Rajya Sabha elections 2026: దేశంలో రాజ్యసభ ఎన్నికల నగారా.. జూన్ 18న 26 స్థానాలకు పోలింగ్.. షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ! | | ACTPnews

Rajya Sabha elections 2026: దేశంలో రాజ్యసభ ఎన్నికల నగారా.. జూన్ 18న 26 స్థానాలకు పోలింగ్.. షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ! |


ఎన్నికల పూర్తి షెడ్యూల్ వివరాలు

కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన టైమ్‌లైన్ ప్రకారం ఎన్నికల ప్రక్రియ కింది విధంగా సాగనుంది:

నోటిఫికేషన్ జారీ: జూన్ 1

నామినేషన్ల సమర్పణకు చివరి తేదీ: జూన్ 8

నామినేషన్ల పరిశీలన: జూన్ 9

నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి తేదీ: జూన్ 11

పోలింగ్ తేదీ: జూన్ 18 (ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 4 గంటల వరకు)

ఓట్ల లెక్కింపు: జూన్ 18న సాయంత్రం 5 గంటల నుండి ఫలితాలు వెల్లడిస్తారు.

ఏపీ నుండి నలుగురు సభ్యుల పదవీ విరమణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి జూన్ 21తో నలుగురు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ముగియనుంది. పదవీ విరమణ చేయబోయే వారిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) కి చెందిన ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీ, పిల్లి సుభాష్‌చంద్రబోస్ మరియు తెలుగుదేశం పార్టీ (TDP) కి చెందిన కనకమేడల రవీంద్రకుమార్ ఉన్నారు. ఏపీతో పాటు కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల నుండి కూడా నాలుగేసి స్థానాల చొప్పున ఖాళీలు ఏర్పడుతున్నాయి. అలాగే మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో ముగ్గురు చొప్పున, ఝార్ఖండ్ నుండి ఇద్దరు, అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం రాష్ట్రాల నుండి ఒక్కొక్క సభ్యుడు చొప్పున రిటైర్ కాబోతున్నారు.

రంగంలో హేమాహేమీలు.. పార్టీల వారీగా ఖాళీలు

ఈ విడతలో పదవీ విరమణ పొందుతున్న వారిలో దేశ రాజకీయాల్లోని హేమాహేమీలు ఉన్నారు. కర్ణాటక నుండి మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మధ్యప్రదేశ్ నుండి కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, కేంద్ర పశుసంవర్ధక శాఖ సహాయ మంత్రి జార్జ్ కురియన్, రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్‌నీత్‌సింగ్ బిట్టు వంటి ప్రముఖుల పదవీ కాలం ముగియనుంది. జూన్ నెలాఖరుకు ఖాళీ అవుతున్న మొత్తం 24 ద్రైవార్షిక స్థానాల్లో ప్రస్తుతం అత్యధికంగా భాజపాకు 12, కాంగ్రెస్‌కు 4, వైకాపాకు 3 స్థానాలు ఉన్నాయి. వీటితో పాటు బీఆర్‌ఎస్, జేడీఎస్, ఎండీఎంకే, ఎన్‌సీపీ, పీఎంకే, జేఎంఎం, తెదేపా పార్టీల నుండి ఒక్కొక్క ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

రెండు స్థానాలకు ఉప ఎన్నికలు ఎందుకంటే?

మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల నుండి ఒక్కో స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ జనవరి 28న జరిగిన విమాన ప్రమాదంలో మరణించడంతో, ఆ స్థానానికి ఆయన సతీమణి సునేత పవార్ మే 5న రాజీనామా చేశారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక తమిళనాడులో ఎండీఎంకేకి చెందిన సీవీ షణ్ముగం ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవడంతో ఈ నెల 7న తన రాజ్యసభ స్థానానికి రాజీనామా చేశారు. ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీలో అధికార డీఎంకే కూటమికి స్పష్టమైన సంఖ్యాబలం ఉన్నందున, ఆ ఖాళీ సీటు డీఎంకే ఖాతాలోకే వెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

రాజ్యసభలో ప్రస్తుత బలాబలాలు

ప్రస్తుతం ఎగువసభలో అధికార పక్షానిదే పైచేయిగా ఉంది. రాజ్యసభలోని మొత్తం స్థానాల్లో అధికార ఎన్డీయే (NDA) కూటమి 149 స్థానాల బలంతో పటిష్టంగా ఉంది. విపక్ష కూటమి 78 స్థానాలను కలిగి ఉండగా, ఏ కూటమికి చెందని తటస్థ ప్రాంతీయ పార్టీలు 17 స్థానాల్లో ఉన్నాయి. ఈ ఎన్నికల అనంతరం అసెంబ్లీలలో మారిన బలాబలాల దృష్ట్యా పెద్దల సభలో పార్టీల సీట్ల సమీకరణాలు మరింత ఆసక్తికరంగా మారనున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports