Last Updated:
Viral Photo: పబ్లిక్ సర్వీస్ చేయడానికి బాధ్యతాయుతమైన ఉద్యోగాలు చేసే ప్రతీ ఒక్కరికి ఈ వార్త చెప్పపెట్టులాంటిది. రాజస్థాన్లో ఓ లేడీ కానిస్టేబుల్ సాధారణ వృద్ధుడి పట్ల ప్రవర్తించిన తీరు ఇప్పుడు యావత్ దేశ ప్రజలందరూ చూస్తున్నారు.
Viral Photo: పబ్లిక్ సర్వీస్ చేయడానికి బాధ్యతాయుతమైన ఉద్యోగాలు చేసే ప్రతీ ఒక్కరికి ఈ వార్త చెప్పపెట్టులాంటిది. రాజస్థాన్లో ఓ లేడీ కానిస్టేబుల్ సాధారణ వృద్ధుడి పట్ల ప్రవర్తించిన తీరు ఇప్పుడు యావత్ దేశ ప్రజలందరూ చూస్తున్నారు. ఆమె తీరుపై తీవ్ర అభ్యంతరాలు, విమర్శలు రావడంతో ప్రభుత్వం వెంటనే ఆ మహిళా పోలీస్ని విధుల్లోంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అసలు ఏం జరిగింది..? ఎక్కడ ఈఘటన చోటుచేసుకుంది..? లేడీ కానిస్టేబుల్ చేసిన తప్పేంటో ఈ కథనంలో వివరంగా ఉంది చూడండి.
ఒంటిపైన ఖాకీ డ్రెస్ ఉంటే చాలు పోలీసుల్లో కొందరు వాళ్లు చేయాల్సిన డ్యూటీ మర్చిపోయి ఏదో పై నుండి ఊడిపడినట్లుగా బిల్డప్ ఇవ్వడం ప్రస్తుతం అనేక చోట్ల చూస్తున్నాం. ప్రజాస్వామిక ప్రభుత్వంలో స్వేచ్ఛా భారతదేశంలో పౌరుల రక్షణ, భద్రతను కాపాడే పవిత్రమైన , బాధ్యతాయుతమైన ఉద్యోగం పోలీస్ జాబ్. అలాంటి వృత్తిలో ఉంటూ ఓ మహిళా కానిస్టేబుల్ ప్రవర్తించిన తీరుపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొవాల్సిన పరిస్థితి తలెత్తింది. రాజస్థాన్లోని దుంగార్పూర్ జిల్లాలో ఒక వృద్ధుడు తన సమస్యను చెప్పుకోవడానికి పోలీస్ స్టేషన్లో నిల్చొని ఎదురుచూస్తుండగా, అక్కడి మహిళా కానిస్టేబుల్ టేబుల్పై రెండు కాళ్లు చాపి దర్జాగా కూర్చున్న ఫొటో, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై ప్రజల నుండి భారీ ఎత్తున నిరసన వ్యక్తమవడంతో ఉన్నతాధికారులు సదరు కానిస్టేబుల్ను సస్పెండ్ చేశారు.
సిన్సియర్గా డ్యూటీ చేయాల్సిన పోలీస్ సిబ్బంది, అధికారులు సైతం ఈ ఘటనను సమర్ధించలేకపోతున్నారు. దుంగార్పూర్ జిల్లాలోని బిచ్చివార పోలీస్ స్టేషన్లో ఈఘటన చోటుచేసుకుంది. ఒక నిరుపేద వృద్ధుడు తన ఫిర్యాదును నమోదు చేయించుకోవడానికి పోలీస్ స్టేషన్కు వచ్చాడు. అక్కడ విధుల్లో ఉన్న రీనా గార్గ్ అనే మహిళా కానిస్టేబుల్ ఆ వృద్ధుడి బాధను వినడానికి ఏమాత్రం ఆసక్తి చూపించలేదు. అంతే కాదు స్టేషన్కి వచ్చిన వృద్దుడికి కనీసం మర్యాద కూడా ఇవ్వలేదు. ఆమె తన కుర్చీలో కూర్చుని, ఎదురుగా ఉన్న ఆఫీస్ డెస్క్పై రెండు కాళ్లు పెట్టి ఏమాత్రం బాధ్యత లేకుండా వ్యవహరించింది. ఆ సమయంలో సదరు వృద్ధుడు దీనంగా ఆమె వైపు చూస్తూ గంటల తరబడి కూర్చోవాల్సి వచ్చింది.
పోలీస్ స్టేషన్లో ఉన్న ఎవరో ఈ నిర్వాకాన్ని తమ మొబైల్లో ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ చిత్రం ఇంటర్నెట్లో ప్రత్యక్షమైన కాసేపటికే నెటిజన్లు సదరు లేడీ కానిస్టేబుల్ తీరుపై విరుచుకుపడ్డారు. ఒక సీనియర్ సిటిజన్ పట్ల ఇంత అమానవీయంగా, అగౌరవంగా ప్రవర్తిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు వ్యవస్థలో ఉండాల్సిన కనీస వృత్తిపరమైన నిబద్ధత ఇదేనా? అంటూ రాజస్థాన్ పోలీస్ విభాగాన్ని ప్రశ్నించారు. ఈ వ్యవహారం తీవ్రరూపం దాల్చడంతో దుంగార్పూర్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ మనీష్ కుమార్ రంగంలోకి దిగారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఆధారాలను పరిశీలించిన అనంతరం, సదరు మహిళా కానిస్టేబుల్ రీనా గార్గ్ను విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు, శాఖ ప్రతిష్ఠను దిగజార్చినందుకు తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
లేడీ కానిస్టేబుల్ రీనా గార్గ్ ప్రవర్తనతో పోలీస్ శాఖకు పరువు పోయినట్లుగా భావిస్తూ ఆమెపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలను కూడా ప్రారంభించినట్లు దుంగార్పూర్ పోలీసులు తమ అధికారిక ప్రకటనలో స్పష్టం చేశారు. బాధితులు, ముఖ్యంగా వృద్ధులు, మహిళలు పోలీస్ స్టేషన్కు వచ్చినప్పుడు వారి పట్ల మర్యాదగా, సున్నితంగా వ్యవహరించాలని, ఇటువంటి ప్రవర్తనను ఎంతమాత్రం సహించేది లేదని ఉన్నతాధికారులు హెచ్చరించారు.
Hyderabad,Telangana
Jun 27, 2026 12:10 PM IST













