Last Updated:
ఆర్థిక ఆంక్షల కింద విదేశాల్లో నిలిచిపోయిన ఇరాన్ నిధుల అంశం కూడా చర్చల్లో ప్రధానంగా మారింది. ఇరాన్కు చెందిన బిలియన్ల డాలర్ల ఆస్తులను విడుదల చేయాలని టెహ్రాన్ కోరుతోంది. అయితే
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముందుకు తీసుకెళ్తున్న అమెరికా-ఇరాన్ ఒప్పంద చర్చలు కీలక దశకు చేరుకున్నప్పటికీ, ఇరు దేశాల మధ్య ఇంకా అనేక విభేదాలు కొనసాగుతున్నాయి. చర్చలు పురోగతిలో ఉన్నాయని అమెరికా, ఇరాన్ వర్గాలు చెబుతున్నా, ఒప్పందానికి సంబంధించిన ముఖ్య అంశాలపై స్పష్టత రాలేదని అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి.
న్యూస్ 18 ఇంగ్లీష్ కథనం ప్రకారం.. ఈ చర్చల్లో ప్రధాన అంశం ఇరాన్ అణు కార్యక్రమం. ముఖ్యంగా యురేనియం శుద్ధి స్థాయిలు, ఇప్పటికే నిల్వలో ఉన్న అధిక శుద్ధి యురేనియంపై అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇరాన్ వద్ద ఉన్న అధిక శుద్ధి యురేనియం భవిష్యత్తులో అణ్వాయుధాల తయారికి ఉపయోగపడే అవకాశం ఉందని అమెరికా భావిస్తోంది. అయితే, పూర్తిగా అణు సామర్థ్యాన్ని తగ్గించాలన్న అమెరికా డిమాండ్ను ఇరాన్ సులభంగా అంగీకరించే పరిస్థితి కనిపించడం లేదు.
చర్చల్లో మరో కీలక అంశం హోర్ముజ్ జలసంధి. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన ఈ మార్గంలో ఇటీవల ఉద్రిక్తతలు పెరిగాయి. యుద్ధ పరిస్థితుల కారణంగా సముద్ర మార్గ భద్రతపై అనిశ్చితి నెలకొనడంతో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు కూడా ప్రభావితమయ్యాయి. అమెరికా విధించిన సముద్ర నిర్బంధాన్ని ఎత్తివేయాలని ఇరాన్ కోరుతుండగా, నౌకా రవాణా నిరంతరంగా కొనసాగుతుందనే హామీ కావాలని అమెరికా పట్టుబడుతోంది.
ఇక ఆర్థిక ఆంక్షల కింద విదేశాల్లో నిలిచిపోయిన ఇరాన్ నిధుల అంశం కూడా చర్చల్లో ప్రధానంగా మారింది. ఇరాన్కు చెందిన బిలియన్ల డాలర్ల ఆస్తులను విడుదల చేయాలని టెహ్రాన్ కోరుతోంది. అయితే అమెరికా మాత్రం అణు ఒప్పందానికి సంబంధించిన నిబంధనలు అమలు చేసిన తర్వాతే ఆంక్షల సడలింపుపై ఆలోచిస్తామని సంకేతాలు ఇస్తోంది.
అమెరికా అంతర్గత రాజకీయాల్లో కూడా ఈ ఒప్పందం వివాదాస్పదంగా మారింది. రిపబ్లికన్ పార్టీలోని పలువురు నేతలు ఇరాన్కు అధిక రాయితీలు ఇవ్వడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఇరాన్ అణు సామర్థ్యం, క్షిపణి వ్యవస్థలు అలాగే కొనసాగితే భవిష్యత్తులో మరింత భద్రతా ముప్పు ఏర్పడే అవకాశం ఉందని వారు అంటున్నారు.
ఇరాన్ మద్దతు ఉన్న ప్రాంతీయ సాయుధ గుంపుల అంశం కూడా చర్చల్లో స్పష్టతకు రాలేదు. లెబనాన్లోని హెజ్బొల్లా వంటి సంస్థలపై ఒప్పందంలో ఎలాంటి నిబంధనలు ఉంటాయన్న దానిపై అమెరికా అధికారికంగా వివరాలు వెల్లడించలేదు. దీంతో మధ్యప్రాచ్య భద్రతపై ఆందోళనలు కొనసాగుతున్నాయి.
అదే సమయంలో ఇరాన్ బాలిస్టిక్ క్షిపణుల వ్యవహారం కూడా అమెరికా మిత్రదేశాలను కలవరపెడుతోంది. ముఖ్యంగా ఇజ్రాయెల్ ఈ అంశాన్ని అత్యంత కీలకంగా చూస్తోంది. అణు కార్యక్రమంపై మాత్రమే దృష్టి పెట్టి క్షిపణి వ్యవస్థలను పక్కన పెడితే భవిష్యత్తులో కొత్త ఉద్రిక్తతలకు దారితీసే ప్రమాదం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అమెరికా-ఇరాన్ చర్చలు ముందుకు సాగుతున్నప్పటికీ, పరస్పర అనుమానాలు, భద్రతా అంశాలు, రాజకీయ ఒత్తిడులు ఇంకా పెద్ద అడ్డంకులుగానే కనిపిస్తున్నాయి.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana
May 25, 2026 10:40 AM IST













