‘విజయ్ ఒక డమ్మీ సీఎం.. రీల్స్ క్రియేటర్’.. DMK అధినేత ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు! | | ACTPnews

News18


Last Updated:

నటి త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో తన కుమారుడు ఉదయనిధి అరెస్ట్ కావడంపై డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తీవ్రంగా మండిపడ్డారు. తమిళనాడులో నడుస్తున్నది ‘జోకర్ల క్యాబినెట్’ అని ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వాన్ని ఆయన తీవ్ర స్థాయిలో ఏకిపారేశారు.

News18
News18

కావేరీ జలాల నిరసనలో నటి త్రిషను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ డీఎంకే నేత, ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ అరెస్ట్‌పై మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. అసమర్థుడైన డమ్మీ ముఖ్యమంత్రి కావేరీ జలాలను తీసుకురాలేరని, మేకేదాటు డ్యామ్‌ను ఆపాలని కనీసం నోరు విప్పలేకపోతున్నారని స్టాలిన్ దుయ్యబట్టారు. ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి సీఎం విజయ్ కేవలం ఒక ‘రీల్స్ క్రియేటర్‌’ లాగా, కెమెరాల ముందు షో-ఆఫ్ చేస్తున్నారని స్టాలిన్ దుయ్యబట్టారు.

రాష్ట్రంలో రైతులు నీళ్లు లేక కన్నీరు పెట్టుకుంటుంటే, మంత్రులు, ముఖ్యమంత్రి మాత్రం ఆయన నటించిన సినిమా చూసి ఏడుస్తున్నారని తీవ్ర స్థాయిలో ఎద్దేవా చేశారు. ప్రస్తుతం తమిళనాడులో నడుస్తున్నది ‘జోకర్ల క్యాబినెట్’ అని ఆయన మండిపడ్డారు. కావేరీ నీటి సమస్యపై ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని స్టాలిన్ ఆరోపించారు.

ఈ తప్పుడు అరెస్టులతో ప్రజల దృష్టిని మళ్లించాలని చూస్తున్నారని, ఇలాంటి కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు. రైతుల పక్షాన నిలబడి పోరాడుతున్న తమ నాయకుల గొంతు నొక్కడం ఏ ప్రభుత్వానికీ సాధ్యం కాదని ఆయన తేల్చి చెప్పారు.

అహంకారంతో వెళ్తే పతనం తప్పదు

ఇండియా టుడే కథనం ప్రకారం.. ఉదయనిధిపై పెట్టిన తప్పుడు కేసులకు ఎవరూ భయపడరని స్టాలిన్ స్పష్టం చేశారు. కావేరీ జలాల పంపిణీలో అధికార పార్టీ పూర్తిగా విఫలమైందని, రైతుల సమస్యలను గాలికొదిలేసిందని విమర్శించారు. ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఒక సామాన్య నిరసనలో చేసిన వ్యాఖ్యలను బూతద్దంలో చూపిస్తూ అరెస్టుల దాకా తీసుకెళ్లారని ఆయన ఆరోపించారు. రాజకీయంగా ఎదుర్కోలేక అహంకారంతో వ్యవహరిస్తే పతనం తప్పదని స్టాలిన్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

వ్యాఖ్యలను వక్రీకరించారు

మరోవైపు తంజావూరులో జరిగిన నిరసన సభలో ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు ఎవరినీ కించపరిచేలా లేవని డీఎంకే పార్టీ వర్గాలు సమర్థించుకుంటున్నాయి. కేవలం ప్రభుత్వం చేస్తున్న తప్పులను మాత్రమే ఆయన ఎత్తిచూపారని డీఎంకే నేతలు వాదిస్తున్నారు. కావాలనే కొందరు ఉద్దేశపూర్వకంగా ఆ వీడియోలను వక్రీకరించి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని పార్టీ అధికార ప్రతినిధులు ఆరోపించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి అధికార ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా, న్యాయపరంగానే ముందుకు వెళతామని డీఎంకే నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

బెయిల్‌తో ఊరట

ఇదిలా ఉండగా ఉదయనిధికి మద్రాస్ హైకోర్టులో భారీ ఊరట లభించింది. విచారణ పూర్తయిన వెంటనే ఆయనను స్టేషన్ బెయిల్‌పై విడుదల చేయాలని పోలీసులను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉదయం నుంచి నిరసనలు తెలుపుతున్న డీఎంకే శ్రేణులు కాస్త శాంతించాయి. విచారణకు పూర్తిగా సహకరిస్తామని ఉదయనిధి ఇప్పటికే స్పష్టం చేశారు. కానీ ఈ అనూహ్య అరెస్ట్ వ్యవహారంతో తమిళనాడులో అధికార టీవీకే, ప్రతిపక్ష డీఎంకే పార్టీల మధ్య రాజకీయ యుద్ధం తారాస్థాయికి చేరింది.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *