Last Updated:
మహారాష్ట్రలోని భివాండిలో గురువారం రాత్రి ఒక నాలుగంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద ఇంకా పలువురు చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి.
మహారాష్ట్రలోని థానే జిల్లా భివాండి ప్రాంతంలో గురువారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బాలాజీ నగర్ ఏరియాలో ఉన్న కోహినూర్ అపార్ట్మెంట్ అనే నాలుగంతస్తుల భవనంలో ఒక భాగం అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ దారుణ ఘటనలో ఇప్పటివరకు తొమ్మిది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద ఇంకా ఆరు నుంచి ఏడు మంది వరకు చిక్కుకుని ఉండొచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. న్యూస్18 ఇంగ్లీష్ కథనం వివరాల ప్రకారం.. ఈ ఘటన జరిగిన వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి.
డాగ్ స్క్వాడ్, జేసీబీల సాయంతో రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. రాత్రి 11.30 గంటల సమయంలో భవనంలోని బీ-వింగ్ అమాంతం కుప్పకూలిందని అధికారులు తెలిపారు. శిథిలాల నుంచి ఒక బాలుడిని సురక్షితంగా బయటకు తీసి, మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
#WATCH | Bhiwandi, Maharashtra: Morning visuals from the spot in Bhiwandi where emergency rescue teams are working extensively after a four-storey building partially collapsed. pic.twitter.com/qFxTuCHhJG
— ANI (@ANI) July 31, 2026
కూలిపోయిన ఈ భవనంలో ప్రతి అంతస్తులో 12 గదుల చొప్పున మొత్తం 48 గదులు ఉన్నాయి. భవనం చాలా పాతది కావడంతో ప్రమాదకరమైనదిగా స్థానిక మున్సిపల్ అధికారులు ఇదివరకే ప్రకటించారు. ప్రజలు ఖాళీ చేయాలని నోటీసులు కూడా జారీ చేశారు. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో లోపల కొంత మరమ్మత్తు పనులు జరుగుతున్నట్లు సమాచారం.

గురువారం రాత్రి 9 గంటల సమయంలో భవనం నుంచి పెద్దగా పగుళ్లు వస్తున్న శబ్దాలు వినిపించాయి. అప్రమత్తమైన స్థానికులు భవనంలో ఉంటున్న కుటుంబాలను బయటకు పంపే ప్రయత్నం చేశారు. ఇలా ఖాళీ చేస్తున్న క్రమంలోనే భవనం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో లోపల ఉన్న కొందరు కార్మికులు, నివాసితులు శిథిలాల కింద చిక్కుకుపోయారు.
శిథిలాల కింద ఉన్నవారిని రక్షించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. నగరంలో ఇలాంటి శిథిలావస్థకు చేరిన భవనాలు చాలా ఉన్నాయని, ప్రమాదకరమైన ఇళ్లలో నివసిస్తున్న ప్రజలు వెంటనే వాటిని ఖాళీ చేయాలని భివాండి మేయర్ నారాయణ్ చౌదరి విజ్ఞప్తి చేశారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana
Jul 31, 2026 12:14 PM IST














