Last Updated:
నీట్ పేపర్ లీక్పై ఫాస్ట్ట్రాక్ కోర్టులు, మోడీ ప్రకటన. ప్రియాంక, రాహుల్ స్పందన. మెట్రో మూసివేతపై సుప్రీంకోర్టు జోక్యం. కేటీఆర్, రేవంత్ రెడ్డి మధ్య లీగల్ నోటీసులు.
పేపర్ లీక్పై విచారణకు ఫాస్ట్ట్రాక్ కోర్టులు
నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై పార్లమెంట్లో కూడా వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నీట్ పేపర్ లీక్ పై స్పందించారు. కేసుల బాధ్యులకు త్వరితగతిన కఠిన శిక్షలు విధించేందుకు ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. యువత భవిష్యత్తుతో ఆటలాడేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు.
ప్రధాని మోడీ ట్వీట్పై స్పందించారు కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ ప్రియాంక గాంధీ. విద్యార్థుల డిమాండ్లను ప్రధాని వినాలన్నారు . వ్యవస్థపై విద్యార్థులు విశ్వాసం కోల్పోయారని విమర్శించారు. విద్యార్థుల డిమాండ్లను అంగీకరిస్తేనే సమస్య పరిష్కారం అవుతుందన్నారు ప్రియాంక.
రాహుల్ గాంధీ నివాసంలో కాంగ్రెస్ ఎంపీల అత్యవసర సమావేశం నిర్వహించారు. నీట్ పేపర్ లీకేజీ అంశంలో తదుపరి కార్యాచరణపై చర్చిస్తున్నారు. జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసనలు, తాజా పరిణామాలపై ప్రధానంగా ఈ భేటీలో చర్చలు జరుపుతున్నారు. దీంతో రాహుల్ గాంధీ ఇంటి దగ్గర భారీగా పోలీసుల మోహరించారు.
కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల నేపథ్యంలో ఢిల్లీలో వరుసగా రెండో రోజు 16 మెట్రో స్టేషన్లను అధికారులు మూసివేశారు. దీంతో ప్రయాణికుల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. న్యాయవాదులు, వ్యాజ్యదారులు, కోర్టు సిబ్బంది న్యాయస్థానానికి రావడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (SCBA) పిటిషన్ వేసింది. దీనిపై జోక్యం చేసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ను కోరింది. దీనికి సీజేఐ స్పందిస్తూ.. సమస్య పరిష్కారం కాకపోతే తాము జోక్యం చేసుకుంటామని పేర్కొన్నారు.
గత ప్రభుత్వంలో ఇంటర్ పేపర్ల మూల్యాంకనంలో జరిగిన తప్పిదాలతో 27 మంది విద్యార్థులు బలయ్యారన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. గ్లోబరీనా సంస్థ విషయంలో కేటీఆర్ నిజాయతీ నిరూపించుకోవాలని సవాల్ చేశారు. విద్యార్థుల మృతికి కారణమైన కేటీఆర్ క్షమాపణ చెప్పాలన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు బీఆర్ఎస్ ఎందుకు డిమాండ్ చేయలేదు? అని ప్రశజ్నించారు. బీజేపీ నేతల మధ్య అంతర్గత కొట్లాటలు జరుగుతున్నాయని విమర్శించారు రేవంత్ రెడ్డి.
సీఎం రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసులు జారీ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గ్లోబేరినా టెక్నాలజీస్ అంశంలో చేసిన అసత్య ఆరోపణలపై 48 గంటల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా సీఎం రేవంత్ రెడ్డి మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. గ్లోబేరినా సంస్థతో తనకు ఎలాంటి ఆర్థిక సంబంధాలు లేదా యాజమాన్య హక్కులు లేవన్నారు.
ఏపీలో గోదావరి పుష్కరాల నిర్వహణకు రూ.50 కోట్లు మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ‘నేతన్నల సేవలో’ పథకం అమలుకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసిందని ఏపీ మంత్రి పార్థసారథి తెలిపారు.ఈ పథకం కింద చేనేత కుటుంబాలకు ఏటా రూ.25వేల ఆర్థికసాయం అందించనున్నట్లు వివరించారు. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలను మీడియాకు ఆయన వెల్లడించారు.
హర్మూజ్ జలసంధిలో ఇరాన్ ఇకనుంచి ఏదైనా నౌకపై దాడి చేసినప్పుడల్లా ఆ దేశంలోని ఓ వంతెన లేదా విద్యుత్ కేంద్రంపై బాంబులేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. వాటికి ఐఆర్జీసీ నుంచి తీవ్ర స్పందన వచ్చింది. అమెరికాపై 9/11 తరహా దాడి చేస్తామని ఇరాన్ బెదిరించింది. ఘర్షణలు ఇలాగే కొనసాగితే ఆ దేశం జాతీయ సంతాప దినాలు చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరికలు చేసింది. ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వ అనుబంధ మీడియా సంస్థ తస్నిమ్ పేర్కొంది.
ఆస్తి వేలం వివాదంలో నిర్మాత బండ్ల గణేశ్కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. లోన్ వ్యవహారంలో యూనియన్ బ్యాంకు చర్యలను సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్పై నేడు విచారణ జరిగింది. బండ్ల గణేశ్, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తిని యూనియన్ బ్యాంక్ వేలం వేసి స్వాధీనం చేసుకోవడంపై జోక్యం చేసుకునేందుకు అత్యున్నత న్యాయస్థానం (Supreme Court) నిరాకరించింది.
సినీ నటి త్రిష ‘జన నాయగన్’ సినిమా చూశారు. చెన్నైలోని ఓ థియేటర్లో ఆమె సినిమాకు వెళ్లారు. త్రిష రాకతో థియేటర్ వద్ద సందడి నెలకొంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ (Vijay) నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’. జనవరిలో విడుదల కావాల్సిన ఈ మూవీ పలు కారణాలతో వాయిదా పడుతూ చివరకు జూలై 23న విడుదలైంది.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana














