TTD: పిల్లల విద్యారంభం ఇక శ్రీవారి ఆశీస్సులతో.. జూలై 3 నుంచి టీటీడీ ఆధ్వర్యంలో అక్షర గోవిందం సేవలు ప్రారంభం..! Akshara Govindam TTD program. | | ACTPnews

News18


Last Updated:

టీటీడీ జూలై 3 నుంచి తిరుపతి శ్రీ వకుళామాత ఆలయంలో అక్షర గోవిందం సేవ ప్రారంభం, 3-5 ఏళ్ల చిన్నారులకు విద్యారంభం, వేదోక్త అన్నప్రాశనం, ఉచిత కిట్, రోజుకు 50 మందికి అవకాశం

News18
News18

చిన్నారుల జీవితంలో విద్యారంభం, అన్నప్రాశనం వంటి పవిత్ర ఘట్టాలను మరింత ఆధ్యాత్మికంగా, శాస్త్రోక్తంగా నిర్వహించేలా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మరో విశిష్ట సేవకు శ్రీకారం చుడుతోంది. పిల్లల్లో చిన్నప్పటి నుంచే సనాతన ధర్మ విలువలు, భారతీయ సంస్కృతిపై అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో తిరుపతిలోని శ్రీ వకుళామాత ఆలయంలో అక్షర గోవిందం పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని జూలై 3వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ కార్యక్రమం ద్వారా చిన్నారుల విద్యారంభంతో పాటు వేదోక్త అన్నప్రాశనను కూడా ఒకే వేదికపై నిర్వహించే అరుదైన అవకాశాన్ని భక్తులకు కల్పిస్తోంది.

జూలై 3న మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.30 గంటల వరకు వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య తొలి అక్షర గోవిందం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. సంప్రదాయ పద్ధతిలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి, అనంతరం ఆశీర్వచనం, తీర్థప్రసాదాలతో పాటు ప్రత్యేకంగా రూపొందించిన ‘అక్షర గోవిందం కిట్ ను ఉచితంగా అందజేయనున్నారు. ఈ కిట్‌లో రాతపలక, బలపాలు, అక్షింతలు, పసుపు, కుంకుమ, శ్రీవారి కంకణం, ఫటిక బెల్లం, శ్రీ వకుళామాత, శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ సరస్వతీదేవి చిత్రపటాలు, గోవింద నామాలు, శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం, పెద్దబాలశిక్ష వంటి పూజా, విద్యా సామగ్రిని అందించనున్నారు. దీంతో పిల్లల విద్యారంభం దైవానుగ్రహంతో ప్రారంభమవుతుందనే భావనను మరింత బలపరచాలని టీటీడీ భావిస్తోంది.

అంతేకాకుండా, చిన్నారుల తొలి అన్నప్రాశనను కూడా వేదోక్తంగా నిర్వహించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ అర్చకుల పర్యవేక్షణలో ఆగమోక్త పద్ధతిలో వేదమంత్రోచ్ఛారణల మధ్య అన్నప్రాశనం నిర్వహించి, శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ వకుళామాతల దివ్య ఆశీస్సులను చిన్నారులకు అందజేయనున్నారు. ఒకే కార్యక్రమంలో విద్యారంభం, అన్నప్రాశనం వంటి రెండు ముఖ్యమైన సంస్కారాలను నిర్వహించే అవకాశం కల్పించడం ఈ సేవ ప్రత్యేకతగా నిలుస్తోంది.

ఈ సేవల్లో 3 నుంచి 5 సంవత్సరాల వయస్సు గల చిన్నారులు పాల్గొనవచ్చు. జూలై 4వ తేదీ నుంచి ప్రతి మంగళవారం మినహా మిగతా అన్ని రోజుల్లో ఆలయ అర్చకులు నిర్ణయించే శుభముహూర్తాల్లో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రతిరోజూ రెండు బ్యాచ్‌లుగా మొత్తం 50 మంది చిన్నారులకు మాత్రమే అవకాశం ఉంటుంది. పాల్గొనదలచిన వారు కార్యక్రమానికి గంట ముందుగానే ఆలయ ప్రాంగణంలో నమోదు చేసుకోవాలని, చిన్నారులు తల్లిదండ్రులు లేదా సంరక్షకులతో కలిసి సంప్రదాయ వస్త్రధారణలో హాజరుకావాలని టీటీడీ సూచించింది.

శ్రీ వకుళామాత, శ్రీ వేంకటేశ్వరస్వామివారి దివ్య ఆశీస్సులతో తమ పిల్లల జీవితంలోని తొలి పవిత్ర ఘట్టాలను జరుపుకోవాలనుకునే భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. చిన్నారుల్లో ఆధ్యాత్మిక భావనను పెంపొందించడం, సనాతన ధర్మ సంప్రదాయాలను భావితరాలకు చేరవేయడం, కుటుంబాల్లో భారతీయ సంస్కృతి పరిరక్షణకు మరింత బలాన్ని చేకూర్చడం లక్ష్యంగా ఈ ‘అక్షర గోవిందం’ కార్యక్రమాన్ని రూపొందించినట్లు వెల్లడించింది. ఈ వినూత్న సేవ భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందించడమే కాకుండా, చిన్నారుల జీవితానికి దైవ ఆశీస్సులతో శుభారంభాన్ని అందించే విశిష్ట కార్యక్రమంగా నిలవనుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports