Last Updated:
దేశంలో బీమా లేని వాహనాలకు చెక్ పెట్టేందుకు సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన చేసింది. ఇన్సూరెన్స్ ఉంటేనే పెట్రోల్ బంకుల్లో ఇంధనం పోసేలా కొత్త పైలట్ ప్రాజెక్టును తీసుకురావాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖ, ఐఆర్డీఏఐలను ఆదేశించింది.
మోటారు వాహనాల చట్టం ప్రకారం ప్రతి వాహనానికి థర్డ్ పార్టీ బీమా తప్పనిసరి. కానీ లక్షలాది వాహనాలు బీమా లేకుండానే రోడ్లపై తిరుగుతున్నాయని, ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు పరిహారం దక్కడం లేదని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం కీలక ప్రతిపాదన చేసింది. వాహనాలకు చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ ఉంటేనే పెట్రోల్ బంకుల్లో ఇంధనం నింపేలా ఒక పైలట్ ప్రాజెక్టును తీసుకురావాలని ఆదేశించింది.
ఈ ప్రాజెక్టు రూపకల్పన కోసం కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH)తో కలిసి పనిచేయాలని బీమా నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ (IRDAI)కి సూచించింది. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ దాఖలు చేసిన అప్పీల్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ తీర్పును వెలువరించింది. ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసుకోని వాహనాలకు ఇంధనం పోయకుండా అడ్డుకోవడం ద్వారా, వాహనదారులు బీమాను తప్పనిసరిగా రెన్యువల్ చేసుకునేలా ప్రోత్సహించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని కోర్టు స్పష్టం చేసింది.
న్యూస్18 ఇంగ్లీష్ కథనం ప్రకారం.. ఏఎన్పీఆర్ కెమెరాలతో ఈ-చలాన్లు బీమా నిబంధనల అమలును మరింత పకడ్బందీ చేసేందుకు కోర్టు మరో సూచన చేసింది. రహదారులపై ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) కెమెరాలను ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డేటాబేస్, వాహన్ పోర్టల్తో అనుసంధానం చేయాలని ఆదేశించింది. దీనివల్ల బీమా లేని వాహనాలను గుర్తించి ఆటోమేటిక్గా ఈ-చలాన్లు జారీ చేసే అవకాశం ఉంటుంది. అలాగే ట్రాఫిక్ పోలీసులు చేతిలో ఉండే మొబైల్ పరికరాల ద్వారా రియల్ టైమ్లో బీమా వివరాలు తనిఖీ చేసి చలాన్లు విధించాలని కోర్టు సూచించింది.
దేశంలోని రోడ్లపై తిరుగుతున్న వాహనాల్లో ఏకంగా 56 శాతం వాహనాలకు సరైన ఇన్సూరెన్స్ లేదని పార్లమెంటరీ స్థాయి సంఘం నివేదిక ద్వారా స్పష్టమైందని సుప్రీంకోర్టు తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 30.48 కోట్ల వాహనాల్లో దాదాపు 16.54 కోట్ల వాహనాలకు బీమా లేదని ధర్మాసనం పేర్కొంది. దీనివల్ల రోడ్డు ప్రమాదాలకు గురైన బాధితులకు సకాలంలో పరిహారం అందక న్యాయపరమైన చిక్కుల్లో కూరుకుపోతున్నారని న్యాయస్థానం ఆవేదన వ్యక్తం చేసింది.
అధికారిక లెక్కల ప్రకారం 2024లో భారతదేశంలో 4,87,705 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ నేపథ్యంలో రోడ్డు భద్రతను మెరుగుపరచడంతో పాటు ప్రమాద బాధితులకు థర్డ్ పార్టీ బీమా ద్వారా తగిన రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని కోర్టు నొక్కి చెప్పింది. అందుకే ఇంధన సరఫరాతో బీమాను అనుసంధానం చేసే ఈ ప్రతిపాదనకు పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కూడా సూత్రప్రాయంగా అంగీకరించినట్లు ధర్మాసనం వెల్లడించింది.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana
Aug 04, 2026 10:44 PM IST














