Last Updated:
నటి త్రిషను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ను ఖండించిన ఆయన, అధికార టీవీకే నేతలను తీవ్ర పదజాలంతో విమర్శిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తమిళనాడు రాజకీయం తీవ్ర దుమారం రేపుతోంది. కావేరీ జలాల వివాదంపై తంజావూరులో జరిగిన నిరసన ప్రదర్శనలో నటి త్రిషను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో డిఎంకే కీలక నేత, ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ను తంజావూరు పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ను ఉదయనిధి తీవ్రంగా ఖండించారు. అధికార టీవీకే ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కావేరీ సమస్య, రైతుల ఇబ్బందుల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే తనపై రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
టీవీకే నేతలను ‘మూర్ఖుల సమూహం’ అంటూ తీవ్రపదజాలంతో ధ్వజమెత్తారు. పోలీసుల కేసులకు, బెదిరింపులకు తాను భయపడేది లేదని, ఈ కల్పిత కేసులోని చట్టపరమైన పరిణామాలను ఎదుర్కొనేందుకు తాను సంపూర్ణంగా సిద్ధంగా ఉన్నానని ఉదయనిధి తేల్చి చెప్పారు.
న్యూస్18 ఇంగ్లీష్ రిపోర్టర్ జె.నివేత కథనం ప్రకారం.. ఉదయనిధి నివాసం వద్ద మంగళవారం ఉదయం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మధ్యాహ్నం 12 గంటల వరకు ఆయనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని మద్రాస్ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ, ఉదయం 11 గంటలకే పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఈఆర్వి వేలు, కేఎన్ నెహ్రూ, పీకే శేఖర్ బాబు, మా సుబ్రమణ్యన్ సహా పలువురు సీనియర్ డిఎంకే నేతలు ఆయన ఇంటికి చేరుకున్నారు. మరోవైపు నిరసనలు తెలిపిన డిఎంకే కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయనిధిని తంజావూరు మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు వాహనంలో తరలించారు.
కావేరీ వివాదంపై ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ను ఉదయనిధి విమర్శిస్తున్న సమయంలో, సభలోని కొందరు కార్యకర్తలు నటి త్రిష పేరును నినాదాలుగా చేశారు. దీనికి స్పందిస్తూ ఉదయనిధి చేసిన ద్వంద్వార్థ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. టీవీకే మహిళా విభాగం నాయకురాలు భైరవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తంజావూరు పోలీసులు ఉదయనిధిపై ఆరు సెక్షన్ల కింద బెయిల్ లేని కేసులు నమోదు చేశారు. మరోవైపు ఈ వ్యవహారంపై జాతీయ మహిళా కమిషన్కు (NCW) కూడా టీవీకే ఫిర్యాదు చేసింది. ఉదయనిధి వ్యాఖ్యలు మహిళలను తీవ్రంగా అవమానించేలా ఉన్నాయని అందులో పేర్కొంది.
తమ ప్రసంగాలను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఉదయనిధి ఆరోపించారు. కావేరీ నీటి విడుదలలో ప్రభుత్వం విఫలమైందని, దాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఈ అరెస్ట్ నాటకమాడుతున్నారని డిఎంకే నేతలు విమర్శిస్తున్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. అయితే ఒక మహిళా ప్రజాప్రతినిధి, నటిపై బహిరంగ వేదికపై ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరమని టీవీకే శ్రేణులు సమర్థిస్తున్నాయి. ఈ ఘటనతో తమిళనాడులో డిఎంకే, టీవీకే మధ్య రాజకీయ వేడి పరాకాష్టకు చేరింది.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana














