Last Updated:
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగరవేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఇన్స్టాగ్రామ్లో ప్రత్యేక వీడియోను పంచుకుంటూ, ప్రజలందరూ ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు.
భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ ఆగస్టు 15ను మరింత ఘనంగా, గర్వకారణంగా జరుపుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఒక ప్రత్యేక సందేశం ఇచ్చారు. ఇందులో భాగంగా మంగళవారం ఆయన తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ‘హర్ ఘర్ తిరంగా’ (ఇంటింటికో జాతీయ జెండా) కార్యక్రమాన్ని ప్రతి ఇంట్లో ఒక పండుగలా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన మహావీరులు, స్వాతంత్ర్య సమరయోధుల అపూర్వ త్యాగాలను స్మరించుకుంటూ వారికి ఘనంగా నివాళులు అర్పించాలని ఆయన సూచించారు.














