Last Updated:
PM Modi: సముద్ర జలాల్లో పరాక్రమం, నైపుణ్యం లేకుండా ఏ దేశం కూడా గొప్ప ప్రపంచ శక్తిగా ఎదగలేదని ప్రధాని మోదీ అన్నారు. ఒక దేశ అభివృద్ధి, జాతీయ భద్రత, ఆర్థిక శ్రేయస్సు అన్నీ సముద్రాలతోనే ముడిపడి ఉన్నాయని ఆయన వివరించారు. సముద్ర రంగంలో బలమైన సామర్థ్యాలు ఉన్న దేశం.. ఆర్థికంగానూ, వ్యూహాత్మకంగానూ మరింత శక్తిమంతంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
భారతదేశ ఆర్థిక, వ్యూహాత్మక ప్రభావాన్ని నిర్దేశించడంలో సముద్ర జలాల్లో దేశానికి ఉన్న బలమైన సామర్థ్యమే అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కోల్కతాలో మూడు అధునాతన స్వదేశీ నావికాదళ నౌకలను జలప్రవేశం చేసిన (కమిషన్ చేసిన) తర్వాత ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. రక్షణ రంగంలో భారతదేశం కేవలం ఆయుధాలు కొనుగోలు చేసే దేశంగా మాత్రమే మిగిలిపోకూడదనీ, అలాగే ప్రపంచ దేశాలకు మన సాయుధ దళాలు కేవలం ఒక “మార్కెట్”గా మారకూడదని ఆయన నొక్కిచెప్పారని న్యూస్ ఆన్ ఎయిర్ అధికారిక రిపోర్ట్ తెలిపింది.
సముద్ర జలాల్లో పరాక్రమం, నైపుణ్యం లేకుండా ఏ దేశం కూడా గొప్ప ప్రపంచ శక్తిగా ఎదగలేదని ప్రధాని మోదీ అన్నారు. ఒక దేశ అభివృద్ధి, జాతీయ భద్రత, ఆర్థిక శ్రేయస్సు అన్నీ సముద్రాలతోనే ముడిపడి ఉన్నాయని ఆయన వివరించారు. సముద్ర రంగంలో బలమైన సామర్థ్యాలు ఉన్న దేశం.. ఆర్థికంగానూ, వ్యూహాత్మకంగానూ మరింత శక్తిమంతంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇటీవల కోల్కతాలో ప్రధాని మోదీ స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన మూడు ముఖ్యమైన నౌకలను లాంఛనంగా నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. వాటిలో శత్రు రాడార్లకు చిక్కకుండా దాడి చేసే స్టెల్త్ ఫ్రిగేట్ ‘ఐఎన్ఎస్ దునగిరి’ (INS Dunagiri), సముద్ర మార్గాలను పరిశోధించే సర్వే నౌక ‘ఐఎన్ఎస్ సంశోధక్’ (INS Sanshodhak), శత్రు దేశాల జలాంతర్గాములను నాశనం చేయగల యాంటీ-సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ ‘ఐఎన్ఎస్ అగ్రే’ (INS Agray) ఉన్నాయి. ఈ మూడు నౌకలూ.. సముద్ర పోరాటం, హైడ్రోగ్రాఫిక్ సర్వేయింగ్, జలాంతర్గాముల వ్యతిరేక పోరాటంలో మన నావికాదళానికి తిరుగులేని సామర్థ్యాలను అందిస్తాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
పాకిస్థాన్ జలాంతర్గామి కుట్రలు:
ఇటీవల బంగాళాఖాతం జలాల్లో తొలిసారిగా పాకిస్థాన్ తమ సబ్మెరైన్ని ఉంచేందుకు రెడీ అవుతోంది. అలా ఎందుకు చేస్తోందంటే.. అది భారత్పై ఒత్తిడి పెంచే చర్య అనుకోవచ్చు. ఐతే.. ఆ జలాంతర్గామి.. భారత ప్రాదేశిక జలాల్లో ఉండదు. అలాగే.. బంగాళాఖాతంలో.. భారత్ పరిధిలోకి వచ్చే జలాల్లో కూడా ఉండదు. అంతర్జాతీయ జలాల్లోనే ఆ జలాంతర్గామి ఉంటుంది. ఇదివరకు ఎప్పుడూ పాకిస్థాన్ ఇలా చెయ్యలేదు. ఇదే తొలిసారి. ఇలా చైనా, బంగ్లాదేశ్, పాకిస్థాన్ లాంటి దేశాల్ని ఎదుర్కొనేందుకు భారత్ అన్ని రకాలుగా సిద్ధమవుతోంది. అందులో భాగంగానే.. ఈ మూడు యుద్ధ నౌకల్ని జాతికి అంకితం చెయ్యడం కీలక అంశంగా మారింది.
