Last Updated:
Narendra Modi: దేశ రాజధానిలో ఇటీవల ముగిసిన శిఖరాగ్ర సమావేశంలో బ్రిక్స్ (BRICS) దేశాలు సంతకం చేసిన ‘న్యూఢిల్లీ డిక్లరేషన్’ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం ప్రశంసించారు.
Delhi: ఇటీవల దేశ రాజధానిలో విజయవంతంగా ముగిసిన బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సులో ఆమోదించిన ‘న్యూఢిల్లీ డిక్లరేషన్’ ప్రపంచ వేదికలపై భారత్ పెరుగుతున్న ప్రభావానికి, అంతర్జాతీయ సమాజానికి దేశంపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. గురువారం జరిగిన ‘సెమికాన్ ఇండియా 2026’ (SEMICON India 2026) ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రధాన మంత్రి ఈ విషయాలను వెల్లడించారు. సవాళ్లతో కూడుకున్న ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో కూడా భారత్ 7.8 శాతం జీడీపీ (GDP) వృద్ధి రేటును సాధించడాన్ని ప్రధాని ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఢిల్లీలో నిర్వహించిన సెమికాన్ ఇండియా 2026′ (SEMICON India 2026) ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ దేశాభివృద్ధికి సంబంధించిన అంశాలతో పాటు పలు విషయాలను చర్చించారు. ప్రధానంగా సెప్టెంబర్ నెలలోనే భారత త్రైమాసిక జీడీపీ నివేదిక విడుదలైంది. దానిపై మోదీ చర్చించారు. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా భారత్ 7.8 శాతం వృద్ధిని నమోదు చేసిందని.. ఇదే సమయంలో జపాన్కు చెందిన క్రెడిట్ రేటింగ్ సంస్థ భారత్ సార్వభౌమ రేటింగ్ను అప్గ్రేడ్ చేసింది. దాదాపు 35 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఇది జరగడం విశేషంగా ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు.
ఒకవైపు భారత ఆర్థిక వ్యవస్థ బలపడుతుంటే మరోవైపు ప్రపంచదేశాలకు భారత్పై నమ్మకం నిరంతరం పెరుగుతోందని మోదీ కితాబిచ్చారు. మూడు రోజుల క్రితం ముగిసిన బ్రిక్స్ సదస్సులో ఈ నమ్మకం స్పష్టంగా కనిపించిందని..అంతర్జాతీయ సమాజానికి దేశంపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని చెప్పారు. భారత్ విజయవంతంగా ఆతిథ్యమిచ్చిన ఈ సదస్సులో అందరి సమగ్ర సమ్మతితో ‘న్యూఢిల్లీ డిక్లరేషన్’ ఆమోదం పొందడం మన వ్యూహాత్మక విజయానికి ప్రామాణికం అన్నారు మోదీ.
స్థిరత్వం, ఆవిష్కరణలు, సహకారం, నిలకడ” (Building for Resilience, Innovation, Cooperation and Sustainability) అనే ప్రధాన ఇతివృత్తంతో సెప్టెంబర్ 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఈ సదస్సుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాతో పాటు పలువురు ప్రపంచ దేశాల అధినేతలు హాజరయ్యారు.
సెప్టెంబర్ 12న ఆమోదించిన ఈ ఉమ్మడి డిక్లరేషన్లో పశ్చిమాసియా యుద్ధం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సుంకాలు (tariffs) వంటి అనేక ప్రపంచ సమస్యలపై బహుళపక్ష భాగస్వామ్యాల విధానాన్ని స్పష్టం చేశారు. ముఖ్యంగా 2025లో పహల్గామ్లో 26 మంది పౌరుల ప్రాణాలను బలిగొన్న ఉగ్రదాడిని ఈ ప్రకటన తీవ్రంగా ఖండించింది. ఏ రూపంలో ఉన్న ఉగ్రవాదాన్నైనా ఉపేక్షించకుండా సంయుక్తంగా పోరాడతామని బ్రిక్స్ కూటమి పునరుద్ఘాటించింది.














