ఖమ్మం ఏసెస్ ఇన్నింగ్స్ తీరు:
ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందని అందరూ ఊహించినట్లుగానే సాగింది. మ్యాచ్ ప్రారంభంలో, టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్న ఖమ్మం ఏసెస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఈ కీలక ఇన్నింగ్స్లో ఖమ్మం బ్యాటర్ మికిల్ జైస్వాల్ తన పవర్ హిట్టింగ్తో ఆకట్టుకున్నాడు. అతడు కేవలం 39 బంతుల్లో 4 అద్భుతమైన ఫోర్లు, 4 భారీ సిక్సర్లతో 65 పరుగులు సాధించి జట్టుకు గౌరవప్రదమైన పోరాడే స్కోరును అందించాడు. మిగతా బ్యాటర్లలో హిమతేజ (31), విద్యానంద రెడ్డి (20 నాటౌట్), ప్రతీక్ రెడ్డి (15) పర్వాలేదనిపించారు. ఇక హైదరాబాద్ బౌలర్ల విషయానికొస్తే, ఫైనల్ మ్యాచ్కి తగ్గట్టుగానే కట్టుదిట్టమైన బౌలింగ్ చేశారు. ముఖ్యంగా స్పిన్నర్ యశ్వీర్ గౌడ్ కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు తీసి ఖమ్మం బ్యాటింగ్ లైనప్ను కుప్పకూల్చాడు. అలాగే దేవ్ మెహతా, అజయ్ గౌడ్ చెరో రెండు వికెట్లు తీయగా, అఖిల్ రాథోడ్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ విజయ విన్యాసం:
ఆ తర్వాత 158 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆడి 17.4 ఓవర్లలోనే కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఆరంభంలో ఓపెనర్ సాయివికాస్ (4) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరినప్పటికీ, కెప్టెన్ అభిరథ్ రెడ్డి తన బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్తో ఆదుకున్నాడు. అతడు 30 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్తో 48 పరుగులు చేయగా, షణ్ముఖ అశ్విన్ 21 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 36 పరుగులు చేశాడు. వీరు ఇద్దరూ కలిసి రెండో వికెట్కు 63 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇన్నింగ్స్కు గట్టి పునాది వేశారు.
ఆ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన వైష్ణవ్ రెడ్డి 28 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్ల సాయంతో 41 పరుగులు చేసి వికెట్ పడకుండా అజేయంగా నిలిచి జట్టును సునాయాసంగా విజయం తీరాలకు చేర్చాడు. ప్రణవ్ వర్మ.. 16 బంతుల్లో 19 రన్స్ చేసి, నాటౌట్గా నిలిచి.. అతనికి చక్కటి సహకారం అందించి మ్యాచ్ను ముగించాడు. ఖమ్మం బౌలర్లలో హర్షిత్ సాయి, విద్యానందరెడ్డి, వేద్రెడ్డి, షేక్ అజర్ తలో వికెట్ పడగొట్టారు. ఫైనల్ మ్యాచ్లో అద్భుత బౌలింగ్ కనబరిచి హైదరాబాద్ విజయానికి పునాది వేసిన స్పిన్నర్ యశ్వీర్ గౌడ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఘనంగా ఎంపికయ్యాడు.
అవార్డులు, ప్రైజ్ మనీ:
ఈ టోర్నమెంట్లో అద్భుత ప్రతిభ చూపిన క్రీడాకారులను గుర్తించి భారీ స్థాయిలో అవార్డులు అందజేశారు. హైదరాబాద్ జట్టు కెప్టెన్ అభిరథ్ రెడ్డి టోర్నీలో అసాధారణ ఫామ్తో ఏకంగా 541 పరుగులు సాధించి ‘ఆరెంజ్ క్యాప్’తో పాటు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ పురస్కారాన్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్లో అతను ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు సాధించడంతో పాటు అత్యధికంగా 58 ఫోర్లు, 33 సిక్సర్లు బాదాడు. అత్యధిక వికెట్లు (21) పడగొట్టిన హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ అజయ్ దేవ్ గౌడ్ ‘పర్పుల్ క్యాప్’ సొంతం చేసుకున్నాడు. ఖమ్మం ప్లేయర్ మికిల్ జైస్వాల్కు ‘ఇన్క్రెడిబుల్ మూమెంట్ ఆఫ్ ది టోర్నమెంట్’, ‘బెస్ట్ క్యాచ్ ఆఫ్ ది సీజన్’ అవార్డులు వరించాయి. వరంగల్ బ్యాటర్ అమన్ రావు (స్ట్రైక్ రేట్ 245.5) ‘సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్’గా, ఖమ్మం ప్లేయర్ హిమతేజ ‘గేమ్ ఛేంజర్’గా, 16 ఏళ్ల ఖమ్మం స్పిన్నర్ వేద్ రెడ్డి ‘ఎమర్జింగ్ ప్లేయర్’గా నిలిచారు. విజేతగా నిలిచిన హైదరాబాద్ జట్టుకు రూ. 1 కోటి, రన్నరప్ ఖమ్మం జట్టుకు రూ. 50 లక్షల భారీ ప్రైజ్ మనీ చెక్కులను తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రత్యేకంగా అందజేశారు.
చివర్లో మ్యాచ్ ముగింపు వేడుకలు అత్యంత అట్టహాసంగా, పండుగ వాతావరణంలో సాగాయి. ఫైనల్ సమరానికి ముందు, తర్వాత తెలంగాణ రాష్ట్ర గొప్ప సంస్కృతి, కళలు,
సంప్రదాయాలను ప్రతిబింబించేలా ప్రత్యేకంగా నిర్వహించిన కల్చరల్ ప్రోగ్రామ్స్ స్టేడియంలోని ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తన లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్తో స్టేడియంను ఊపేశాడు.
ఈ అద్భుతమైన ఫైనల్ సమరాన్ని టీజీ20 లీగ్ బ్రాండ్ అంబాసిడర్, ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ, డీజీపీ సీవీ ఆనంద్, టాలీవుడ్ పాపులర్ నటులు శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్ తదితర ప్రముఖులు ప్రత్యక్షంగా చూసి ఆటగాళ్లను అమితంగా ప్రోత్సహించారు. కప్పు గెలిచిన తర్వాత.. హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ ఆటగాళ్లు మైదానం అంతా తిరుగుతూ, అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు.











