Viral Video: ఛీ ఛీ.. ఇదేం పని.. బర్త్‌డే అయితే అలా చేయాలా.. ఆలయ పవిత్రతకు భంగం.. టీటీడీ కేసు నమోదు | | ACTPnews

News18


Last Updated:

టీటీడీ ఆధీనంలోని శ్రీ వేదనారాయణస్వామి ఆలయ ప్రాంగణంలో బర్త్‌డే వేడుకలు నిర్వహించిన ఘటనపై టీటీడీ తీవ్రంగా స్పందించింది.

+

News18

తిరుపతి జిల్లా నాగలాపురంలోని టీటీడీ ఆధీనంలోని శ్రీ వేదనారాయణస్వామి ఆలయంలో చోటుచేసుకున్న ఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆలయ పవిత్రతకు భంగం కలిగించేలా ఆలయ ప్రాంగణంలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన ఘటనపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సురుటుపల్లి పల్లికొండేశ్వరస్వామి దేవాలయ బోర్డు సభ్యుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు నెల్సన్ మండేలా తన అనుచరులతో కలిసి ఆలయ ప్రాంగణంలోనే పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియోలు వెల్లడించాయి. ఈ ఘటనపై టీటీడీ విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేయగా, ఘటనా సమయంలో విధుల్లో ఉన్న ఆలయ సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని టీటీడీ ఆదేశాలు జారీ చేసింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం ఆలయ ప్రాంగణంలో కేక్ కట్ చేయడం, పరస్పరం కేక్ తినిపించుకోవడం, హర్షధ్వానాల మధ్య సంబరాలు జరుపుకోవడం మాత్రమే కాకుండా, రూ.100 నోట్లను గాల్లో చల్లుతూ వేడుకలను నిర్వహించిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ దృశ్యాలు భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని, పవిత్రమైన ఆలయ ప్రాంగణాన్ని వ్యక్తిగత వేడుకలకు వేదికగా మార్చడం ఏమాత్రం సమంజసం కాదని భక్తులు మండిపడుతున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకునే ఆలయంలో ఇటువంటి చర్యలు చోటుచేసుకోవడం దురదృష్టకరమని, ఆలయాల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిదీ అని వారు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు, సురుటుపల్లి పల్లికొండేశ్వరస్వామి దేవాలయ బోర్డు సభ్యుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తే ఇటువంటి వివాదాస్పద కార్యక్రమంలో పాల్గొనడం మరింత ఆందోళన కలిగించే అంశమని భక్తులు పేర్కొంటున్నారు. దేవాలయాల పట్ల మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన పదవిలో ఉన్న వ్యక్తి నుంచి ఇలాంటి చర్యలు రావడం వల్ల సమాజానికి తప్పు సంకేతాలు వెళ్తాయని వారు అంటున్నారు. ఆలయాల పవిత్రతను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రజాప్రతినిధులు, దేవాలయ బోర్డు సభ్యులు ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.

ఈ ఘటనను టీటీడీ అత్యంత సీరియస్‌గా తీసుకుంది. టీటీడీ విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయగా, ఘటన సమయంలో అప్రమత్తంగా వ్యవహరించని సంబంధిత ఆలయ సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించే లేదా భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని టీటీడీ స్పష్టం చేసింది. పవిత్ర ఆలయాల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై చట్టబద్ధంగా కఠిన చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని ఆలయాల్లో పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయనున్నట్లు టీటీడీ వర్గాలు వెల్లడించాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed