Last Updated:
BRICS 2026: అంతర్జాతీయ వేదికపై మరో చారిత్రక ఘట్టానికి దేశ రాజధాని న్యూఢిల్లీ ముస్తాబైంది. ప్రతిష్ఠాత్మక ‘భారత్ మండపం’ వేదికగా శని, ఆదివారాల్లో 18వ బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సు ప్రారంభం కానుంది.
ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరిగిపోతున్న వేళ, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో భారత్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సదస్సు ప్రపంచ దేశాల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది. గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లలో సరఫరా గొలుసుల అడ్డంకులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న కఠిన వాణిజ్య, సుంకాల విధానాలు వర్ధమాన దేశాల ప్రయోజనాలకు గండికొట్టేలా ఉన్నాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో అభివృద్ధి చెందుతున్న దేశాల ఉమ్మడి రక్షణ కవచంగా, పరస్పర వాణిజ్య పురోగతికి బాటలు వేసే వేదికగా బ్రిక్స్ సదస్సును విశ్లేషకులు భావిస్తున్నారు.














