Viksit Vibrant Village Programme: మైభారత్ వాలంటీర్లతో ప్రధాని మోదీ చిట్‌చాట్.. సరిహద్దు గ్రామాల ప్రగతిపై ప్రశంసలు | | ACTPnews

Viksit Vibrant Village Programme: మైభారత్ వాలంటీర్లతో ప్రధాని మోదీ చిట్‌చాట్.. సరిహద్దు గ్రామాల ప్రగతిపై ప్రశంసలు |


మౌలిక సదుపాయాల అభివృద్ధి, కనెక్టివిటీ:

భారత ప్రభుత్వ అధికారిక నివేదికల ప్రకారం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, లడఖ్ వంటి సరిహద్దు గ్రామాల్లో ఇటీవల కాలంలో జరిగిన అనూహ్యమైన మార్పులను, మౌలిక సదుపాయాల కల్పననూ యువ వాలంటీర్లు ప్రధాని దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా రోడ్ల నిర్మాణం, డిజిటల్ కనెక్టివిటీ, మెరుగైన ప్రజా సేవలు, మహిళా సాధికారత, పర్యాటకం వంటి అంశాలలో ఈ గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయని వారు వివరించారు. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) కూడా ఒక ప్రకటనలో “మారుమూల సరిహద్దు గ్రామాలు భౌగోళికంగా దూరంగా ఉన్నప్పటికీ, అక్కడి ప్రజలు దేశంతో భావోద్వేగంగా గాఢమైన అనుబంధాన్ని కలిగి ఉన్నారని ప్రధాని మోదీ స్పష్టం చేశారు” అని తెలిపింది.

దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూకి చెందిన వాలంటీర్ దివ్యాంశ్ జోషి మాట్లాడుతూ, హిమాచల్ ప్రదేశ్‌లోని కినౌర్ జిల్లాలో ఉన్న లియో గ్రామాన్ని తాను సందర్శించినట్లు తెలిపారు. అక్కడ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పనితీరును, స్థానిక మహిళా సర్పంచ్ నాయకత్వాన్ని ఆయన ప్రశంసించారు. అదే ప్రాంతానికి చెందిన మరో వాలంటీర్ నికితా ప్రవీణ్ సోలంకి, ధర్ చాంగో నిచ్లా గ్రామాన్ని సందర్శించారు. పీఎంజీఎస్‌వై (ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన), జల్ జీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఆ గ్రామంలో నాణ్యమైన రోడ్లు, నిరంతర విద్యుత్ సరఫరా, త్రాగునీటి కనెక్షన్లు, డిజిటల్ కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చాయని ఆమె తన అనుభవాలను పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ, “ఒంటరిగా ప్రయాణించడం ద్వారా ప్రపంచాన్ని తెలుసుకోవడంతో పాటు, మనల్ని మనం కూడా కొత్తగా ఆవిష్కరించుకోవచ్చు” అని వ్యాఖ్యానించారు.

చివరి ప్రాధాన్యంలో ఉన్నవారికే ఇప్పుడు మొదటి ప్రాధాన్యం:

రాజస్థాన్‌లోని జలోర్ ప్రాంతానికి చెందిన సునీల్ కుమార్ కేలా, హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్ చాంగో ఉప్రెలా గ్రామంలో తన పర్యటన గురించి వివరిస్తూ.. సౌర విద్యుత్ ప్రాజెక్టులు, మెరుగైన మౌలిక వసతులు, జన ఔషధి కేంద్రాలు గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను ఎలా పెంచాయో వివరించారు. ప్రధాని మోదీ ఈ సందర్భంగా మాట్లాడుతూ, “ఒకప్పుడు అభివృద్ధిలో చివరి ప్రాధాన్యంలో ఉన్న సరిహద్దు గ్రామాలకు ఇప్పుడు మన ప్రభుత్వం అత్యంత తొలి ప్రాధాన్యం ఇస్తోంది” అని తెలిపారు. దేశ పౌరులు తమ ప్రయాణ బడ్జెట్‌లో కనీసం 5 శాతంతో స్థానిక ఉత్పత్తులు కొనాలని ప్రధాని సూచించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాకు చెందిన భవ్య శ్రీ, ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లా హర్సిల్ వ్యాలీలో తన పర్యటన గురించి తెలిపారు. వాతావరణం, భాషలు, సంస్కృతులు వేరైనప్పటికీ, భిన్న ప్రాంతాల వాలంటీర్లు ఒకే కుటుంబంలా కలిసిపోయారనీ, ఇది ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తికి అద్దం పడుతోందని వివరించారు. ఈ ప్రయాణంలో ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ (ITBP) సిబ్బంది క్రమశిక్షణ, అంకితభావం, దేశభక్తి తమను ఎంతగానో ఆకర్షించాయని చెప్పారు.

లడఖ్‌లో డిజిటల్ విప్లవం:

అండమాన్ నికోబార్ దీవులకు చెందిన 21ఏళ్ల సయంతికా మిస్త్రీ, దాదాపు 17 వేల అడుగుల ఎత్తులో ఉన్న లడఖ్‌లోని ‘మాన్’ గ్రామాన్ని సందర్శించారు. అత్యంత ఎత్తైన, ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్న ఆ ప్రాంతంలో కూడా నమ్మకమైన ఇంటర్నెట్ సదుపాయం, క్యూఆర్ కోడ్, యూపీఐ (UPI) చెల్లింపులు, వైఫై (Wi-Fi) సౌకర్యాలు అందుబాటులో ఉండటం చూసి తాను ఆశ్చర్యపోయానని ఆమె తెలిపారు. తనకు ఎదురైన అనారోగ్య పరిస్థితుల్లో ఐటీబీపీ సిబ్బంది చూపిన శ్రద్ధను ఆమె ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నారు.

ఈ వికసిత్ వైబ్రంట్ విలేజ్ ప్రోగ్రామ్ ద్వారా లక్షల మంది యువతలో దేశభక్తి, జాతీయ సమైక్యత పెంపొందుతున్నాయని కేంద్ర ప్రభుత్వం విశ్వసిస్తోంది. రెండు కోట్లకు పైగా యువత మైభారత్ కార్యక్రమాల ద్వారా లబ్ది పొందారనీ, యువత దేశ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావడానికి ఇదొక అద్భుతమైన వేదికగా నిలుస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ మెచ్చుకున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports