Last Updated:
Tamil Nadu: నకిలీ పథకాలు, ఫోన్ కాల్స్ పేరుతో జనాన్ని మోసం చేసే కేటుగాళ్లు రోజుకో కొత్త దారి వెతుక్కుంటున్నారు. ఉచితాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ఆశ చూపి జనాలను ముంచడం వరకు చూశాం.
కానీ, “గుండు కొట్టించుకుంటే రూ. 45 వేల ఆర్థిక సాయం ఇస్తాం” అని నమ్మించి ఓ గ్రామానికి చెందిన అమాయక మహిళల జుట్టు తీయించిన విచిత్ర సంఘటన తమిళనాడులో వెలుగుచూసింది. తహసీల్దార్ పేరిట ఫోన్ చేసి ఉచిత డబ్బు ఆశ చూపించడంతో గ్రామంలోని మహిళలు గుండు కొట్టించుకోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. తమిళనాడులోని సేలం జిల్లా ఆత్తూర్ సమీపంలో ఉన్న పుదుకొత్తాంబాడి గ్రామానికి చెందిన పళనియమ్మాళ్ అనే మహిళకు సోమవారం ఒక గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి తాను స్థానిక తాలూకా కార్యాలయం నుంచి మాట్లాడుతున్నానని, తహసీల్దార్ను అని పరిచయం చేసుకున్నాడు. మాట్లాడేటప్పుడు ఎంతో నమ్మకంగా, ప్రభుత్వ అధికారిలాగా నటిస్తూ గ్రామ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశాడు.
ప్రస్తుతం ప్రాంతంలో కరోనా తరహాలోనే ఒక కొత్త రకం ప్రమాదకరమైన వ్యాధి వేగంగా వ్యాపిస్తోందని సదరు కేటుగాడు ఆమెకు నమ్మబలికాడు. ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే వెంటనే ఇంట్లోని వాళ్లంతా గుండు కొట్టించుకోవాలని ఉచిత సలహా ఇచ్చాడు. అంతేకాకుండా, ప్రభుత్వం ఈ వ్యాధి నివారణ చర్యల్లో భాగంగా గుండు కొట్టించుకున్న ప్రతి ఒక్కరికీ ఆర్థిక సాయం అందిస్తోందని నమ్మించాడు.
గుండు కొట్టించుకుంటే ప్రభుత్వం తరఫున రూ. 15,000 నుంచి రూ. 45,000 వరకు నేరుగా వారి ఖాతాల్లో జమ అవుతాయని, వెంటనే ఈ విషయాన్ని ఊరిలోని మిగతా వారికి కూడా చెప్పాలని సూచించాడు.
తహసీల్దార్ స్థాయి అధికారే నేరుగా ఫోన్ చేసి చెప్పాడన్న నమ్మకంతో పళనియమ్మాళ్ ఈ విషయాన్ని గ్రామంలోని ఇతర మహిళలకు తెలిపింది. రూ. 45 వేల వరకు నగదు వస్తుందన్న ఆశతో గ్రామానికి చెందిన కావేరి (56), రామాయి (58), చిత్ర (60) అనే ముగ్గురు మహిళలు వెంటనే గుండు కొట్టించుకున్నారు. వీరిని చూసి మరో 20 మంది మహిళలు కూడా గుండు కొట్టించుకోవడానికి సిద్ధమయ్యారు.
ఈ లోపు నగదు జమ అయ్యే ప్రక్రియ, తదుపరి వివరాల కోసం సదరు వ్యక్తికి ఫోన్ చేయగా, అతని మొబైల్ ఫోన్ ‘స్విచ్ ఆఫ్’ అని వచ్చింది. ఎంతసేపటికీ ఫోన్ కలవకపోవడంతో అనుమానం వచ్చిన మహిళలు తాము ఒక కేటుగాడి చేతిలో దారుణంగా మోసపోయామని గ్రహించి లబోదిబోమన్నారు.
అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, ప్రభుత్వ అధికారి పేరుతో తమను మోసగించి, సమాజంలో అవమానపడేలా చేసిన సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని బాధితులు స్థానిక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సదరు సైబర్ మోసగాడి ఫోన్ నంబర్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.
ప్రభుత్వ అధికారులమని చెప్పి అపరిచిత వ్యక్తులు చేసే ఫోన్ కాల్స్ను, విచిత్రమైన ఆఫర్లను ఎవరూ నమ్మవద్దని పోలీసులు ప్రజలను కోరారు. ఏవైనా ప్రభుత్వ పథకాలు ఉంటే అధికారిక కార్యాలయాల ద్వారానే సమాచారం అందుతుందని, ఇలాంటి సైబర్ దగాలు, ఫోన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana














