US Iran Conflict: మళ్లీ మెుదటికి వచ్చిన అమెరికా-ఇరాన్ వార్.. ట్రంప్ సంచలన ప్రకటనతో హోర్ముజ్ జలసంధిలో యుద్ధ వాతావరణం | | ACTPnews

US Iran Conflict: మళ్లీ మెుదటికి వచ్చిన అమెరికా-ఇరాన్ వార్.. ట్రంప్ సంచలన ప్రకటనతో హోర్ముజ్ జలసంధిలో యుద్ధ వాతావరణం |


ఇరాన్ ప్రజలను “అబద్ధాలకోరులు, మోసగాళ్లు, అనారోగ్య మనస్తత్వం ఉన్నవారు”గా అభివర్ణించిన ట్రంప్, గత రాత్రి అమెరికా ఇరాన్‌కు చెందిన “అత్యంత ప్రమాదకర వ్యక్తులపై” శక్తివంతమైన దాడులు నిర్వహించిందని చెప్పారు. హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) గుండా ప్రయాణిస్తున్న మూడు వాణిజ్య నౌకలపై దాడులు జరిగిన నేపథ్యంలో, ఆ దాడులకు ఇరాన్ సైన్యమే బాధ్యత వహించిందని అమెరికా ఆరోపించింది. దీంతో ఈ దాడులు చేపట్టినట్లు ట్రంప్ వెల్లడించారు.

“వాళ్లు అబద్ధాలకోరులు, మోసగాళ్లు, అనారోగ్య మనస్తత్వం కలిగినవారు. తమ సొంత ప్రజలకే అన్యాయం చేశారు. నిరసనలు చేపట్టిన 54 వేల మందిని ఇప్పటివరకు చంపేశారు. ప్రజలు ఎందుకు అధికారాన్ని చేజిక్కించుకోలేకపోయారని అడుగుతారు. వారు అధికారాన్ని చేపట్టలేరు, ఎందుకంటే వారు చనిపోయారు,” అని ట్రంప్ అన్నారు.

“గత రాత్రి మేము ఇరాన్‌కు చెందిన అత్యంత ప్రమాదకర వ్యక్తులపై అత్యంత శక్తివంతమైన దాడులు చేశాం. వాళ్లు అనారోగ్య మనస్తత్వం కలిగినవారు. వాళ్లలో ఏదో తప్పు ఉంది,” అని ఆయన వ్యాఖ్యానించారు.

“ఇరాన్ దుష్ట దేశం.. అణ్వాయుధ సామర్థ్యాన్ని పూర్తిగా తొలగిస్తాం”

ఇరాన్‌ను “దుష్ట దేశం”గా పేర్కొన్న ట్రంప్, ఈ యుద్ధం ప్రధాన లక్ష్యం టెహ్రాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని పూర్తిగా నిర్మూలించడమేనని మరోసారి స్పష్టం చేశారు.

“గత రాత్రి మేము ఇరాన్‌పై తీవ్రంగా దాడి చేశాం. మీరు ప్రతి సారి దాడి చేస్తే, మేము కూడా ప్రతిదాడి చేస్తామని ముందే చెప్పాను. వారు మురికిగా ఆడే ఆటగాళ్లు. అందరినీ లక్ష్యంగా చేసుకుంటారు. నన్ను కూడా లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది. నాకు వాళ్లు నచ్చరు. వాళ్లు దుష్టులు. మా లక్ష్యం ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని పూర్తిగా అంతం చేయడమే. మేమది సాధిస్తాం,” అని ట్రంప్ అన్నారు.

ఇరాన్‌పై అమెరికా శక్తివంతమైన సైనిక దాడులు

ట్రంప్ వ్యాఖ్యలకు కొన్ని గంటల ముందే అమెరికా ఇరాన్‌పై “శక్తివంతమైన” సైనిక దాడులు ప్రారంభించింది. హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న మూడు వాణిజ్య నౌకలపై దాడులు జరిగిన తర్వాత ఈ చర్యలు చేపట్టినట్లు అమెరికా ప్రకటించింది. దీనికి ప్రతిగా, ఇరాన్ ఒమాన్ సముద్రంలో (Sea of Oman) ఉన్న అమెరికా నౌకాదళ యుద్ధ నౌకలపై ప్రతిదాడులు చేపట్టింది.

