Last Updated:
నీట్-యూజీ పేపర్ లీకేజీ వివాదం నేపథ్యంలో పరీక్షా విధానంలో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సంస్కరణల కోసం నందన్ నిలేకని నేతృత్వంలో ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ 2026 పేపర్ లీకేజీ, ఇతర పరీక్షల అక్రమాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) పనితీరులో సాంకేతిక, నిర్మాణాత్మక మార్పులు సూచించేందుకు ఉన్నత స్థాయి టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసింది. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు, ఆధార్ రూపకర్త నందన్ నిలేకని ఈ బృందానికి నేతృత్వం వహిస్తారని ఆదివారం అధికారికంగా వెల్లడించింది. న్యూస్18 ఇంగ్లీష్ కథనం ప్రకారం.. పరీక్షల నిర్వహణ పారదర్శకంగా, సురక్షితంగా, సాంకేతికత ఆధారంగా జరిగేలా తగిన సంస్కరణలను ఈ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది.
విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇవ్వడమే లక్ష్యంగా ఈ కమిటీ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎన్టీఏ పరీక్షల్లో ఇకపై ఎలాంటి అవకతవకలు జరగకుండా టెక్నాలజీని గరిష్టంగా ఎలా వాడుకోవాలనే విషయంపై వీరు ప్రధానంగా దృష్టి సారిస్తారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో మళ్లీ విశ్వాసం పెరిగే అవకాశం ఉంది.
నందన్ నిలేకని (చైర్మన్): ప్రముఖ టెక్నాలజీ నిపుణుడు, ఆధార్ వ్యవస్థ రూపకర్త.
ఎస్.సోమనాథ్: ఇస్రో మాజీ ఛైర్మన్.
తపన్ దేకా: ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) మాజీ డైరెక్టర్.
వి.కామకోటి: ఐఐటీ మద్రాస్ డైరెక్టర్.
అనితా కర్వాల్: కేంద్ర ఉన్నత విద్యాశాఖ మాజీ కార్యదర్శి.
అమృత్ లాల్ మీనా: ప్రముఖ లాజిస్టిక్స్ నిపుణుడు.
పరీక్షల పత్రాల రూపకల్పన నుంచి ఫలితాల వెల్లడి దాకా ప్రతి దశలో పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించేలా వీరు తగిన సూచనలు చేస్తారు.
దేశంలోని విద్యావ్యవస్థలో నమ్మకమైన, పారదర్శకమైన పరీక్షా విధానం ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న వారు ఇప్పటికే జైళ్లలో మగ్గుతున్నారని ఆదివారం విడుదల చేసిన ఒక వీడియో సందేశంలో ఆయన అన్నారు. ఈ కేసుల విచారణ కోసం ప్రభుత్వం ఇప్పటికే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. తప్పు చేసిన వారికి కఠిన శిక్షలు పడేలా సోమవారం పార్లమెంటులో కొత్త చట్టాన్ని కూడా తీసుకురాబోతున్నట్లు మోదీ వెల్లడించారు.
కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా భవిష్యత్తులో జరిగే ప్రవేశ పరీక్షలన్నింటినీ అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ముఖ్యంగా టెక్నాలజీ సాయంతో ప్రశ్నపత్రాల భద్రతను పెంచడంతో పాటు అక్రమాలకు పాల్పడే వ్యవస్థీకృత ముఠాలకు చెక్ పెట్టేలా ఈ కమిటీ సూచనలు ఉండనున్నాయి. వీలైనంత త్వరగా ఈ సంస్కరణలను క్షేత్రస్థాయిలో అమలు చేసి, పరీక్షల విధానంపై ప్రజల్లో మళ్లీ పూర్తి నమ్మకం తీసుకొచ్చే దిశగా కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana
Jul 26, 2026 11:02 PM IST














