Last Updated:
Skyroot Aerospace: స్కైరూట్ వ్యవస్థాపకులతో జరిగిన చర్చలు చాలా అద్భుతంగా ఉన్నాయనీ, వారు ఇప్పటి వరకు సాగించిన ప్రయాణం గురించి, భవిష్యత్తు అంతరిక్ష ప్రణాళికల గురించి వారి ఆలోచనలను వినడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని ప్రధాని మోదీ తన పోస్టులో తెలిపారు.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ప్రైవేట్ అంతరిక్ష సంస్థ అయిన ‘స్కైరూట్ ఏరోస్పేస్’ వ్యవస్థాపకులు పవన్ చందన, నాగ భరత్ డాకాతో ఒక ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీ ప్రధానంగా భారతదేశ ప్రైవేట్ అంతరిక్ష రంగంలో ఒక గొప్ప మైలురాయిగా నిలిచిన విక్రమ్ సిరీస్ రాకెట్ ప్రయోగం విజయవంతం కావడాన్ని పురస్కరించుకుని జరిగింది.
ఆమధ్య స్కైరూట్ సంస్థకు చెందిన మొట్టమొదటి పూర్తి స్థాయి ఆర్బిటల్-క్లాస్ రాకెట్ దాదాపు 450 కిలోమీటర్ల భూకక్ష్యను విజయవంతంగా చేరుకుంది. ఈ చారిత్రాత్మక ప్రయోగానికి ‘మిషన్ ఆగమన్’ అని పేరు పెట్టారు. ఈ ప్రయోగ విజయంతో, ప్రైవేటు రంగంలో కక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టగల సామర్థ్యాన్ని స్వంతం చేసుకున్న ప్రపంచంలోని 3వ దేశంగా భారతదేశం అవతరించింది. ప్రధాని మోదీ ఈ అద్భుతమైన విజయాన్ని ప్రశంసిస్తూ, ఈ అంశం తమ చర్చల్లో ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చిందని సామాజిక మాధ్యమం ఎక్స్ (X) వేదికగా పంచుకున్నారు.
A great interaction with Pawan Chandana and Naga Bharath Daka of Skyroot Aerospace.
The success of Vikram-1 naturally featured prominently in our discussion, in addition to many other interesting subjects. Happy to hear about their journey so far and their insights on what lies… https://t.co/I3aEVfa7fb
— Narendra Modi (@narendramodi) July 27, 2026
యువ పారిశ్రామికవేత్తలలో ఉన్న అపారమైన శక్తి, గొప్ప ఆశయం, సానుకూల దృక్పథం.. మన దేశ ప్రైవేట్ అంతరిక్ష వాతావరణంలో అంతర్లీనంగా ఉన్న ఉత్సాహభరితమైన స్ఫూర్తిని అద్భుతంగా ప్రతిబింబిస్తున్నాయని ప్రధాని మోదీ మెచ్చుకున్నారు. అలాగే స్కైరూట్ బృందానికి తన శుభాకాంక్షలు తెలిపారు.
స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థను మాజీ ఇస్రో శాస్త్రవేత్తలు పవన్ కుమార్ చందన, నాగ భరత్ డాకా.. కలిసి హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభించారు. భారతదేశ అంతరిక్ష రంగాన్ని ప్రైవేటు సంస్థలకు కూడా అందుబాటులోకి తెచ్చిన కేంద్ర ప్రభుత్వ కొత్త సంస్కరణల కారణంగా, ముఖ్యంగా ఇన్-స్పేస్ (IN-SPACe), ఇస్రో (ISRO) వంటి ప్రభుత్వ సంస్థల నుండి లభిస్తున్న మద్దతుతో స్కైరూట్ వంటి స్టార్టప్ సంస్థలు దేశ ప్రగతిలో భాగమవుతున్నాయి. ఈ సమావేశం గురించి స్కైరూట్ ఏరోస్పేస్ కూడా హర్షం వ్యక్తం చేస్తూ, తమ సంస్థ ఎదుగుదల, రాకెట్ విజయగాథ, అంతరిక్ష రంగం భవిష్యత్తుపై తమకున్న లక్ష్యాలను గౌరవనీయ ప్రధాని నరేంద్ర మోదీతో పంచుకోవడం తమకు దక్కిన గొప్ప గౌరవంగా అభివర్ణించింది.
ఈ ప్రయోగాన్ని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నిర్వహించారు. 24 మీటర్ల పొడవైన ఈ కార్బన్-కాంపోజిట్ రాకెట్ తన 3 సాలిడ్-ఫ్యూయల్ దశలనూ, ఆర్బిటల్ అడ్జస్ట్మెంట్ మాడ్యూల్ను విజయవంతంగా పూర్తి చేసింది. ప్రైవేట్ రంగంలో భారతదేశం సాధించిన ఈ మైలురాయి.. దేశీయ అంతరిక్ష టెక్నాలజీలో సరికొత్త శకానికి నాంది పలికింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అందించిన అత్యాధునిక మౌలిక సదుపాయాలు, ప్రభుత్వం కల్పించిన అనుకూల వాతావరణం వల్లే ప్రైవేట్ కంపెనీలు తమ కొత్త ఆలోచనలను విజయవంతమైన స్పేస్ మిషన్లుగా మార్చగలుగుతున్నాయి అని స్కైరూట్ సంస్థ స్పష్టం చేసింది.
భారతదేశం తన అంతరిక్ష రంగాన్ని ప్రైవేటు ఆటగాళ్లకు తెరవడం వలన అంతర్జాతీయ వాణిజ్య అంతరిక్ష మార్కెట్లో (Global Commercial Space Market) మన దేశం ఒక ప్రధాన శక్తిగా ఎదుగుతోందని ఈ భేటీ ద్వారా స్పష్టమవుతోంది. ప్రధాన మంత్రి ఇచ్చిన ఈ స్ఫూర్తితో.. “మా ప్రయాణం ఇప్పుడే మొదలైంది, భారతదేశం నుంచి ప్రపంచం నలుమూలల వైపుకీ” అంటూ స్కైరూట్ సంస్థ తన నిబద్ధతను పునరుద్ఘాటించింది. రాబోయే రోజుల్లో అతి తక్కువ ఖర్చుతో శాటిలైట్లను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టే అత్యుత్తమ సంస్థగా స్కైరూట్ ఎదగాలనే ఆశాభావాన్ని ఈ సమావేశం ప్రతిబింబిస్తోంది.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana
Jul 28, 2026 11:28 AM IST














