Last Updated:
నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో 288 మంది భారతీయుల ఆచూకీ గల్లంతైనట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ప్రకటించింది. చైనా వైపు మరో 150 మంది భారతీయులు కూడా తప్పిపోయారని, సహాయక చర్యలు ముమ్మరం చేశామని వెల్లడించింది.
నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో బుధవారం సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ భయంకరమైన వరదల్లో ఏకంగా 288 మంది భారతీయ పౌరుల ఆచూకీ గల్లంతైనట్లు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. త్రిశూలి-1 పవర్ ప్రాజెక్టులో పనిచేస్తున్న సిబ్బందితో పాటు కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు ఈ వరదల్లో చిక్కుకున్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా దెబ్బతినడంతో వారిని సంప్రదించడం కష్టంగా మారిందని, వారితో మాట్లాడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని విదేశాంగ శాఖ తెలిపింది.














