Last Updated:
ఆయుషి తన కన్నతల్లిని వదిలించుకోవాలని పథకం వేసింది. ఈ క్రమంలో ఆమె తన సమీప బంధువులైన ఆరుగురితో కలిసి తల్లిని హతమార్చడానికి కుట్ర పన్నింది.
Murder: ఆస్తిపాస్తులు, ఉద్యోగం కోసం బంధాలు, అనుబంధాలను మరిచిపోతున్న కొందరు ఎంతటి దారుణానికైనా ఒడిగడుతున్నారు. తండ్రి మరణం తర్వాత తల్లికి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగాన్ని, కుటుంబ ఆస్తిని ఎలాగైనా దక్కించుకోవాలనే దుర్బుద్ధితో ఓ కూతురు కన్నతల్లిని హతమార్చిన ఘోర కలియుగ ఘటన రాజస్థాన్లో వెలుగుచూసింది. ఈ హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి తప్పించుకోవాలని చూసిన నిందితురాలి కుట్రను జైపూర్ పోలీసులు ఛేదించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. రాజస్థాన్లోని ప్రతాప్ నగర్ పరిధిలోని రవీంద్రనగర్కు చెందిన సీరత్ శర్మ (45) భర్త ఏడాది క్రితం మరణించారు. దీంతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఆమెకు కోర్టులో కారుణ్య నియామకం కింద లోయర్ డివిజన్ క్లర్క్ (LDC)గా ఉద్యోగం లభించింది. అయితే, ఆ ప్రభుత్వ ఉద్యోగం తల్లికి కాకుండా తనకు దక్కాలని ఆమె కుమార్తె ఆయుషి ఆశపడింది. ఈ విషయమై తల్లిని ఒప్పించే ప్రయత్నం చేయగా, అందుకు సీరత్ శర్మ నిరాకరించారు. దీంతో తల్లిపై ఆయుషి తీవ్ర ఆగ్రహం పెంచుకుంది.
ఉద్యోగంతో పాటు కుటుంబ ఆస్తి మొత్తం తనకే దక్కాలనే దురాశతో ఆయుషి తన కన్నతల్లిని వదిలించుకోవాలని పథకం వేసింది. ఈ క్రమంలో ఆమె తన సమీప బంధువులైన ఆరుగురితో కలిసి తల్లిని హతమార్చడానికి కుట్ర పన్నింది. ఈ నెల 2వ తేదీన ప్రణాళిక ప్రకారం సీరత్ శర్మను కారుతో బలంగా ఢీకొట్టించి చంపేశారు. పైకి ఇదొక సాధారణ రోడ్డు ప్రమాదంలా కనిపించేలా నిందితులు డ్రామా ఆడారు.
సీరత్ శర్మ మృతిపై ఆమె సోదరుడు రాజేష్కు అనుమానం రావడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని లోతుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ఆయుషి ప్రవర్తనపై అనుమానం వచ్చింది. విచారణలో ఆయుషి తన బంధువులతో కలిసి చేసిన హత్యోదంతం మొత్తం బయటపడింది.
ఈ దారుణ కుట్రను ఛేదించిన పోలీసులు కూతురు ఆయుషితో పాటు ఆమెకు సహకరించిన బంధువులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరికొకరు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని డీసీపీ రంజిత్ శర్మ వెల్లడించారు. కన్నకూతురే కాలయముడిగా మారి తల్లి ప్రాణాలు తీయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













