Last Updated:
మాస్టర్ మహేంద్రన్, అంబికా వాణి జంటగా నటించిన కొత్త సినిమా ‘వసుదేవసుతం’. ఒరిస్సా లోని వాసుదేవుని ఆలయం చుట్టూ అల్లిన కథతో ఈ సినిమా నేడే విడుదలైంది. మరి ఈ మూవీ ఎలా ఉందో చూద్దామా..
మాస్టర్ మహేంద్రన్, అంబికా వాణి జంటగా నటించిన కొత్త సినిమా ‘వసుదేవసుతం’. జాన్ విజయ్, మైమ్ గోపి, సురేష్ చంద్ర మీనన్, ఐశ్వర్య లక్ష్మి, తులసి కీలక పాత్రల్లో నటించారు. రెయిన్బో సినిమాస్ బ్యానర్ పై ధనలక్ష్మి బాదర్ల నిర్మాణంలో వైకుంఠ్ బోను దర్శకత్వం వహించిన ఈ సినిమా నేడు జూలై 10న థియేటర్స్ లో విడుదలైంది. ఒరిస్సా లోని వాసుదేవుని ఆలయం చుట్టూ అల్లిన ఈ కథ ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? అనేది ఇప్పుడు చూద్దాం.
ఇటీవల కాలంలో టాలీవుడ్ తో పాటు పాన్ ఇండియా స్థాయిలో డివోషనల్, మిస్టికల్ థ్రిల్లర్స్ కు విశేషమైన ఆదరణ లభిస్తోంది. ‘కార్తికేయ 2’, ‘హనుమాన్’, ‘కాంతార’ వంటి చిత్రాలు దేవుడి నేపథ్యం, పురాణాల స్ఫూర్తితో భారీ విజయాలను నమోదు చేశాయి. సరిగ్గా ఇదే ట్రెండ్ ను ఫాలో అవుతూ, ఆలయ నేపథ్యంలో వచ్చిన చిత్రం ఈ ‘వసుదేవసుతం’. ‘దేవి’, ‘పెదరాయుడు’ తదితర చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులకు సుపరిచితమైన మాస్టర్ మహేంద్రన్ ఈ సినిమాలో హీరోగా నటించాడు.
పురుషోత్తమపురిలో ఉన్న వాసుదేవ ఆలయ చైర్మన్ శర్మ(దువ్వాసి మోహన్)ని హీరా బంధు(మైమ్ గోపి) చంపేయడం, ఆపై చైర్మన్ ఎన్నికల్లో తన తండ్రిని గెలిపించుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఊరిలో జరిగే వాసుదేవుని ఉత్సవాలకు హైదరాబాద్ లో నుంచి కృశవ్(మహేంద్రన్) వస్తాడు. హీరా బంధు మేనకోడలు భువి(అంబికా వాణి) కూడా ఈ ఉత్సవాలకు వస్తుంది. అలా భువి- కృశవ్ చూపులు కలిసి ఇద్దరూ ప్రేమలో పడతారు.
ఈ క్రమంలోనే గతం తెలుసుకొని అసలు శర్మ ఏమయ్యాడు, అందరూ వెళ్ళడానికి భయపడే కోయిరాతల అనే ప్రదేశంలో ఏముంది? అని వెతకడం మొదలుపెడతాడు కశ్యప్. మరోవైపు భువితో ప్రేమలో పడిన విషయం తెలిసి హీరా బంధు మనుషులు కశ్యప్ పై దాడి చేస్తారు. దీంతో హీరా బంధుతో గొడవపెట్టుకోడానికి అతని ఇంటికి వెళ్లిన కశ్యప్ కి షాకింగ్ విషయం తెలుస్తుంది. అదే సమయంలో సెంట్రల్ మినిస్టర్(జాన్ విజయ్) ఫోన్ చేసి కృశవ్ జైలు నుంచి తప్పించుకొని వచ్చాడని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతారు. మరి అసలు కృశవ్ ఎవరు? జైలుకు ఎందుకు వెళ్ళాడు? ఎందుకు తప్పించుకున్నాడు? వాసుదేవ ఆలయం, కొయిరాతలలో ఏముంది? కృశవ్ పై దాడి చేసింది ఎవరు? కృశవ్- భువి ప్రేమకథ చివరకు ఎలా ఎండ్ అయింది? ఈ విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కథ పురుషోత్తమపురి అనే గ్రామంలో మొదలవుతుంది. ఆలయంపై ఆధిపత్యం కోసం విలన్ హీరాబందు చేసే అరాచకాలు, మరోవైపు హీరో హీరోయిన్ల పరిచయం, రొటీన్ ప్రేమకథతో ఫస్టాఫ్ కాస్త నెమ్మదిగా సాగినా.. క్రమంగా కథలోని తీసుకెళ్తారు. ఇంటర్వెల్ బ్లాక్ లో హీరో జైలు నుంచి తప్పించుకోవడంతో సెకండాఫ్ పై ఆసక్తి పెరుగుతుంది. సెకండాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, అందులో హీరో, అక్కల మధ్య సెంటిమెంట్ బాగా పండింది. కానీ, ఆ తర్వాత మొదలయ్యే అసలైన ‘ట్రెజర్ హంట్’ (నిధి అన్వేషణ) స్క్రీన్ ప్లేను దర్శకుడు సరిగ్గా రాసుకోలేకపోయాడు. దేవుడు, గరుత్మంతుడు, పాములు వచ్చి విలన్లను చంపేయడం, హీరోను కాపాడటం వంటివి ఎలాంటి క్లారిటీ, ఎమోషనల్ కనెక్షన్ లేకుండా సింపుల్ గా తేల్చేశారు. ప్రీ-క్లైమాక్స్ లో అసలు విలన్ ఎవరనే ట్విస్ట్ బాగుంది. చివరలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గరుత్మంతుడి విజువల్స్ వాడటం కొసమెరుపు. దీనికి తోడు పార్ట్ 2 కి కూడా లీడ్ ఇవ్వడం గమనార్హం.
మాస్టర్ మహేంద్రన్ నటన బాగుంది. హీరోగా స్క్రీన్ ప్రెజెన్స్ పరంగా ఓకే అనిపించాడు. అంబికా వాణి తన పాత్రకు న్యాయం చేసింది. నెగిటివ్ షేడ్స్ లో జాన్ విజయ్, మైమ్ గోపిల నటన సినిమాకు ప్లస్ అయ్యింది. టార్జాన్, తులసి, రాజీవ్ కనకాల, ఆటో రామ్ ప్రసాద్ తదితరులు తమ పరిధి మేర నటించారు. తక్కువ బడ్జెట్ తో తీసినా సాంకేతికంగా ఫర్వాలేదనిపించింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు ఎడిటింగ్ బాగున్నాయి. కాకపోతే కొన్ని విజువల్స్ రిపీట్ గా చూపించడం ప్రేక్షకులకు కొంతమేర బోర్ కొట్టేంచే అంశం. పూరి జగన్నాథ్ ఆలయం, బ్రహ్మపదార్థం అనే అద్భుతమైన పాయింట్ ను ఎంచుకొని దానిని ఓ గ్రిప్పింగ్ థ్రిల్లర్ గా తెరకెక్కించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. స్క్రీన్ ప్లే ఇంకాస్త మెరుగ్గా ఉంటే వసుదేవసుతం ఇంకా అద్భుతంగా ఉండేది.
చివరగా.. రొటీన్ కథనే అయినా ఆడియన్స్ మెచ్చే డివోషనల్ థ్రిల్లర్ ఇది.
రేటింగ్: 2.75
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana
Jul 10, 2026 12:51 PM IST