పాకిస్థాన్ నౌకాదళాన్ని బలోపేతం చేయడానికి చైనాతో ఒక భారీ ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా మొత్తం 8 అధునాతన ‘హంగోర్’ క్లాస్ జలాంతర్గాములను పాకిస్థాన్ తన సొంతం చేసుకోబోతోంది. ఈ కొత్త జలాంతర్గాములలో ‘ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్’ (AIP) అనే అత్యాధునిక సాంకేతికత ఉంది. దీని వల్ల ఇవి బ్యాటరీలను ఛార్జ్ చేసుకోవడానికి పైకి రావాల్సిన అవసరం లేదు. సముద్రగర్భంలో సాధారణ సబ్మెరైన్ల కంటే ఎక్కువ రోజుల పాటు శత్రువుల కంటపడకుండా దాగి ఉండగలవు. ఈ ఎనిమిదింటిలో 4 జలాంతర్గాములను చైనాలో నిర్మిస్తుండగా, మిగిలిన 4 పాకిస్థాన్లోని కరాచీ షిప్యార్డ్లో తయారవుతున్నాయి. ఇటీవల వీటి నిర్మాణ పనుల్లో కీలక దశలు పూర్తయ్యాయి. ఈ కొత్త ఏఐపీ జలాంతర్గాములు పాకిస్థాన్ చేతికి వస్తే, భవిష్యత్తులో అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో భారత నావికాదళానికి కొంత సవాలుగా మారే అవకాశం ఉందని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అందుకే భారత నావికాదళం కూడా వీటికి ధీటుగా తన యాంటీ-సబ్మెరైన్ వార్ఫేర్ (ASW) సామర్థ్యాలను, నిఘాను ఎప్పటికప్పుడు పెంచుకుంటూనే ఉంది.
ఐఎన్ఎస్ విక్రాంత్ (INS Vikrant) నిర్మాణంతో మొదలైన భారతదేశ ప్రయాణం నేడు ఈ నౌకల వరకు చేరుకోవడం కేవలం కొత్త యుద్ధ నౌకల నిర్మాణానికే పరిమితం కాదని, ఆత్మనిర్భరత (స్వయం సమృద్ధి) దిశగా దేశం సాధిస్తున్న విజయాలకు ఇది ప్రతీక అని ప్రధాని మోదీ వివరించారు. ఐఎన్ఎస్ అగ్రే, ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ సంశోధక్ నౌకల జలప్రవేశం మన ఆత్మనిర్భర్ భారత్ ప్రయాణానికి మరింత ఊపునిస్తోందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యధికంగా రక్షణ సామగ్రిని దిగుమతి చేసుకునే దేశాల జాబితాలో భారతదేశం ముందు వరుసలో ఉండేదని, ఈ పరస్పర ఆధారిత విధానం వల్ల దేశం వ్యూహాత్మక, భద్రతాపరమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆయన గుర్తుచేశారు.
ఈ పాత సమస్యలను అధిగమించడానికి, 2014లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రక్షణ రంగంలో భారీగా విధానపరమైన (పాలసీ) సంస్కరణలు చేపట్టిందని ఆయన స్పష్టం చేశారు. ఈ సంస్కరణల ఫలితంగానే గత కొన్నేళ్లలో 40కి పైగా యుద్ధ నౌకలు, జలాంతర్గాములను భారత నౌకాదళంలోకి ప్రవేశపెట్టామనీ, అలాగే ప్రస్తుతం మరో 45 భారీ నావికా ప్లాట్ఫారమ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని ప్రధాని మోదీ గర్వంగా ప్రకటించారు. ఈ పరిణామాలు భారత నౌకాదళాన్ని భవిష్యత్తులో ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దళంగా మారుస్తాయని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana
Jun 22, 2026 10:57 AM IST













