ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతున్న, అనేక దేశాలలో ప్రాణాలు పోవడానికి దారితీసిన యుద్ధం తర్వాత.. ఈ ఒప్పందం ఒక అనుకూల చర్య అని ప్రధాని మోదీ ఒక పోస్ట్లో తెలిపారు.
“ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక అంతరాయానికి కారణమై, అనేక దేశాలలో ప్రాణనష్టానికి దారితీసిన పశ్చిమ ఆసియాలోని సంఘర్షణను ముగించేందుకు అమెరికా, ఇరాన్ల మధ్య కుదిరిన అవగాహనను నేను స్వాగతిస్తున్నాను” అని ప్రధాని రాశారు.
“ఈ డీల్ అమలు గల్ఫ్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికీ, నౌకాయాన, వాణిజ్య స్వేచ్ఛను తిరిగి తేవడానికి సహాయపడుతుందని భారతదేశం ఆశిస్తోంది” అని మోదీ పోస్టులో తెలిపారు. కొన్ని నెలలుగా పరిష్కారం కాని సమస్యలపై చర్చలు ఇప్పుడు శాశ్వతంగా పరిష్కారం కావచ్చని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. “మిగిలిన సమస్యలపై చర్చలు ఒక సుస్థిరమైన తుది ఒప్పందానికి దారితీస్తాయని మేము ఆశిస్తున్నాము” అని ప్రధాని మోదీ జోడించారు.
I welcome the understanding reached between the United States and Iran on ending the conflict in West Asia, which has caused serious economic disruption across the world and led to loss of life in many countries.
India hopes that the implementation of this understanding will…
— Narendra Modi (@narendramodi) June 15, 2026
తమ యుద్ధాన్ని ముగించి, ప్రపంచ చమురు, గ్యాస్ రవాణాకు కీలక మార్గమైన హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఉద్దేశించిన ఒక ఒప్పందానికి వచ్చినట్లు అమెరికా, ఇరాన్ అధికారులు ప్రకటించిన తర్వాత ప్రధానమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ ఒప్పందం ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉన్నప్పటికీ, ఫిబ్రవరిలో ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ కలిసి చేసిన దాడుల తర్వాత ఈ డీల్.. యుద్ధాన్ని ముగిస్తుందనే అంచనాల్ని పెంచింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ ప్లాట్ఫామ్లో దీని గురించి రాశారు. “ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్తో ఒప్పందం ఇప్పుడు పూర్తయింది” అని రాశారు. ఈ చర్చలలో మధ్యవర్తిగా వ్యవహరించిన పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, ఒక ఒప్పందం కుదిరిందని చెప్పిన కొద్దిసేపటికే ఈ ప్రకటన వచ్చింది.
రాయిటర్స్ ప్రకారం, ఈ అవగాహనా ఒప్పందంపై జూన్ 19, శుక్రవారం నాడు స్విట్జర్లాండ్లో లాంఛనంగా సంతకాలు చేయనున్నారు. ఈ ఒప్పందానికి సంబంధించిన అనేక వివరాలు ఇంకా బహిరంగపరచనప్పటికీ, “లెబనాన్ సహా అన్ని రంగాలలో సైనిక కార్యకలాపాలను తక్షణమే, శాశ్వతంగా నిలిపివేయాలని” ఈ ఒప్పందం పిలుపునిస్తుందని షరీఫ్ చెప్పారు. లెబనాన్ సహా అన్ని రంగాలలో సైనిక కార్యకలాపాలు సోమవారం రాత్రి నుంచి శాశ్వతంగా ముగుస్తాయని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా తెలిపింది.
డీల్లో భాగంగా 60 రోజుల కాల్పుల విరమణ కాలంలో ఆంక్షల సడలింపు సహా విస్తృత సమస్యలపై చర్చలు జరుపుతామని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెమ్ గరీబాబాది తెలిపారు. ఐతే.. ఇరాన్ అణు కార్యక్రమం పరిష్కారం కాని ప్రధాన సమస్యలలో ఒకటిగా మిగిలిపోయింది. నెక్ట్స్ చర్చల సందర్భంగా రెండు పక్షాలు ఈ సమస్యను పరిష్కరించుకుంటాయని రాయిటర్స్ రిపోర్ట్ చేసింది.
ఇదిలా ఉండగా, ఈ వార్తకు ప్రపంచ మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. ప్రారంభ ట్రేడింగ్లో చమురు ధరలు తగ్గగా, ఆసియా స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.












