Last Updated:
భారత రక్షణ రంగంలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశీయ రక్షణ ఉత్పత్తి ఏకంగా రూ.1.78 లక్షల కోట్లకు చేరి ఆల్టైమ్ రికార్డు సృష్టించింది. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంగా మన దేశం సాధించిన గొప్ప విజయం ఇది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్ఫూర్తిదాయక నాయకత్వంలో భారతదేశం రక్షణ రంగంలో సరికొత్త శిఖరాలకు చేరుకుంటోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన దేశ వార్షిక రక్షణ ఉత్పత్తి ఎన్నడూ లేని విధంగా ఆల్టైమ్ గరిష్ట స్థాయికి చేరింది. ఏకంగా రూ.1.78 లక్షల కోట్ల ఉత్పత్తితో చారిత్రక రికార్డు నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం సాధించిన రూ.1.54 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 15.6 శాతం అద్భుతమైన వృద్ధి. ఇక 2020-21 నాటి రూ.84,643 కోట్లతో పోల్చుకుంటే ఏకంగా 110 శాతం పెరుగుదల కనిపించింది.
2013-14లో కేవలం రూ.43,746 కోట్లుగా ఉన్న దేశీయ రక్షణ ఉత్పత్తి ఇప్పుడు దాదాపు నాలుగు రెట్లు పెరగడం విశేషం. ఈ రికార్డుల ద్వారా ఆత్మనిర్భర్ భారత్ దిశగా దేశం వేస్తున్న అడుగులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మేకిన్ ఇండియా పథకం కింద రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించాలనే ప్రభుత్వ లక్ష్యం విజయవంతంగా నెరవేరుతోందని ఈ ఘనమైన గణాంకాలు చెబుతున్నాయి.
ఈ అద్భుత ప్రయాణంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల భాగస్వామ్యం ఎంతో కీలకంగా మారింది. మొత్తం రక్షణ ఉత్పత్తిలో రక్షణ ప్రభుత్వ రంగ సంస్థలు (డిపిఎస్యు), ఇతర ప్రభుత్వ సంస్థల వాటా సుమారు 76 శాతం ఉంది. ప్రైవేట్ రంగం కూడా తనదైన ముద్ర వేస్తూ 24 శాతం సహకారం అందించింది. గత ఏడాదితో పోలిస్తే ప్రైవేట్ రంగం వాటా గణనీయంగా పెరిగింది. రక్షణ రంగ వ్యవస్థలో ప్రైవేట్ కంపెనీల నుండి ఏకంగా రూ.42,000 కోట్ల ఉత్పత్తి జరగడం దేశీయ పారిశ్రామిక మార్పులను సూచిస్తోంది.
దేశీయ రక్షణ ఉత్పత్తి భారీగా పెరగడం వల్లే 2025-26లో మన రక్షణ ఎగుమతులు కూడా రూ.38,424 కోట్లకు చేరి అరుదైన చరిత్ర సృష్టించాయి. స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న తేజస్ యుద్ధ విమానాలు, ఆకాశ్ క్షిపణులు, పినాక రాకెట్ లాంచర్లు మన రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఈ ఆధునిక ఆయుధాల తయారీతో భారత రక్షణ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. మన దేశం ఇతర దేశాలకు ఆయుధాలు ఎగుమతి చేసే స్థాయికి ఎదగడం గర్వకారణం.
ఈ చారిత్రక మైలురాయిపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ‘ఎక్స్’ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ దార్శనికతను ఆయన కొనియాడారు. రక్షణ ఉత్పత్తి విభాగం, అన్ని వర్గాల సమిష్టి కృషితోనే ఈ విజయం సాధ్యమైందని ఆయన అన్నారు. మన దేశ రక్షణ పారిశ్రామిక ఆధారం వేగంగా విస్తరిస్తోందని ఈ వృద్ధి స్పష్టం చేస్తోందని చెప్పారు. ప్రభుత్వ విధానాల మద్దతు, ప్రైవేట్ రంగం భాగస్వామ్యం, పెరుగుతున్న ఎగుమతుల సామర్థ్యంతో రాబోయే రోజుల్లో రక్షణ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana














