Last Updated:
బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ పుట్టడం వెనుక కారణాలు చెబుతూ బాలకృష్ణ ఎమోషనల్ అయ్యారు. హైదరాబాద్లో అత్యంత వైభవంగా జరిగిన ఈ ఆసుపత్రి రజతోత్సవ (25 ఏళ్ల) వేడుకల్లో ఆయన పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు.
పేదరికం కారణంగా ఏ ఒక్కరూ క్యాన్సర్ వైద్యానికి దూరం కాకూడదనే పవిత్ర ఆశయంతోనే ‘బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్’ ఏర్పాటైందని ఆసుపత్రి ఛైర్మన్, ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు. హైదరాబాద్లో అత్యంత వైభవంగా జరిగిన ఈ ఆసుపత్రి రజతోత్సవ (25 ఏళ్ల) వేడుకల్లో ఆయన ఒక కొడుకుగా ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు.
తమ తల్లి బసవతారకం గారు క్యాన్సర్ బారిన పడి అనుభవించిన నరకయాతనను బాలకృష్ణ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. “డబ్బు ఉన్నవారు ప్రపంచంలో ఎక్కడైనా ట్రీట్మెంట్ చేయించుకోగలరు.. మరి లేని పేదవారి పరిస్థితి ఏంటి?” అని నాటి రోజుల్లో ఆమె అడిగిన ఆవేదన నిండిన ప్రశ్న నుంచే ఈ ‘బసవతారకం ట్రస్ట్’ పురుడుపోసుకుందని ఆయన వెల్లడించారు.
గడిచిన 25 ఏళ్ల కాలంలో ఈ సంస్థ సాధించిన ప్రగతిని బాలకృష్ణ గణాంకాలతో వివరించారు. ఆసుపత్రి ప్రారంభమైన తొలినాళ్లలోనే దేశంలోనే మొట్టమొదటి ‘బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్’ (Bone Marrow Transplantation) కేంద్రాన్ని ఇక్కడ నెలకొల్పారు. ప్రస్తుతం ఈ ఆసుపత్రిలో ప్రతిరోజూ సగటున 35 నుండి 40 అత్యాధునిక శస్త్రచికిత్సలు విజయవంతంగా జరుగుతున్నాయి. దాతలు, ప్రభుత్వాల అండతో ఇప్పటివరకు దాదాపు 3.75 లక్షల మందికి పైగా రోగులకు అవుట్ పేషెంట్ (OP) సేవలు, ఉచిత/సబ్సిడీ చికిత్సలు అందించారు.
“క్యాన్సర్ అనే పేరు వినగానే రోగుల్లో కలిగే భయం.. మా ఆసుపత్రికి వచ్చాక ‘ధైర్యం’గా మారడమే మా అసలైన విజయం. వారి ముఖాల్లో చూసే చిరునవ్వే మాకు దక్కే నిజమైన అవార్డు” అని బాలకృష్ణ పేర్కొన్నారు.
సినిమాల్లో హీరోగా గెలిచాడు…
రాజకీయాల్లో నాయకుడిగా నిలిచాడు…
కానీ బసవతారకం ఆసుపత్రి ద్వారా వేలాది ప్రాణాలను కాపాడి మనసులు గెలిచాడు. ❤️🙏25 ఏళ్ల సేవా ప్రయాణానికి సాక్షిగా నిలిచిన బాలయ్య బాబు. ✨#NBK #BasavatarakamHospital #NandamuriBalakrishna pic.twitter.com/NDEfAzQ0KU
— Cherukuri Bobby Chowdary🔥🔥🔥✌✌✌✌ (@yughandharbobby) June 23, 2026
భవిష్యత్తు ప్రణాళికలను ప్రకటిస్తూ.. హైదరాబాద్లోని బసవతారకం ఆసుపత్రి సేవలను మరింత అత్యాధునికీకరించడంతో పాటు, త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కూడా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని నిర్మించనున్నట్లు బాలకృష్ణ వెల్లడించారు. గతేడాది ఆగస్టులోనే అమరావతిలో ఈ నూతన హాస్పిటల్ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
ఈ రజతోత్సవ వేడుకలకు దేశ, రాష్ట్ర రాజకీయ ప్రముఖులతో పాటు టాలీవుడ్ పరిశ్రమ మొత్తం తరలివచ్చింది. భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రులు అనుప్రియ పటేల్, డా. పెమ్మసాని చంద్రశేఖర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరితో పాటు దివంగత ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.
ఈ వేదికపై బాలకృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకులు బోయపాటి శ్రీను, కొరటాల శివ, బాబీ కొల్లి, గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, అలాగే ప్రముఖ నిర్మాతలు వెంకట్ సతీష్ కిలారు, సాహు గారపాటిలను సీఎం చంద్రబాబు నాయుడుకు పేరుపేరునా అప్యాయంగా పరిచయం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 25 ఏళ్ల క్రితం తాము చేసిన సేవా ప్రమాణాన్ని నేటికీ నిలబెట్టుకోవడం వెనుక ఎందరో మహానుభావుల త్యాగాలు, దాతల సహకారం ఉందని బాలకృష్ణ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana













