Last Updated:
New Delhi: దేశ రాజధాని ఢిల్లీలో మానవత్వం సిగ్గుతో తలదించుకునే మరో దారుణ ఘోరం వెలుగుచూసింది. స్నేహితుడని నమ్మి బయటకు వెళ్లిన 17 ఏళ్ల మైనర్ బాలిక కామాంధుల చేతిలో చిక్కి నరకయాతన అనుభవించింది.
మద్యం మత్తులో కదులుతున్న వాహనంలోనే ఆమెపై నలుగురు మృగాళ్లు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అంతటితో ఆగకుండా, తమ పాపం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో ఆమెను కత్తితో విచక్షణారహితంగా పొడిచి దారుణంగా హతమార్చారు. అనంతరం మృతదేహాన్ని నిర్మానుష్య పొలాల్లో పారేయగా, కుక్కలు ఆ మృతదేహ భాగాలను పీక్కుతినడం స్థానికంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. పోలీసులు వెల్లడించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి
ఢిల్లీకి చెందిన 17 ఏళ్ల బాలికకు స్థానికంగా ఉండే ఒక యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ స్నేహితుడిని కలిసేందుకు ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అక్కడ ఆమె స్నేహితుడితో పాటు అతడికి తెలిసిన మరో ముగ్గురు మైనర్లు కలిశారు. అనంతరం వీరంతా కలిసి ఒక టెంపో వాహనంలో ప్రయాణమయ్యారు. ప్రయాణ సమయంలో ఆ వాహనంలోనే ఆ నలుగురు యువకులు మద్యం సేవించారు. మద్యం మత్తు తలకెక్కడంతో నలుగురూ కలిసి బాలికపై తీవ్రంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. ప్రతిఘటించినా వినకుండా కదులుతున్న టెంపోలోనే ఆమెపై విచక్షణారహితంగా సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు.
అత్యాచారం అనంతరం విషయం బయటకు వస్తుందనే భయంతో నిందితులు ఆమెను కత్తులతో పొడిచి కిరాతకంగా చంపేశారు. అనంతరం ఉత్తర ఢిల్లీ పరిధిలోని స్వరూప్ నగర్ సమీపంలోని నిర్మానుష్య పొలాల్లోకి మృతదేహాన్ని విసిరేసి అక్కడి నుంచి పారిపోయారు. సెప్టెంబర్ 13వ తేదీన స్థానికులు ఆ ప్రాంతంలో గుర్తుతెలియని మృతదేహం పడి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, ఆ మృతదేహం కనీసం అమ్మాయిదా లేక అబ్బాయిదా అనేది కూడా గుర్తించలేనంత దారుణంగా కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. అంతేకాకుండా, మృతదేహం నుంచి ఒక చేయి వేరుపడి ఉండటాన్ని, ఇతర శరీర భాగాలను వీధి కుక్కలు పీక్కుతిన్నట్లు అధికారులు ప్రాథమిక విచారణలో గుర్తించారు.
ఆ బాలిక ఇంటి నుంచి వెళ్లి పలు రోజులు గడుస్తున్నప్పటికీ కుటుంబ సభ్యుల నుంచి పోలీసులకు ఎలాంటి అదృశ్యం ఫిర్యాదు అందకపోవడం దర్యాప్తులో వెలుగుచూసింది. ఆ బాలిక తరచుగా ఇంటి నుంచి వెళ్లిపోయి రోజుల తరబడి తిరిగి రాకపోవడం వల్లే తాము పోలీసులకు ఫిర్యాదు చేయలేదని కుటుంబ సభ్యులు తెలిపినట్లు సమాచారం. అయితే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ దారుణంపై పోక్సో (POCSO) చట్టం సహా సంబంధిత సెక్షన్ల కింద హత్య, సామూహిక అత్యాచారం కేసులు నమోదు చేసి విచారణ ముమ్మరం చేశారు.
స్వరూప్ నగర్ పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ (CCTV) కెమెరాల ఫుటేజీలను పోలీసులు లోతుగా విశ్లేషించారు. ఆ ఫుటేజీలో అనుమానాస్పదంగా సంచరించిన ఒక టెంపో వాహనాన్ని గుర్తించిన ప్రత్యేక బృందాలు దర్యాప్తును వేగవంతం చేశాయి. టెంపో ఆధారంగా పోలీసులు నలుగురు నిందితులను గుర్తించి విజయవంతంగా అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ముగ్గురు నిందితులు మైనర్లు కావడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. నిందితుల వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ రోజు అసలేం జరిగింది, ఈ ఘోరానికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు అన్ని కోణాల్లో లోతైన ఆధారాలు సేకరిస్తున్నారు.














