Last Updated:
యువ విద్యార్థులలో లేనిపోని భయాందోళనలు, గందరగోళాన్ని సృష్టిస్తున్నారని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఇలాంటి సున్నితమైన అంశాలపై రాజకీయం చేయవద్దని ఆయన ప్రతిపక్షాలను హెచ్చరించారు.
NEET UG 2026: నీట్-యూజీ (NEET-UG) పరీక్ష 2026 వివాదంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గురువారం కాంగ్రెస్ పార్టీపై, ముఖ్యంగా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం రాహుల్ గాంధీ అభ్యర్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని, యువ విద్యార్థులలో లేనిపోని భయాందోళనలు, గందరగోళాన్ని సృష్టిస్తున్నారని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఇలాంటి సున్నితమైన అంశాలపై రాజకీయం చేయవద్దని ఆయన ప్రతిపక్షాలను హెచ్చరించారు.
సీఎన్ఎన్-న్యూస్18 కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మంత్రి మాట్లాడుతూ.. “ప్రతిపక్షాలు, రాహుల్ గాంధీ ఈ విషయంలో రాజకీయం చేయకూడదు. రాహుల్ గాంధీ యువత మనస్సుల్లో భయాన్ని నింపడానికి ప్రయత్నించారు. కొత్త తరాన్ని భయపెట్టకండి, వారి భవిష్యత్తు పట్ల మనందరికీ బాధ్యత ఉంది” అని పేర్కొన్నారు.
విద్యార్థుల భవిష్యత్తు విషయాల్లో తాను రాజకీయం చేయాలనుకోవడం లేదని, కానీ పరీక్షకు కొన్ని రోజుల ముందు కోటా (Kota) నగరంలో ప్రతిపక్షాలు ర్యాలీ నిర్వహించడం ఏమాత్రం తగదని ఆయన మండిపడ్డారు. పరీక్షల నిర్వహణలో సాయుధ బలగాలను ఉపయోగించడంపై ప్రతిపక్షాల విమర్శలకు సమాధానమిస్తూ, “భారతీయ యువత పరీక్షలను సజావుగా రాసేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF), సీఏపీఎఫ్ (CAPF) బలగాలను ఉపయోగిస్తే వచ్చే నష్టం ఏంటి?” అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్వహించిన ఒక ర్యాలీ కారణంగా ముగ్గురు విద్యార్థులు తమ నీట్ పరీక్షా కేంద్రానికి సమయానికి చేరుకోలేకపోయారని ధర్మేంద్ర ప్రధాన్ గుర్తుచేశారు. ఆ తర్వాత ఖర్గే ఆ విద్యార్థులకు క్షమాపణలు కూడా చెప్పారని, అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో తమకు నీతులు ఎలా చెబుతుందని నిలదీశారు. అలాగే ప్రస్తుతం సాగుతున్న “కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం” (Cockroach Janta Party movement) వెనుక రాహుల్ గాంధీ బీ-టీమ్ ఉందని ఆయన ఆరోపించారు.
వైద్య విద్యా ప్రవేశ పరీక్షల పునఃపరిశీలన (Re-examination) ప్రక్రియను ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా, సుజావుగా నిర్వహించిందని మంత్రి డిఫెండ్ చేసుకున్నారు. గతంలో జరిగిన కొన్ని లోపాలను ప్రభుత్వం అంగీకరించిందని, వాటిని అధిగమించడానికి తగిన చర్యలు తీసుకున్నామని చెప్పారు.
“మా వైపు కొన్ని లోపాలు ఉన్నాయని మేము అంగీకరిస్తున్నాము, వాటిని వెంటనే సరిదిద్దాము. పరీక్షల కోసం ఒక మల్టీలేయర్డ్ (బహుళ అంచెల) వ్యవస్థను ఏర్పాటు చేశాము. బిహార్లో కొందరు వ్యవస్థను దెబ్బతీయాలని చూశారు, కానీ వారిని వెంటనే అరెస్ట్ చేశాము” అని తెలిపారు.
పేపర్ లీక్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామని, కేసుల విచారణను వేగవంతం చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను (Fast-track courts) ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ప్రధాని నరేంద్ర మోదీ తమకు అప్పగించిన ఈ భారీ బాధ్యతను అన్ని రాష్ట్రాల సహకారంతో విజయవంతంగా పూర్తి చేశామని, దివ్యాంగులైన విద్యార్థుల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు పరీక్షా విధానంపై నమ్మకం ఉంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
గత మే 3న జరిగిన పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో రద్దు కాగా, దానికి బదులుగా ఆదివారం మధ్యాహ్నం 2:00 గంటల నుండి సాయంత్రం 5:15 గంటల వరకు పెన్-అండ్-పేపర్ విధానంలో నీట్-యూజీ రీ-ఎగ్జామ్ నిర్వహించారు.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana
Jun 25, 2026 11:31 AM IST













