Last Updated:
హై టెన్షన్ మ్యాచ్లో టాస్ గెలిచిన సన్రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే పిచ్ పరిస్థితులను సరిగా అంచనా వేయకపోవడం జట్టుకు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ముఖ్యంగా జట్టు తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాలు, బౌలింగ్ వైఫల్యం, టాప్ ఆర్డర్ కుప్పకూలడం ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపించాయి.
ఐపీఎల్ 2026 సీజన్లో లీగ్ దశ అంతా దూసుకెళ్లిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు.. ప్లేఆఫ్స్లో మాత్రం తీవ్ర నిరాశ కలిగించింది. ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో 47 పరుగుల తేడాతో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. సీజన్ మొత్తం దూకుడైన ఆటతో టైటిల్ ఫేవరెట్గా గుర్తింపు పొందిన ఆరెంజ్ ఆర్మీ.. కీలక సమయంలో తడబడటం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ముఖ్యంగా జట్టు తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాలు, బౌలింగ్ వైఫల్యం, టాప్ ఆర్డర్ కుప్పకూలడం ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపించాయి.
ముల్లాన్పూర్ వేదికగా జరిగిన ఈ హై టెన్షన్ మ్యాచ్లో టాస్ గెలిచిన సన్రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే పిచ్ పరిస్థితులను సరిగా అంచనా వేయకపోవడం జట్టుకు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. బ్యాటింగ్కు అనుకూలంగా మారిన పిచ్పై రాజస్థాన్ బ్యాటర్లు హైదరాబాద్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించారు.
ప్రత్యేకంగా 15 ఏళ్ల యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ సంచలన ఇన్నింగ్స్తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి హైదరాబాద్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతని ఇన్నింగ్స్లో 12 భారీ సిక్సర్లు, 5 ఫోర్లు ఉండటం విశేషం. మరోవైపు ధృవ్ జురెల్ అర్ధశతకంతో జట్టుకు బలమైన మద్దతు ఇచ్చాడు. ఈ ఇద్దరి దూకుడు కారణంగా రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.
హైదరాబాద్ బౌలర్లు మ్యాచ్ మొత్తం లైన్ అండ్ లెంగ్త్ కోల్పోయి పరుగులు ధారాళంగా సమర్పించుకున్నారు. కెప్టెన్ పాట్ కమిన్స్ నాలుగు ఓవర్లలో వికెట్ తీయకుండానే 64 పరుగులు ఇచ్చాడు. సాకిబ్ హుస్సేన్ కూడా భారీగా పరుగులు సమర్పించాడు. ప్రఫుల్ హింగే మూడు వికెట్లు తీసినప్పటికీ అతని ఎకానమీ జట్టుకు నష్టం కలిగించింది. కీలక సమయాల్లో బౌలర్లు ఒత్తిడి సృష్టించలేకపోవడంతో రాజస్థాన్ స్కోరు అదుపుతప్పింది.
244 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్రైజర్స్కు ఆరంభం నుంచే ఎదురుదెబ్బలు తగిలాయి. రాజస్థాన్ పేసర్ జోఫ్రా ఆర్చర్ పవర్ప్లేలోనే హైదరాబాద్ టాప్ ఆర్డర్ను కుదేలు చేశాడు. అభిషేక్ శర్మ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరగా, ట్రావిస్ హెడ్ కూడా త్వరగానే అవుటయ్యాడు. ఇషాన్ కిషన్ కొంతసేపు పోరాడినా పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. పవర్ప్లే ముగిసే సరికి 57 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోవడంతో హైదరాబాద్ పూర్తిగా ఒత్తిడిలో పడిపోయింది.
తర్వాత మిడిల్ ఆర్డర్పై ఆశలు పెట్టుకున్న అభిమానులకు కూడా నిరాశే ఎదురైంది. హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా కొంత పోరాటం చేసినప్పటికీ భారీ లక్ష్యాన్ని చేధించేందుకు అవసరమైన భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోయారు. రాజస్థాన్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ మ్యాచ్పై పట్టును మరింత బిగించారు. ఫలితంగా సన్రైజర్స్ 19.2 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌట్ అయింది.
ఈ ఓటమితో సన్రైజర్స్ అభిమానుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. సోషల్ మీడియాలో జట్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లీగ్ దశలో అద్భుత ప్రదర్శన చేసిన జట్టు.. నాకౌట్ మ్యాచ్లో మాత్రం ఒత్తిడిని తట్టుకోలేకపోయిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. సరైన ప్రణాళిక లేకపోవడం, బౌలింగ్లో క్రమశిక్షణ లేకపోవడం, బ్యాటర్లు బాధ్యతగా ఆడకపోవడం కలిసి హైదరాబాద్ జట్టుకు భారీ నష్టాన్ని మిగిల్చాయి.
లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్, మ్యాచ్ అప్డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Hyderabad,Telangana













