Last Updated:
“ఈ రెండు కేంద్రపాలిత ప్రాంతాలు గతంలోనూ, ప్రస్తుతం, ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగంగానే ఉంటాయి. ఈ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించే లేదా జోక్యం చేసుకునే ఎలాంటి చట్టపరమైన హక్కు ఇతర దేశాలకు లేదు” అని ఎంఈఏ ప్రతినిధి తేల్చి చెప్పారు.
Unwarranted: భారత భూభాగాలైన జమ్మూకశ్మీర్, లడఖ్ విషయాల్లో చైనా, పాకిస్థాన్ల అతిజోక్యంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా విరుచుకుపడింది. బీజింగ్ వేదికగా చైనా, పాకిస్థాన్లు విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో (Joint Statement) జమ్మూకశ్మీర్ ప్రస్తావనను భారతదేశం పూర్తిగా తిరస్కరించింది. ఈ అనవసర ప్రస్తావనలు చెల్లవని, జమ్మూకశ్మీర్ ఎప్పటికీ భారతదేశంలో ఒక అవిభాజ్య, అంతర్భాగమేనని గట్టిగా పునరుద్ఘాటించింది.
ఈ వ్యవహారంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మంగళవారం దౌత్యపరంగా గట్టి కౌంటర్ ఇచ్చారు. న్యూస్18 ఇంగ్లీష్ కథనం ప్రకారం.. జమ్మూకశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలపై భారతదేశ వైఖరి ఎల్లప్పుడూ స్పష్టంగా, స్థిరంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. “ఈ రెండు కేంద్రపాలిత ప్రాంతాలు గతంలోనూ, ప్రస్తుతం, ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగంగానే ఉంటాయి. ఈ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించే లేదా జోక్యం చేసుకునే ఎలాంటి చట్టపరమైన హక్కు ఇతర దేశాలకు లేదు” అని ఎంఈఏ ప్రతినిధి తేల్చి చెప్పారు.
పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఉమ్మడి ప్రకటన ప్రకారం.. జమ్మూకశ్మీర్లో జరుగుతున్న పరిణామాలపై పాక్ ప్రతినిధులు చైనాకు వివరించారు. దీనిపై చైనా స్పందిస్తూ.. ఇది “చరిత్ర వదిలివెళ్లిన సమస్య” అని అభివర్ణించింది. దీనిని ఐరాస (UN) చార్టర్, ఐరాస భద్రతా మండలి తీర్మానాలు మరియు ద్వైపాక్షిక ఒప్పందాల ప్రకారం శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పేర్కొంది. గత 2024 లో కూడా చైనా-పాకిస్థాన్ ఇలాంటి పదజాలంతోనే ఉమ్మడి ప్రకటన విడుదల చేయగా.. అప్పట్లో కూడా భారతదేశం ఆ వ్యాఖ్యలను అంతే బలంగా తిరస్కరించింది.
భారతదేశ సార్వభౌమత్వాన్ని, ప్రాంతీయ సమగ్రతను దెబ్బతీసేలా ఉన్న చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) ప్రాజెక్టును కూడా న్యూఢిల్లీ తీవ్రంగా వ్యతిరేకించింది. పాకిస్థాన్ చట్టవిరుద్ధంగా, బలవంతంగా ఆక్రమించుకున్న భారత భూభాగం (POK) గుండా ఈ ప్రాజెక్టు వెళ్తోందని, అందుకే ఈ రకమైన ప్రాజెక్టులను తాము మొదటి నుండి వ్యతిరేకిస్తున్నామని భారత్ స్పష్టం చేసింది.
ఇదే సమయంలో చైనా-పాకిస్థాన్లు తమ ప్రకటనలో పేర్కొన్న “సరిహద్దు నదీ జలాల వనరుల సహకారం” (Trans-boundary water resources cooperation) అనే అంశాన్ని కూడా భారత్ తోసిపుచ్చింది. చైనాకు, పాకిస్థాన్కు అసలు ప్రత్యక్ష సరిహద్దే లేనప్పుడు ‘సరిహద్దు నదీ జలాల సహకారం’ అనే ప్రశ్నే ఉత్పన్నం కాదని ఎద్దేవా చేసింది. అంతేకాకుండా, 1963లో చైనా-పాకిస్థాన్ మధ్య కుదిరిన అక్రమ సరిహద్దు ఒప్పందాన్ని భారతదేశం ఎన్నటికీ గుర్తించబోదని ఎంఈఏ స్పష్టం చేసింది.
కశ్మీర్ సమస్యను అంతర్జాతీయం చేయడానికి పాకిస్థాన్ చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని భారత్ మొదటి నుండి తిప్పికొడుతూనే ఉంది. ఈ అంశం పూర్తిగా భారత్-పాక్ మధ్య ఉన్న ద్వైపాక్షిక విషయమని, ఇందులో మూడో దేశం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని భారత్ తన స్థిరమైన వైఖరిని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













