Last Updated:
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఉన్న సన్నిహిత స్నేహంపై అమెరికా రాయబారి సెర్జియో గోర్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
భారత్–అమెరికా సంబంధాలు మరింత బలోపేతమవుతున్న నేపథ్యంలో అమెరికా రాయబారి సెర్జియో గోర్ (Sergio Gor) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఉన్న స్నేహంపై ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అమెరికా–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక (US-India Strategic Partnership Forum – USISPF) నిర్వహించిన లీడర్షిప్ సమ్మిట్ 2026లో పాల్గొన్న ఆయన, ఇరు దేశాల మధ్య సంబంధాలతో పాటు మోదీ–ట్రంప్ వ్యక్తిగత అనుబంధంపై కూడా మాట్లాడారు.
ఈ సందర్భంగా సెర్జియో గోర్ కొన్ని నెలల క్రితం జరిగిన ఓ సంఘటనను గుర్తుచేశారు. మియామిలో నిర్వహించిన UFC ఈవెంట్కు ఇద్దరూ హాజరైన సమయంలో బ్యాక్స్టేజ్లో ట్రంప్ ఒక్కసారిగా “ప్రధానమంత్రి మోదీకి ఇప్పుడే ఫోన్ చేద్దాం” అని చెప్పారని వివరించారు. ఆ సమయంలో భారత కాలమానం ప్రకారం ఉదయం 6 గంటలు అవుతున్నాయని తాను ట్రంప్కు గుర్తు చేసినట్లు చెప్పారు.
అందుకు ట్రంప్ చిరునవ్వుతో స్పందిస్తూ, “ఆయన ఇప్పటికి లేచే ఉంటారు. ఆయన కూడా నా లాగే తక్కువ నిద్రపోతారు” అని వ్యాఖ్యానించినట్లు సెర్జియో గోర్ వెల్లడించారు. అయితే ట్రంప్ వెంటనే వేదికపైకి వెళ్లాల్సి ఉండటంతో ఆ రోజు ఇద్దరు నేతల మధ్య ఫోన్ సంభాషణ జరగలేదని, అనంతరం మరుసటి రోజుకు ఆ సంభాషణను నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ఘటన ట్రంప్కు మోదీపై ఉన్న వ్యక్తిగత స్నేహాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు.
ట్రంప్, మోదీని కేవలం మరో దేశాధినేతగా కాకుండా సన్నిహిత మిత్రుడిగా భావిస్తారని సెర్జియో గోర్ అన్నారు. నిజమైన స్నేహితుల మధ్య ప్రతి సంభాషణను ముందుగానే షెడ్యూల్ చేయాల్సిన అవసరం ఉండదని, అవసరమైతే నేరుగా ఫోన్ చేసి “ఎలా ఉన్నారు?” అని అడిగే స్థాయి అనుబంధం ఇద్దరి మధ్య ఉందని వ్యాఖ్యానించారు. ప్రపంచంలోని పలువురు నాయకులతో ముందస్తు సమన్వయం అవసరమవుతుందని, కానీ మోదీ విషయంలో ట్రంప్ ప్రత్యేక అనుబంధాన్ని కలిగి ఉన్నారని చెప్పారు.
ఈ స్నేహం ట్రంప్ తొలి అధ్యక్ష పదవీకాలం నుంచే కొనసాగుతోందని రాయబారి గుర్తు చేశారు. ఇద్దరు నాయకుల మధ్య ఉన్న సాన్నిహిత్యం భారత్–అమెరికా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన చర్చలు తుది దశకు చేరుకున్నాయని, చివరి విడత చర్చలు మాత్రమే మిగిలి ఉన్నాయని వెల్లడించారు.
అంతేకాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఏడాది డిసెంబర్లో అమెరికా పర్యటనకు వెళ్లనున్నట్లు సెర్జియో గోర్ తెలిపారు. డిసెంబర్ 14, 15 తేదీల్లో అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం, డోరల్ నగరంలోని ట్రంప్ నేషనల్ డోరల్ మియామి రిసార్ట్లో జరగనున్న 2026 జీ20 శిఖరాగ్ర సమావేశంలో మోదీ పాల్గొనే అవకాశం ఉందన్నారు. 2009 తర్వాత అమెరికా ఆతిథ్యం ఇస్తున్న తొలి జీ20 నాయకుల సదస్సు ఇదేనని పేర్కొన్నారు.
అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే ఏడాది భారత్ పర్యటన చేపట్టే అవకాశం ఉందని కూడా సెర్జియో గోర్ వెల్లడించారు. ఈ ఏడాది ప్రారంభంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో భారత్ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి మోదీని అమెరికా రావాలని అధికారికంగా ఆహ్వానించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అమెరికా ప్రభుత్వం మరోసారి మోదీకి స్వాగతం పలకడానికి సంతోషంగా ఎదురుచూస్తోందని చెప్పినా, ఆ ఆహ్వానంపై భారత్ నుంచి ఇప్పటివరకు అధికారిక స్పందన రాలేదని తెలిపారు.
సెర్జియో గోర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం భారత్–అమెరికా సంబంధాలతో పాటు మోదీ–ట్రంప్ వ్యక్తిగత స్నేహంపై అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













