Last Updated:
తిరుమలలో హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపిన 78 మందికి పోలీసులు రూ.78 వేల జరిమానా విధించారు. రోడ్డు ప్రమాదాల నివారణ, భక్తుల భద్రతే లక్ష్యమని జిల్లా పోలీసులు స్పష్టం చేశారు.
తిరుమలకు వచ్చే భక్తులు, ద్విచక్ర వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తిరుపతి జిల్లా పోలీసు శాఖ తిరుమలలో హెల్మెట్ నిబంధనల అమలుపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది. జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్, ఆదేశాల మేరకు గురువారం తిరుమల డౌన్ ఘాట్ రోడ్డులోని అలిపిరి సమీపంలో ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న 78 మంది వాహనదారులను గుర్తించి, ఒక్కొక్కరికి రూ.1,000 చొప్పున మొత్తం రూ.78,000 జరిమానా విధించారు. ట్రాఫిక్ నిబంధనల అమలుతో పాటు రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే ఈ ప్రత్యేక డ్రైవ్ ప్రధాన ఉద్దేశ్యమని పోలీసులు తెలిపారు.
తనిఖీల అనంతరం వాహనదారులకు హెల్మెట్ వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలు, రోడ్డు ప్రమాదాల సమయంలో ప్రాణ రక్షణలో హెల్మెట్ పాత్ర, మోటారు వాహనాల చట్టం ప్రకారం హెల్మెట్ ధరించడం తప్పనిసరి అనే అంశాలపై పోలీసులు అవగాహన కల్పించారు. ప్రతి ప్రయాణంలో ఐఎస్ఐ (ISI) ప్రమాణాల హెల్మెట్ను తప్పనిసరిగా ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని సూచించారు. జరిమానాలు విధించడం కంటే ప్రజల్లో రోడ్డు భద్రతపై చైతన్యం పెంచడం, ప్రమాదాలను నివారించడమే తమ లక్ష్యమని అధికారులు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు మాట్లాడుతూ, హెల్మెట్ ధరించడం చట్టబద్ధమైన బాధ్యత మాత్రమే కాదు… అది ప్రతి ద్విచక్ర వాహనదారుడి ప్రాణాలను కాపాడే రక్షణ కవచం. జరిమానా విధించడం పోలీసుల లక్ష్యం కాదు. ప్రమాదాలను నివారించడం, ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడమే మా ప్రధాన ఉద్దేశ్యం. ప్రతి వాహనదారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై ఇలాంటి ప్రత్యేక డ్రైవ్లు నిరంతరం కొనసాగుతాయని, నిబంధనలు అతిక్రమించే వారిపై మోటారు వాహనాల చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తిరుమల ట్రాఫిక్ సీఐ హరి ప్రసాద్, ఎస్ఐలు మరియు ట్రాఫిక్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Hyderabad,Telangana














