టీటీడీ గోశాలలో విషాదం.. దానంగా వచ్చిన గుర్రం మృతి.. అసలు కారణం ఏంటి? | | ACTPnews

News18


Last Updated:

టీటీడీ గోసంరక్షణశాలలో గుర్రం మృతి. దీర్ఘకాలిక కాలేయం, మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్నట్లు ప్రాథమిక నిర్ధారణ. పూర్తి నివేదిక కోసం ఎదురుచూపులు.

News18
News18

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో విషాద ఘటన చోటుచేసుకుంది. దానంగా అందించిన తొమ్మిదేళ్ల వయస్సు గల మగ గుర్రం శనివారం ఉదయం మృతి చెందినట్లు ఎస్వీ గోశాల డైరెక్టర్ డా. ఏ.వి.ఎన్. శివకుమార్ వెల్లడించారు. గుర్రం మరణానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు అధికారులు వెంటనే శవపరీక్ష నిర్వహించి, అవసరమైన అవయవాలు, ఇతర నమూనాలను ప్రయోగశాలకు పంపించారు. తుది నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి గల అసలు కారణాన్ని అధికారికంగా వెల్లడిస్తామని తెలిపారు.

అధికారుల వివరాల ప్రకారం, ఈ గుర్రం జూలై 13న గోసంరక్షణశాలకు చేరిన వెంటనే క్వారంటైన్‌లో ఉంచి ప్రత్యేక వైద్య పర్యవేక్షణలో చికిత్స అందించారు. రక్తం, పేడ నమూనాలను తిరుపతిలోని రాష్ట్ర స్థాయి పశు వ్యాధి నిర్ధారణ ప్రయోగశాలకు పంపగా, ప్రాథమిక పరీక్షల్లో గుర్రం దీర్ఘకాలిక కాలేయం, మూత్రపిండాల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు తేలింది. గోశాలకు వచ్చినప్పటి నుంచే మేత, నీరు సరిగా తీసుకోకపోవడం, తరచూ కూర్చోవడం, పడుకోవడం, దొర్లడం, మళ్లీ లేవడం వంటి అస్వస్థత లక్షణాలు కనిపించాయని అధికారులు వెల్లడించారు.

ఈ పరిస్థితిని గుర్తించిన పశువైద్యులు నిపుణుల సూచనల మేరకు అవసరమైన మందులు, ప్రత్యేక చికిత్సలు, నిరంతర వైద్య పర్యవేక్షణ అందించినప్పటికీ గుర్రం ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మెరుగుదల కనిపించలేదని తెలిపారు. అందుబాటులో ఉన్న అన్ని వైద్య చికిత్సలను అందించినప్పటికీ అది స్పందించకపోవడంతో జూలై 18న ఉదయం సుమారు 10 గంటలకు గుర్రం మృతి చెందినట్లు వెల్లడించారు.

అదే రోజు మధురైకి చెందిన దాత శ్రీ షణ్ముగం ఎస్వీ గోశాలను సందర్శించగా, ఆయన సమక్షంలోనే ఈ ఘటన జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. అనంతరం శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయానికి చెందిన నిపుణుల బృందం సమక్షంలో శవపరీక్ష నిర్వహించగా, ప్రాథమికంగా గుర్రం దీర్ఘకాలిక కాలేయం, గుండె, మూత్రపిండాల వ్యాధులతో బాధపడినట్లు నిర్ధారణ అయినట్లు తెలిపారు.

శవపరీక్షకు సంబంధించిన పూర్తి నివేదిక వచ్చిన తర్వాతే గుర్రం మరణానికి గల తుది కారణాన్ని అధికారికంగా వెల్లడిస్తామని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. అనంతరం అన్ని నిబంధనలు పాటిస్తూ గుర్రాన్ని శాస్త్రీయ పద్ధతిలో ఖననం చేసినట్లు ఎస్వీ గోసంరక్షణశాల అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై పూర్తి వైద్య నివేదిక కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed