Last Updated:
అతను అక్కడి వాతావరణానికి అలవాటు పడేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు స్పష్టం చేసింది. ఈ పర్యటనకు అయ్యే పూర్తి ఖర్చులను బీసీసీఐ భరించనుంది. క్రికెట్ చరిత్రలో ఇలా పేరేంట్స్ను ప్లేయర్తో పిలుచుకుపోవడం ఇదే తొలిసారి.
Team India: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సరికొత్త సంచలనం, 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ విషయంలో ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. భారత సీనియర్ జట్టుతో కలిసి అతను వెళ్లనున్న ఐర్లాండ్, ఇంగ్లాండ్ (యూకే) పర్యటనకు అతని తల్లిదండ్రులు కూడా వెళ్లేందుకు బీసీసీఐ ప్రత్యేక నిబంధన కింద అనుమతి ఇచ్చింది. అంతటి చిన్న వయసులోనే సీనియర్ ఆటగాళ్లతో కలిసి విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, అతను అక్కడి వాతావరణానికి అలవాటు పడేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు స్పష్టం చేసింది. ఈ పర్యటనకు అయ్యే పూర్తి ఖర్చులను బీసీసీఐ భరించనుంది. క్రికెట్ చరిత్రలో ఇలా పేరేంట్స్ను ప్లేయర్తో పిలుచుకుపోవడం ఇదే తొలిసారి.
“వైభవ్ భారత్-ఎ జట్టు నుండి సీనియర్ జట్టుతో కలిసి శ్రీలంక పర్యటనకు ఎంపికయ్యాడు. అతను ఇంకా చాలా చిన్న పిల్లాడు, మైనర్. గతంలో అతను అండర్-19 వరల్డ్ కప్ వంటి టోర్నీల కోసం తన వయసు పిల్లలతో కలిసి ప్రయాణించాడు. కానీ ఇప్పుడు పూర్తిగా పెద్దవారైన ఆటగాళ్లతో (మెన్స్ టీమ్) కలిసి ప్రయాణిస్తున్నాడు. అందుకే అతనితో పాటు తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యులు ఎవరైనా శ్రీలంకకు వెళ్లడం సరైనదని భావించాం.
ఈ విషయమై మేము వారి తల్లిదండ్రులను కోరగా, దానికి వారు అంగీకరించారు. ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న వైభవ్తో కలవడానికి అతని తండ్రి ఇప్పటికే బయలుదేరారు. ఆ తర్వాత జరగబోయే ఇంగ్లాండ్ పర్యటనకు కూడా వారు వెళ్లాలనుకుంటే బీసీసీఐ పూర్తి మద్దతు ఇస్తుంది. అతను సీనియర్ ఆటగాళ్లతో కలిసిపోవడానికి కొంత సమయం పడుతుంది. సాధారణంగా మేము ఏ ఆటగాడి తల్లిదండ్రులను పర్యటనలకు అనుమతించము. కానీ అతను కేవలం 15 ఏళ్ల వయసులోనే ఉన్నందున, ఈ వయోజన ప్రపంచంలో (adult world) సౌకర్యవంతంగా సర్దుబాటు చేసుకునేందుకు ఈ మినహాయింపు ఇచ్చాం” అని సైకియా వివరించారు.
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్ సూర్యవంశీ కేవలం 16 మ్యాచ్ల్లో 237.31 అద్భుతమైన స్ట్రైక్ రేట్తో 776 పరుగులు చేసి అదరగొట్టాడు. ఆరెంజ్ క్యాప్తో పాటు ‘మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్’ అవార్డును సైతం గెలుచుకున్నాడు. శనివారం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్లతో పాటు ఆసియా గేమ్స్ కోసం ప్రకటించిన భారత టి20 జట్టులో వైభవ్కు చోటు కల్పించింది.
ఈ ఎంపికతో వైభవ్ సూర్యవంశీ.. 36 ఏళ్ల క్రితం నాటి సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. భారత సీనియర్ జట్టుకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించిన వైభవ్, రాబోయే మ్యాచ్ల్లో అరంగేట్రం చేస్తే.. దేశం తరఫున ఆడిన అత్యంత చిన్న వయస్కుడిగా చరిత్రకెక్కుతాడు.
జట్టు ఎంపిక సమయంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. వైభవ్ తన అద్భుత ప్రదర్శనతో జట్టులో చోటు దక్కించుకునేలా మమ్మల్ని బలవంతం చేశాడని అన్నారు. “అతని ఆటతీరు చూశాక, ఎంపిక చేయకుండా ఉండలేకపోయాం. ఐపీఎల్ ప్లేఆఫ్స్లో దాదాపు ఒంటరి చేత్తో రాజస్థాన్ రాయల్స్ జట్టును నడిపించాడు. ఇంతటి తీవ్రమైన ఒత్తిడి ఉండే ఐపీఎల్ లాంటి టోర్నమెంట్లో ఒక చిన్న పిల్లాడు ఈ స్థాయిలో ఆడటం నిజంగా ప్రత్యేకం. భారత్లో టి20 క్రికెట్ చూసే ప్రతి ఒక్కరిలాగే మాకు కూడా అతనిపై భారీ అంచనాలు ఉన్నాయి” అని అగార్కర్ ప్రశంసించారు.
లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్, మ్యాచ్ అప్డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Hyderabad,Telangana













