Last Updated:
Uday Krishna Reddy: ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారిపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయిన ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో రోజుకో కొత్త విషయం బయటకు వస్తోంది.
నగర మహిళా భద్రతా విభాగం డీసీపీ లావణ్యనాయక్ జాదవ్ పర్యవేక్షణలో వేగవంతంగా సాగుతున్న ఈ దర్యాప్తులో పోలీసులు సంచలనాత్మక ఆధారాలను సేకరించినట్లు తెలిసింది. సీన్ రీ-కన్స్ట్రక్షన్లో భాగంగా పోలీసులు అశోక్నగర్లోని ఉదయ్ కృష్ణారెడ్డి గదిలో సోదాలు నిర్వహించగా.. అక్కడి వస్తువులు, లభించిన పత్రాలు ఈ కేసును మరిన్ని కొత్త మలుపులు తిప్పుతున్నాయి.
ఈనాడు కథనం ప్రకారం.. పోలీసుల దర్యాప్తు బృందం ఉదయ్ కృష్ణారెడ్డి నివాసంలో సోదాలు చేయగా.. అక్కడ ల్యాప్టాప్, సెల్ఫోన్తో పాటు ఒక కత్తి, ఇద్దరు వేర్వేరు వ్యక్తుల చేతిరాతలతో ఉన్న రెండు ప్రేమలేఖలు లభ్యమయ్యాయి. ఆ ప్రేమలేఖలపై ఉన్న పేర్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన అధికారులకు ఓ ఆసక్తికరమైన నిజం వెలుగులోకి వచ్చింది. ఉదయ్ కృష్ణారెడ్డికి ఆంధ్రప్రదేశ్కు చెందిన మరో మహిళతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు బయటపడింది.
సదరు మహిళకు 2014లోనే వివాహం కాగా, 2023 నుంచి ఆమె భర్తకు దూరంగా ఉంటూ తన కుమారుడితో కలిసి జీవిస్తోంది. ఆ సమయంలో ఉదయ్తో ఏర్పడిన పరిచయం కాస్త స్నేహంగా మారింది. హైదరాబాద్ వచ్చిన సదరు మహిళ కొంతకాలం ఒక ప్రైవేటు సంస్థలో పనిచేయగా, ఈ ఏడాది జనవరిలో ఉదయ్ కృష్ణారెడ్డి సూచన మేరకు ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి అశోక్నగర్లోని ఓ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్లో చేరారు. అయితే, ఆమెతో లివ్-ఇన్ రిలేషన్షిప్లో ఉందామని ఉదయ్ ప్రతిపాదించగా, చట్టబద్ధంగా విడాకులు రాకపోవడంతో ఆమె దానికి నిరాకరించినట్లు సమాచారం.
అశోక్నగర్లో నివాసముంటున్న ఆ మహిళను ఈ ఏడాది ఫిబ్రవరిలో కేసు నమోదు చేసిన మహిళా ట్రైనీ ఐపీఎస్ కలిసినట్లు విచారణలో తేలింది. ఆ సమయంలో సదరు మహిళ ఉదయ్ కృష్ణారెడ్డి యొక్క విపరీత ప్రవర్తన, తనపై జరిగిన దాడి గురించి ట్రైనీ ఐపీఎస్తో బాధను పంచుకున్నారు. ఉదయ్ కోప స్వభావం తెలుసుకున్న ఆ మహిళ అప్పటి నుంచి అతడికి పూర్తిగా దూరంగా ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు.
మరోవైపు, మహిళా ట్రైనీ ఐపీఎస్ గదిలోకి ఉదయ్ కృష్ణారెడ్డి బలవంతంగా చొరబడి ఆమె ఫోన్ను లాక్కున్నట్లు వచ్చిన ఆరోపణలకు సంబంధించి పోలీసులు తగిన ఆధారాలు సేకరించారు. ఐపీఎస్ శిక్షణ సమయంలో కూడా ఉదయ్ కృష్ణారెడ్డి తీవ్ర కోపం, విపరీత ప్రవర్తన కారణంగా తోటి అధికారులు కొందరు తీవ్ర మానసిక వేదనకు గురైనట్లు తెలుస్తోంది.
ఈ సంచలన కేసులో సమగ్ర వివరాలు సేకరించేందుకు పోలీసులు ఇప్పటికే సుమారు 20 మంది నుంచి అధికారిక వాంగ్మూలాలను సేకరించినట్లు సమాచారం. దర్యాప్తును మరింత వేగవంతం చేసేందుకు, లభించిన ల్యాప్టాప్, ఫోన్లలోని సమాచారాన్ని విశ్లేషించేందుకు నిందితుడైన ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసు కస్టడీకి తీసుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కస్టడీ విచారణలో మరిన్ని సంచలన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందనే చర్చ నగర పోలీస్ వర్గాల్లో నడుస్తోంది.
Hyderabad,Telangana














