంతంలో చేతన్ ఒక్కసారిగా కేతన్ను లోయలోకి నెట్టేసాడు. పని ముగిసిన వెంటనే చేతన్ అక్కడి నుండి జారుకోగా.. సియా ఏమీ తెలియనట్లు “కాపాడండి.. కాపాడండి” అంటూ గట్టిగా అరవడం ప్రారంభించింది.
ఆ తర్వాత సరిగ్గా 10:41 గంటలకు (నెట్టేసిన 11 నిమిషాల తర్వాత) సియా.. కేతన్ తల్లికి ఫోన్ చేసి ఈ ప్రమాదం గురించి సమాచారం అందించింది.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, కుటుంబ సభ్యులు కోట వద్దకు పరుగులు తీశారు. పోలీసులు వచ్చే వరకు, అలాగే లోయ నుండి కేతన్ మృతదేహాన్ని వెలికితీసే వరకు సియా సంఘటనా స్థలంలోనే ఉండిపోయింది.
ఆ తర్వాత మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఫార్మాలిటీస్ పూర్తయ్యే వరకు, అంటే సాయంత్రం 4:30 నుండి 5 గంటల వరకు సియా అక్కడే వేచి ఉంది.
ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడానికి, పక్కా ఆధారాలు సేకరించడానికి పోలీసులు ఆరు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. దర్యాప్తులో భాగంగా రాబోయే రోజుల్లో పోలీసులు నిందితులతో కలిసి ఘటనా స్థలంలో సీన్ రీ-క్రియేషన్ (Scene Recreation) చేయనున్నారు.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