అమెరికా సెంట్రల్ కమాండ్ (US Central Command) విడుదల చేసిన ప్రకటనలో, వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ చేసిన దాడులకు ప్రతిస్పందనగానే ఈ “శక్తివంతమైన” దాడులు జరిగాయని, వాణిజ్య నౌకలపై దాడులకు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించింది.

దక్షిణ ఇరాన్‌లో భారీ పేలుళ్లు

బుధవారం తెల్లవారుజామున దక్షిణ ఇరాన్‌లోని పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు సమాచారం. ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రకారం, దేశంలోని కీలక చమురు ఎగుమతి కేంద్రం ఖార్గ్ దీవి (Kharg Island), ఖెష్మ్ దీవి (Qeshm Island), అలాగే సిరిక్ (Sirik), బందర్ అబ్బాస్ (Bandar Abbas) పోర్టు నగరాల్లో పేలుళ్లు చోటుచేసుకున్నాయి.

రాయిటర్స్‌కు అమెరికా అధికారి ఒకరు తెలిపిన వివరాల ప్రకారం, ఈ దాడుల ప్రధాన లక్ష్యం ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని బలహీనపరచడమే. వైమానిక రక్షణ వ్యవస్థలు, తీరప్రాంత నిఘా మౌలిక సదుపాయాలు, ఉపరితలం నుంచి గగనతల లక్ష్యాలను ఛేదించే క్షిపణి వ్యవస్థలు, నౌకలపై దాడి చేసే క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్ ప్రయోగ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించినట్లు తెలిపారు.

ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖామెనీకి నిర్వహిస్తున్న ఏడు రోజుల అంత్యక్రియల కార్యక్రమం కొనసాగుతున్న సమయంలోనే అమెరికా ఈ దాడులు చేపట్టింది.

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ ప్రతిదాడి

ఫార్స్ న్యూస్ ఏజెన్సీ కథనం ప్రకారం, అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ ఒమాన్ సముద్రంలో ఉన్న అమెరికా నౌకాదళ యుద్ధ నౌకలపై కనీసం రెండు యాంటీ-షిప్ క్రూయిజ్ క్షిపణులు, పలు డ్రోన్లతో దాడి చేసింది.

దాడులకు ట్రంప్ ముందస్తు ఆమోదం

ఆక్సియోస్ (Axios) నివేదిక ప్రకారం, నాటో సదస్సులో పాల్గొనేందుకు టర్కీకి వెళ్లిన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ఇరాన్‌పై దాడి ప్రణాళికకు ఆమోదం తెలిపి, దాడులకు ఆదేశాలు జారీ చేశారు.

కాల్పుల విరమణ ఎందుకు విఫలమైంది?

గత నెలలో అమెరికా, ఇరాన్ మధ్య సున్నితమైన కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇరు దేశాలు అవగాహన ఒప్పందం (Memorandum of Understanding)పై సంతకాలు చేసి, ఫిబ్రవరిలో అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై జరిపిన దాడులతో ప్రారంభమైన ఘర్షణలను తాత్కాలికంగా నిలిపివేశాయి. అయితే హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులు జరిగాయని వార్తలు వెలువడిన తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి.

బ్రిటిష్ సముద్ర భద్రతా సంస్థ UKMTO ప్రకారం, మంగళవారం గుర్తు తెలియని ప్రాజెక్టైల్ ఒక చమురు ట్యాంకర్‌ను తాకడంతో మంటలు చెలరేగాయి. అదనంగా మరో రెండు వాణిజ్య నౌకలు కూడా దాడికి గురయ్యాయి. వాటిలో ఒక నౌకపై డ్రోన్ దాడి జరిగినట్లు సమాచారం. దీంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports