Last Updated:
పరీక్షా కేంద్రాల్లో వేలిముద్రలు, ఫోటోలను తనిఖీ చేసే బయోమెట్రిక్ కంపెనీ సిబ్బందితో ఈ ముఠా చేతులు కలిపింది. పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (PMCH) లో థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్న మయాంక్ కశ్యప్ అనే విద్యార్థి, బయోమెట్రిక్ కంపెనీ ఉద్యోగి లాగా నకిలీ ఐడీతో హసన్పూర్ హైస్కూల్ పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించాడు.
NEET UG Re-Exam: పేపర్ లీక్ వివాదం తర్వాత దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన నీట్-యుజి (NEET-UG) రీ ఎగ్జామ్లో టాలీవుడ్ సినిమా ‘శంకర్ దాదా MBBS’ తరహా ఘరానా మోసం వెలుగుచూసింది. అసలైన అభ్యర్థులకు బదులుగా పరీక్షలు రాసేందుకు మెడికల్, నర్సింగ్ విద్యార్థులను ‘సాల్వర్స్’ (టాప్ స్కోరర్లు)గా రంగంలోకి దించిన ఒక పెద్ద ముఠాను బీహార్లోని లఖిసరాయ్ పోలీసులు రట్టు చేశారు. ఈ కుంభకోణానికి సంబంధించి పోలీసులు ఇప్పటివరకు మెడికల్ విద్యార్థులు, నకిలీ అభ్యర్థులు, బయోమెట్రిక్ కంపెనీ ఉద్యోగులతో కలిపి మొత్తం 30 మందిని అరెస్ట్ చేశారు.
పరీక్షా కేంద్రాల్లో వేలిముద్రలు, ఫోటోలను తనిఖీ చేసే బయోమెట్రిక్ కంపెనీ సిబ్బందితో ఈ ముఠా చేతులు కలిపింది. పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (PMCH) లో థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్న మయాంక్ కశ్యప్ అనే విద్యార్థి, బయోమెట్రిక్ కంపెనీ ఉద్యోగి లాగా నకిలీ ఐడీతో హసన్పూర్ హైస్కూల్ పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించాడు. తనిఖీల్లో అతను మొదట దొరికిపోవడంతో ఈ భారీ నెట్వర్క్ వెలుగులోకి వచ్చింది.
అతనిచ్చిన సమాచారంతో పోలీసులు లఖిసరాయ్లోని కేంద్రీయ విద్యాలయ, కేఆర్కే హయ్యర్ సెకండరీ స్కూల్స్ పై దాడులు చేసి, అసలు అభ్యర్థుల స్థానంలో కూర్చుని పరీక్ష రాస్తున్న 9 మంది నకిలీ అభ్యర్థులను (ఇంపర్సనేటర్స్) రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఈ ముఠా దొంగచాటుగా పరీక్షలు రాయించడానికి అగ్రశ్రేణి మెడికల్, నర్సింగ్ విద్యార్థులను వాడుకుంది. పట్టుబడిన వారిలో రాయ్బరేలి ఎయిమ్స్ (AIIMS Rae Bareli) విద్యార్థి సౌరభ్ ఝా. బనారస్ హిందూ యూనివర్సిటీ (BHU) నర్సింగ్ విద్యార్థిని పూనమ్ కుమారి. ఢిల్లీ షాదరా మెడికల్ కాలేజీ ఇంటర్న్ అమన్ అగర్వాల్. నలంద మెడికల్ కాలేజీ నర్సింగ్ విద్యార్థి సంజీత్ మరియు అతని సోదరుడు.
ఈ కుంభకోణం వెనుక రాజ్గిర్కు చెందిన రవిశంకర్ మరియు గయా ఏఎన్ఎమ్ మెడికల్ కాలేజీ విద్యార్థి అర్పిత్ రాజ్ మాస్టర్మైండ్స్గా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో అర్పిత్ రాజ్ను గతంలో 2024 నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ కూడా విచారించడం గమనార్హం.
ప్రాథమిక విచారణ ప్రకారం, అసలు అభ్యర్థుల స్థానంలో కూర్చుని పరీక్ష పాస్ చేయించడానికి ఈ ముఠా ఒక్కొక్కరి నుండి రూ. 10 లక్షల నుండి రూ. 12 లక్షల వరకు వసూలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా రూ. 1-2 లక్షలు అడ్వాన్స్గా తీసుకుని, మిగిలిన మొత్తాన్ని పరీక్ష పాసయ్యాక ఇచ్చేలా డీల్ మాట్లాడుకున్నారు.
నీట్ పరీక్షల సమయంలో మెడికల్ విద్యార్థులు క్యాంపస్ దాటి వెళ్లకూడదని కాలేజీ యాజమాన్యాలు కఠిన నిబంధనలు పెట్టినప్పటికీ, ఈ విద్యార్థులు అనారోగ్యం నెపంతో లీవ్లు పెట్టి మరీ ఈ దందాకు రావడం గమనార్హం. ప్రస్తుతం లఖిసరాయ్ ఎస్పీ ప్రేరణ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ఈ ముఠా యొక్క బ్యాంక్ ఖాతాలు, కాల్ డేటాను పరిశీలిస్తూ నెట్వర్క్ లోని మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













