Last Updated:
YouTuber Haribabu Murder: చావుకు చావే పరిష్కారమా..? ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని మనస్పర్థల కారణంగా హత్య చేశాడు భర్త. తన చెల్లిని ఎంతో ఆప్యాయంగా చూసుకున్న అన్న ఆ హత్యను మర్చిపోలేకపోయాడు. చెల్లి లేనప్పుడు ఆమె భర్తను మాత్రం ఎందుకు బ్రతకనివ్వాలని పగ పెంచుకున్నాడు.
YouTuber Haribabu Murder: చావుకు చావే పరిష్కారమా..? ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని మనస్పర్థల కారణంగా హత్య చేశాడు భర్త. తన చెల్లిని ఎంతో ఆప్యాయంగా చూసుకున్న అన్న ఆ హత్యను మర్చిపోలేకపోయాడు. చెల్లి లేనప్పుడు ఆమె భర్తను మాత్రం ఎందుకు బ్రతకనివ్వాలని పగ పెంచుకున్నాడు. అతనిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఆరు నెలలుగా అవకాశం కోసం ఎదురుచూశాడు. సరిగ్గా తాను కసి తీర్చుకునే సమయం రావడంతో అదునుచూసుకొని అతడ్ని పట్టపగలు నడిరోడ్డుపై కత్తితో పొడిచి చంపడం ఇప్పుడు సంచలనంగా మారింది. జగిత్యాల జిల్లాలో యూట్యూబర్ వైష్ణవిని చంపిన ఆమె భర్త హరిబాబును ఆరు నెలల తర్వాత నిజామాబాద్లో సంతోష్ చంపాడు. అయితే తర్వాత జరిగే పరిణామాలను.. తన ఫ్యామిలీ గురించి ఏమాత్రం ఆలోచించకుండా చేసిన తప్పును అంగీకరిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. తనకు మద్దతు తెలపాలని సోషల్ మీడియా ద్వారా నెటిజన్లను అభ్యర్ధించాడు. అసలు ఈ ఇన్ఫ్లూయెన్సర్ దంపతుల ట్రాజెడీ స్టోరీలో ట్విస్టులు చూస్తుంటే సినిమా స్టోరీకి ఏమాత్రం తక్కువ కాదని అర్ధమవుతోంది.
సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్, యూట్యూబర్ హరిబాబు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శివాజీ నగర్ ఉషా మల్టీప్లెక్స్ ఎదురుగా నడిరోడ్డుపై గురువారం హత్య చేయబడ్డాడు. హరిబాబు ఎవరో కాదు 6 నెలల క్రితం జగిత్యాల జిల్లాలో హత్యకు గురైన ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో నిందితుడు. 4 నెలల గర్భవతిగా ఉన్న తన భార్యను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించి పట్టుబడిన హరిబాబురెడ్డి వైష్ణవి హత్య కేసులో జైలుకు వెళ్లి నెల రోజుల క్రితమే బెయిల్పై రిలీజ్ అయ్యాడు. సోషల్ మీడియాలో విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న తన చెల్లి వైష్ణవిని ఆమె భర్తే చంపడాన్ని సంతోష్ జీర్ణించుకోలేకపోయాడు. ఎలాగైనా తన బావని చంపాలని ప్లాన్ చేసుకున్నాడు. అందుకు గురువారం ముహుర్తం పెట్టుకొని నిజామాబాద్ టౌన్లో హరిబాబురెడ్డిపై కత్తితో అందరూ చూస్తుండగానే 10 నిమిషాల్లో 9 సార్లు దాడి చేసి కారులో పారిపోయాడు. ఈ హత్యోదంతం అంతా అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డైంది. ఇక మృతుని తల్లి కళ్లేదుటే ఈఘటన జరగడంతో అందరూ షాక్ అయ్యారు.
యూట్యూబర్ హరిబాబును చంపింది తానేనని సెల్ఫీ వీడియో విడుదల చేశాడు సంతోష్. తన సోదరి హత్యకు ప్రతీకారంగానే చేశానని ఒప్పుకోవడమే కాకుండా కోరుట్ల పోలీసులకు లొంగిపోయాడు. అక్కడినుంచి పోలీసులు సంతోష్ని నిజామాబాద్కు తరలించారు. పోలీసులు హత్య కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. అయితే నిందితుడు సంతోష్ తన సోదరి హత్య విషయంలో పోలీసులు న్యాయం చేయలేదనే కోపంతోనే ఈ హత్య చేశానని.. తనకు భార్య, పిల్లలు ఉన్నారని తనకు శిక్షపడకుండా.. చేసిన నేరాన్ని ప్రతీకార చర్యగా చూడాలని అందకు అందరూ మద్దతివ్వాలని కోరడం జరిగింది.
కోరుట్లకు చెందిన హరి బాబు, మాదాపూర్ గ్రామానికి చెందిన వైష్ణవి పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో తాత్కాలిక స్వీపర్లుగా పనిచేస్తుండగా.. ప్రేమలో పడ్డారు. 14 నెలల కిందట వారు పెళ్లి చేసుకున్నారు. మాదాపూర్ లోని వైష్ణవి ఇంట్లోనే కాపురం పెట్టారు. అతడు కూలీ పనులు, ఆమె యూట్యూబ్ లో రీల్స్ చేస్తుండేవారు. రీల్స్ ద్వారా బాగా పాపులర్ అయిన క్రమంలోనే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఇందులో భాగంగానే ఈ ఏడాది మార్చి 16న వైష్ణవిని హరిబాబు చేశాడు. ఆత్మహత్య చేసుకున్నట్లుగా నమ్మించి పోలీసులకు దొరికిపోయాడు. ఈకేసులో హరిబాబు, అతడి తల్లి లక్ష్మి, ఇద్దరు అన్నలు కూడా జైలుకు వెళ్లారు.
ప్రేమించిన వాడ్ని పెళ్లి చేసుకున్న వైష్ణవి రీల్స్ చేసుకుంటూ పాపులర్ అయింది. అయితే వైష్ణవి ఫ్యామిలీలో ఒక్కతే ఆడపిల్ల కావడంతో కుటుంబ సభ్యులు ఆమెను అత్యంత ప్రేమగా చూసుకునేవారు. అలాంటి తమ సోదరిని హత్య చేయడంతో సోదరులు జీర్ణించుకోలేకపోయారు. హత్యకు గురైన తర్వాత 12 రోజులు సమాధి వద్దకు వెళ్లి విలపించడం అందరినీ కలచివేసింది. హంతకుడు హరిబాబును కఠి నంగా శిక్షించాలని కుటుంబీకులు ఆందోళ నలు చేశారు. లేదంటే తామే చంపేస్తామని కూడా చెప్పారు. అన్నట్లుగానే జైలు నుంచి విడుదలైన నెల రోజులకే హరిబాబును చంపడం.. అటుపై వీడియోని సోషల్ మీడియాలో తానే చంపానని ఒప్పుకోవడంతో పగతీర్చుకోవడం కోసం సంతోష్ అన్నంత పని చేశాడనే చర్చ కోరుట్ల పట్టణంలో జరుగుతోంది.













