ఈ నిర్ణయం తెలంగాణలోని ఉత్తర ప్రాంతాల అభివృద్ధికి ఊతమిస్తుందని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం ఉన్న రహదారుల సామర్థ్యం తక్కువ కావడం వల్ల ట్రాఫిక్ రద్దీ, ప్రయాణ సమయం ఎక్కువగా ఉండేది. ఈ విస్తరణతో ఆర్మూర్-మంచిర్యాల మధ్య ప్రయాణ సమయం సుమారు 1.5 గంటలు తగ్గనుంది. అలాగే జగిత్యాల-కరీంనగర్ మధ్య సుమారు 45 నిమిషాలు తగ్గుతుందని ది హిందూ తన రిపోర్టులో అంచనా వేసింది.
ఈ ప్రాజెక్టు మూడు ప్యాకేజీలుగా విభజించారు.
– ఆర్మూర్-జగిత్యాల సెక్షన్ (NH-63): 63.6 కి.మీ, సుమారు రూ.2,472 కోట్లు.
– జగిత్యాల-మంచిర్యాల సెక్షన్ (NH-63): 68.3 కి.మీ, సుమారు రూ.2,731 కోట్లు.
– జగిత్యాల-కరీంనగర్ సెక్షన్ (NH-563): 58.8 కి.మీ, సుమారు రూ.2,395 కోట్లు.
NH-63 సెక్షన్లు హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) కింద, NH-563 సెక్షన్ బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్ఫర్ (టోల్) మోడల్ కింద అమలవుతాయి. ఈ పనులు పీఎం గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ భాగంగా జరుగుతాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వివరించారు.
ఈ విస్తరణలో బైపాస్లు, రోడ్ సేఫ్టీ ఫీచర్లు, ఆధునిక డ్రైనేజ్ సిస్టమ్లను చేర్చుతారు. ఇది ట్రాఫిక్ రద్దీని తగ్గించి, ఆర్థిక కార్యకలాపాలను పెంచుతుంది. రైతులు, వ్యాపారులు, పరిశ్రమలు లాభపడతాయి. ఇంధన వినియోగం, కార్బన్ ఉద్గారాలు, వాహన నిర్వహణ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని అధికారులు అంటున్నారు.
ఈ ప్రాజెక్టు ఉత్తర తెలంగాణలోని వ్యవసాయం, పరిశ్రమలు, టూరిజం రంగాలకు ఊతమిస్తుంది. కరీంనగర్, మంచిర్యాల వంటి ప్రాంతాల్లో ఉన్న ఖనిజ సంపద, ఇండస్ట్రియల్ యూనిట్లు మెరుగైన కనెక్టివిటీతో లాభపడతాయి. ప్రయాణ సమయం తగ్గడం వల్ల లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
ప్రధాని మోదీ ట్వీట్.
ఈ అంశంపై ప్రధాని మోదీ తెలుగులో ట్వీట్ చేశారు. “తెలంగాణలో మౌలిక సదుపాయాలకు మరింత ఉత్తేజం!” తెలంగాణలో ఆర్మూర్, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్లను అనుసంధానించే కీలక జాతీయ రహదారి మార్గాల విస్తరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో అనుసంధానత మెరుగుపడటంతో పాటు, ప్రయాణ సమయం, ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది.ఆర్థిక కార్యకలాపాలకు కూడా ఊతం లభిస్తుంది” అని ట్వీట్లో తెలిపారు.
తెలంగాణకు కేంద్రం వరం.
ఈ నిర్ణయం వికసిత్ భారత్ 2047 లక్ష్యాలతో సమన్వయం చేసుకుని ఉందని బీజేపీ నాయకులు వ్యాఖ్యానించారు. ఇది కేవలం రోడ్డు విస్తరణ కాదు, ప్రాంతీయ సమతుల్య అభివృద్ధికి అడుగు. హైదరాబాద్తో మంచి కనెక్టివిటీ ఏర్పడటం వల్ల ఇన్వెస్ట్మెంట్లు ఆకర్షించవచ్చు. గతంలో కూడా కేంద్రం తెలంగాణలో రైల్వే, రోడ్డు ప్రాజెక్టులకు ఆమోదం ఇచ్చింది. ఈ నిర్ణయం ఆ సత్ఫలితాలను మరింత వేగవంతం చేస్తుంది.
ఇతర కేబినెట్ నిర్ణయాలు:
ఈ సమావేశంలో తెలంగాణ హైవే ప్రాజెక్టు మాత్రమే కాకుండా, ఇతర రాష్ట్రాల్లో అంటే బీగార్, మధ్యప్రదేశ్, ఒడిశాలో హైవే ప్రాజెక్టులు, విమాన ఇంధన ధరల స్థిరీకరణకు రూ.10,000 కోట్ల నిధి వంటి వాటిని ఆమోదించారు. మొత్తం రూ.24,250 కోట్లకు పైగా హైవే ప్రాజెక్టులు ఆమోదం పొందాయి. ఇవి జాతీయ అభివృద్ధి దిశగా ముందడుగులు అని మంత్రులు చెప్పారు.
అభివృద్ధి మార్గం:
ఈ కేంద్ర కేబినెట్ నిర్ణయం తెలంగాణ అభివృద్ధిలో మైలురాయి. మెరుగైన రహదారులు ఆర్థిక వృద్ధి, ఉపాధి, సౌకర్యాలను పెంచుతాయి. ప్రధాని మోదీ నాయకత్వంలో మౌలిక సదుపాయాలపై దృష్టి సారించడం దేశ వికాసానికి ఉపయోగపడుతోంది. ఈ ప్రాజెక్టు త్వరగా పూర్తి కావాలని ప్రజలు ఆశిస్తున్నారు.












