సెప్టెంబర్ 15 నుంచి తిరుమలలో బ్రహ్మోత్సవ వైభవం.. 9 రోజుల దివ్య వాహన సేవలు.. పూర్తి వివరాలు ఇవే..! | | ACTPnews

News18


Last Updated:

తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 15-23 వరకు జరుగుతాయి. అక్టోబర్ 12-20 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు. టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.

News18
News18

శ్రీవేంకటేశ్వరస్వామివారి వార్షిక ఉత్సవాల్లో అత్యంత వైభవోపేతంగా నిర్వహించే సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమల సిద్ధమవుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు ఈ మహోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. అనంతరం అక్టోబర్ 12 నుంచి 20వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలను కూడా శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు పాల్గొనే ఈ వేడుకలతో తిరుమల క్షేత్రం మరోసారి ఆధ్యాత్మిక వైభవంతో కళకళలాడనుంది.

సెప్టెంబర్ 14వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుడతారు. అనంతరం సెప్టెంబర్ 15న సాయంత్రం ధ్వజారోహణంతో ఉత్సవాలు అధికారికంగా ప్రారంభమవుతాయి. అదే రోజు రాత్రి పెద్ద శేషవాహనంపై శ్రీ మలయప్పస్వామివారు భక్తులకు తొలి దర్శనం ఇవ్వనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 7 నుంచి 9 గంటల వరకు వివిధ దివ్య వాహనాలపై స్వామివారు భక్తులను అనుగ్రహించనున్నారు. అయితే అత్యంత ప్రాధాన్యం కలిగిన గరుడవాహన సేవ రోజున మాత్రం సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 11:30 గంటల వరకు ప్రత్యేకంగా నిర్వహించనున్నారు.

ఉత్సవాల్లో రెండో రోజు చిన్న శేషవాహనం, హంసవాహనం సేవలు జరగనుండగా, తదుపరి రోజుల్లో సింహవాహనం, ముత్యపు పందిరి వాహనం, కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం సేవలు భక్తులను అలరించనున్నాయి. సెప్టెంబర్ 19న ఉదయం మోహినీ అవతారంలో శ్రీవారు దర్శనమివ్వగా, అదే రోజు రాత్రి జరిగే గరుడవాహన సేవకు విశేష ప్రాధాన్యం ఉంది. ఈ సేవను ప్రత్యక్షంగా తిలకించేందుకు ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలివస్తారు.

సెప్టెంబర్ 20న హనుమంత వాహన సేవ, స్వర్ణ రథోత్సవం, గజవాహన సేవలు నిర్వహించనుండగా, అనంతరం సూర్యప్రభ, చంద్రప్రభ వాహన సేవలు కొనసాగుతాయి. సెప్టెంబర్ 22న రథోత్సవం, అశ్వవాహన సేవలు వైభవంగా జరగనున్నాయి. చివరి రోజు అయిన సెప్టెంబర్ 23న ఉదయం పవిత్ర చక్రస్నానం నిర్వహించి, రాత్రి ధ్వజావరోహణంతో తొమ్మిది రోజుల సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

ఈ మహోత్సవాల కోసం తిరుమలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపడుతోంది. దర్శనం, వసతి, తాగునీరు, అన్నప్రసాదం, రవాణా, భద్రత తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. శ్రీవారి దివ్య వాహన సేవలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వేదఘోషల మధ్య జరిగే ఈ బ్రహ్మోత్సవాలు తిరుమల మహిమాన్విత వైభవాన్ని మరోసారి ప్రపంచానికి చాటనున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports