Last Updated:
Murder: పంజాబ్లో కుటుంబ కలహాల కారణంగా జరిగిన ఒక దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గొడవపడి పుట్టింటికి వెళ్లిన భార్యను తిరిగి ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చిన ఓ వ్యక్తిపై అతని బావమరిది పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు.
ఈ ప్రమాదంలో బాధితుడిని కాపాడబోయిన నిందితుడి వదిన కూడా తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ దారుణ ఘటన 13న పంజాబ్లోని తర్న్ తారన్ జిల్లా సంఘా గ్రామంలో జరిగింది. అయితే, దీనికి సంబంధించిన సీసీటీవీ (CCTV) ఫుటేజ్ ఇప్పుడు బయటకు రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసుల కథనం ప్రకారం.. అమృత్సర్ జిల్లా లోపోకే గ్రామానికి చెందిన లవ్ప్రీత్ సింగ్ అనే వ్యక్తికి, సందీప్ కౌర్ అనే మహిళతో వివాహమైంది. అయితే కొన్ని గొడవల కారణంగా సందీప్ కౌర్ తన భర్తను వదిలి సంఘా గ్రామంలోని తన పుట్టింటికి వచ్చేసింది. జూన్ 13న లవ్ప్రీత్ సింగ్ తన భార్యను నచ్చజెప్పి తిరిగి ఇంటికి తీసుకువెళ్లడానికి అత్తగారింటికి వచ్చాడు. ఈ క్రమంలో అక్కడ మాట మాట పెరిగి పెద్ద గొడవగా మారింది. దీంతో ఆగ్రహానికి గురైన లవ్ప్రీత్ బావమరిది సాజన్ సింగ్.. లవ్ప్రీత్పై పెట్రోల్ పోసి ఒక్కసారిగా నిప్పంటించాడు.
#पंजाब के तरनतारन जिले में घरेलू झगड़े के बाद अपनी पत्नी को उसके मायके से वापस लाने गए एक व्यक्ति पर उसके साले ने कथित तौर पर पेट्रोल डालकर आग लगा दी।लवप्रीत सिंह की जलने से मौत हो गई। वहीं उसे बचाने के लिए दौड़ी उसकी साली गुरजीत कौर भी आग की चपेट में आ गई और उनकी भी मौत हो गई। pic.twitter.com/ufh3ZjJfbb
— Journalist Ravendra kumar (@Chhotukingoffi1) July 4, 2026
లవ్ప్రీత్ ఒంటికి మంటలు అంటుకుని ప్రాణభయంతో అటు ఇటు పరుగులు తీస్తుండగా, అది చూసి నిందితుడి వదిన గుర్జీత్ కౌర్ అతడిని కాపాడేందుకు వెంటనే అక్కడికి పరుగున వచ్చింది. అయితే లవ్ప్రీత్ను రక్షించే క్రమంలో ఆమెకు కూడా మంటలు అంటుకున్నాయి. తీవ్ర గాయాలపాలైన ఇద్దరినీ వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ లవ్ప్రీత్ సింగ్, గుర్జీత్ కౌర్ ఇద్దరూ మరణించారు. ఈ పెనుగులాటలో నిందితుడు సాజన్ సింగ్కు కూడా స్వల్పంగా మంటలు అంటుకోవడంతో అతడు కూడా ఆసుపత్రిలో చేరాడు.
ఈ ఘోరానికి సంబంధించిన దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. వీడియోలో ఒక వ్యక్తి మరొకరికి నిప్పంటించడం.. బాధితుడు మంటల్లో కాలిపోతూ భయంతో అటు ఇటు పరిగెత్తడం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ వెంటనే ఒక మహిళ అతడిని రక్షించడానికి రావడం, ఆమెకు కూడా మంటలు అంటుకోవడం చూస్తాం. కొద్ది క్షణాల తర్వాత, ఆమె వెనుక నిలబడిన మూడో వ్యక్తి వచ్చి, మంటల తీవ్రతకు కదలలేకపోయిన ఆ మహిళకు సహాయం చేయడానికి ప్రయత్నించడం వీడియోలో రికార్డైంది. ఈ ఘటనపై తర్న్ తారన్లోని సదర్ పోలీస్ స్టేషన్ వారు నిందితుడు సాజన్ సింగ్పై కేసు నమోదు చేశారు. ఈ ఘోర కలకలంపై పోలీసులు మరిన్ని వివరాల కోసం తదుపరి దర్యాప్తును ముమ్మరం చేశారు.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













