సందర్శనార్థం మహారాజ కాలేజీ మైదానంలో పార్థీవ దేహం:
సంగీత ప్రియులు, అభిమానులు, బంధుమిత్రులు, రాజకీయ ప్రముఖుల సందర్శనార్థం ఎస్. జానకి భౌతిక కాయాన్ని ఆదివారం ఉదయం కర్ణాటకలోని మైసూర్ మహారాజ కాలేజీ మైదానంలో ఉంచారు. మధ్యాహ్నం 3 గంటల వరకూ ఆమె పార్థీవ దేహాన్ని అక్కడే ఉంచుతారు. దేశం నలుమూలల నుంచి ఎంతో మంది ప్రముఖులు, అభిమానులు తరలివచ్చి ఆమెను కడసారి చూసుకుని నివాళులర్పిస్తున్నారు. సందర్శకుల రద్దీ దృష్ట్యా స్థానిక పోలీసులు, యంత్రాంగం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
VIDEO | Mortal remains of Veteran playback singer S Janaki brought to Maharaja Ground.
Janaki died at a private hospital in Mysuru on Saturday due to age-related ailments. She was 88. pic.twitter.com/A7ddsMx2tj
— Press Trust of India (@PTI_News) July 12, 2026
జానకమ్మ మృతి పట్ల ఆమె మనవరాలు అప్సరా వైద్యుల.. ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ, “మా నాన్నమ్మ ప్రశాంతంగా మమ్మల్ని విడిచివెళ్లారు. ఆమె పాటలు కోట్లాది మందికి ఆనందాన్నిచ్చాయి” అని తీవ్ర భావోద్వేగం చెందారు.
మధ్యాహ్నం 3 గంటల తర్వాత మహారాజ కాలేజీ మైదానం నుంచి అభిమానుల అశ్రునయనాల మధ్య ఎస్. జానకి అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది. సుదీర్ఘకాలం పాటు సంగీత రంగానికి ఆమె చేసిన విశేష సేవలకు గాను, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఈ అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సాయంత్రం 5 గంటలకు మైసూరు బోగాది దగ్గర్లోని కణియర హుండి గ్రామంలోని వారి సొంత ఫామ్హౌస్లో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ప్రభుత్వ అధికారుల సమక్షంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి.
VIDEO | Bogadi , Mysuru: Veteran playback singer S Janaki passed away on Saturday due to age-related ailments. Her mortal remains are being taken from her residence to Maharaja Ground. pic.twitter.com/Ucaa7lED72
— Press Trust of India (@PTI_News) July 12, 2026
ఆరు దశాబ్దాల సుదీర్ఘ సంగీత ప్రస్థానం:
1938 ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా రేపల్లె సమీపంలోని పల్లపట్ల గ్రామంలో జన్మించిన ఎస్.జానకి, 1957లో ‘విధియిన్ విళయాట్టు’ అనే తమిళ సినిమా ద్వారా తన గాన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆరు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఒడియా, బెంగాలీ తదితర 20కి పైగా భారతీయ భాషల్లో దాదాపు 48,000లకు పైగా పాటలు పాడి ఆమె అరుదైన రికార్డు సృష్టించారు. పిల్లల గొంతుతో పాటలు పాడటం, తన గాత్రంలో ఎన్నో వైవిధ్యభరితమైన భావోద్వేగాలను పలికించడంలో ఆమె దిట్ట. ఇళయరాజా, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎం.ఎస్. విశ్వనాథన్ వంటి దిగ్గజాలతో కలిసి ఎన్నో చిరస్మరణీయమైన గీతాలను ఆమె ఆలపించారు.
ఆమె అద్భుత ప్రతిభకు గుర్తింపుగా నాలుగు జాతీయ ఉత్తమ గాయని అవార్డులు, 33 రాష్ట్ర స్థాయి పురస్కారాలు లభించాయి. 2013లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించినప్పటికీ, ఈ గౌరవం తనకు చాలా ఆలస్యంగా వచ్చిందని, తన సేవలకు ‘భారతరత్న’ తగినదని భావించి ఆమె దానిని సున్నితంగా తిరస్కరించారు. ఎస్. జానకి మరణవార్త తెలుసుకున్న వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ తదితరులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. కమల్ హాసన్, రజనీకాంత్, విజయ్ లాంటి అగ్ర నటులు ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని సంతాపం తెలిపారు.
జానకమ్మ మృతితో భారతీయ సినీ సంగీత లోకంలో ఒక స్వర్ణయుగం ముగిసినట్లయింది. భౌతికంగా ఆమె దూరమైనా, ఆమె పాడిన మధుర గీతాలు అభిమానుల గుండెల్లో నిత్యం ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి.













