Last Updated:
రానా నేతృత్వంలోని ‘స్పిరిట్ మీడియా’ (Spirit Media) భారతీయ చిత్ర పరిశ్రమలో ఇండీ (ఇండిపెండెంట్) సినిమాలకు ఒక సరికొత్త, బలమైన వేదికగా మారుతోంది. తాజాగా నేడు 15 ఇంటర్నేషనల్ అవార్డ్స్ పొందిన షేఫ్ ఆఫ్ మోమో రిలీజ్ చేయబోతోంది.
భారతీయ చలనచిత్ర రంగంలో అగ్ర నిర్మాణ సంస్థలైన సురేష్ ప్రొడక్షన్స్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ, తనకంటూ ఒక విలక్షణమైన పంథాను ఏర్పరచుకున్నారు నటుడు, నిర్మాత రానా దగ్గుబాటి. కేవలం భారీ బడ్జెట్, కమర్షియల్ సినిమాలకే పరిమితం కాకుండా, వైవిధ్యమైన కంటెంట్ను, సరికొత్త ఆలోచనలను ప్రోత్సహించడంలో ఆయన ఎప్పుడూ ముందే ఉంటారు. ప్రస్తుతం రానా నేతృత్వంలోని ‘స్పిరిట్ మీడియా’ (Spirit Media) భారతీయ చిత్ర పరిశ్రమలో ఇండీ (ఇండిపెండెంట్) సినిమాలకు ఒక సరికొత్త, బలమైన వేదికగా మారుతోంది.
ఎలాంటి స్టార్ కాస్టింగ్, కమర్షియల్ హంగులు లేకుండా, కేవలం బలమైన కథనే నమ్ముకుని వచ్చే చిన్న చిత్రాలకు స్పిరిట్ మీడియా కొండంత అండగా నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్స్లో ప్రశంసలు అందుకున్నప్పటికీ, థియేట్రికల్ విడుదలకు నోచుకోని అద్భుతమైన చిత్రాలను సామాన్య ప్రేక్షకుడి చెంతకు చేర్చడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. దీనివల్ల ఇండస్ట్రీలో పెద్దగా బ్యాక్గ్రౌండ్ లేని ఎంతోమంది ప్రతిభావంతులైన ప్రాంతీయ దర్శకులకు, రచయితలకు తమ కలలను దేశవ్యాప్తంగా పంచుకునే అవకాశం దక్కుతోంది.
రానా దగ్గుబాటి నేతృత్వంలో సాగుతున్న ఈ ఇండీ ఫిలిం మూవ్మెంట్లో ప్రస్తుతం నార్త్ ఈస్ట్ (ఈశాన్య రాష్ట్రాల) సినిమాలు చాలా ప్రత్యేకంగా నిలుస్తూ వేగంగా ఎదుగుతున్నాయి. సిక్కిం, అస్సాం, మణిపూర్, మేఘాలయ వంటి ప్రాంతాల నుంచి వస్తున్న సినిమాలు ప్రేక్షకులకు ఒక సరికొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ను ఇస్తున్నాయి.
సాధారణంగా మన సౌత్, నార్త్ మెయిన్స్ట్రీమ్ ఆడియన్స్కు నార్త్ ఈస్ట్ రాష్ట్రాల సంస్కృతి, అక్కడి జీవన విధానంపై అవగాహన తక్కువ. కానీ, అక్కడి విభిన్నమైన సంస్కృతిని, అచ్చమైన మానవ సంబంధాలను చాలా రియలిస్టిక్గా చూపిస్తున్న ఈ చిత్రాలను స్పిరిట్ మీడియా ప్రమోట్ చేయడం వల్ల, దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులు ఆయా ప్రాంతాల సంస్కృతిని అర్థం చేసుకునే వీలు కలుగుతోంది.
ఈ సరికొత్త సినిమా విప్లవానికి ఒక అద్భుతమైన ఉదాహరణగా, ఇవాళ శుక్రవారం (మే 29) థియేటర్లలోకి వస్తున్న సిక్కిం మూవీ ‘షేప్ ఆఫ్ మోమో’ (Shape of Momo) చిత్రాన్ని చెప్పుకోవచ్చు. ట్రిబేనీ రాయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈశాన్య భారత దేశపు జీవన విధానాన్ని, అక్కడి ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ తెరకెక్కింది. ఇప్పటికే ఈ చిత్రం వివిధ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో ప్రదర్శితమై 15కి పైగా అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుని గ్లోబల్ లెవెల్లో అందరి దృష్టిని ఆకర్షించింది.
బాలీవుడ్ ప్రముఖ మేకర్స్ జోయా అక్తర్ (జీబ్రా క్రాసింగ్ పిక్చర్స్), అలాగే కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో గ్రాండ్ ప్రిక్స్ అవార్డు గెలుచుకున్న ‘ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్’ దర్శకురాలు పాయల్ కపాడియా లాంటి క్రేజీ ప్రొడ్యూసర్స్ ఈ ప్రాజెక్ట్కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్గా సపోర్ట్ ఇవ్వడం విశేషం. ఇంతటి క్రేజ్ ఉన్న ప్రాంతీయ చిత్రాన్ని రానా దగ్గుబాటి తన ‘స్పిరిట్ మీడియా’ ద్వారా నేరుగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా థియేటర్లకు తీసుకురావడం విశేషం.
భారీ బడ్జెట్ సినిమాలు, పాన్-ఇండియా ఫార్ములా కథల మధ్య నలిగిపోతూ, కేవలం ఓటీటీలకే పరిమితమవుతున్న చిన్న చిత్రాలకు రానా దగ్గుబాటి అందిస్తున్న ఈ మద్దతుపై ఇండస్ట్రీ వర్గాల నుండి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. అన్ని ప్రాంతాల, అన్ని భాషల సినిమాలకు సమానమైన గుర్తింపు ఇస్తూ ఒక హెల్తీ సినిమా కల్చర్ను బిల్డ్ చేస్తున్న రానా ప్రయత్నం, టాలీవుడ్తో పాటు దేశీయ సినిమా పరిశ్రమలో ఒక సరికొత్త మైలురాయిగా నిలిచిపోతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana













